Kamala Harris: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు గడువు సమీపిస్తోంది. నవంబర్ 5న పోలింగ్ జరుగనుంది. దీంతో అభ్యర్థులు తుది దశ ప్రారంంతో హోరెత్తిస్తున్నారు. అన్ని వర్గాల ఓట్ల కోసం ప్రయత్నిస్తున్నారు. తుది దశ ప్రచారంతో దూసుకుపోతున్నారు. అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేందుకు కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. హామీలు ఇస్తున్నారు. వరాలు కురిపిస్తున్నారు. ఈ ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా పోటీ నెలకొంది. గెలుపు ఎవరిదో ప్రీపోల్ అంచనాలకు కూడా చిక్కడం లేదు. సర్వే సంస్థలు ఒకసారి ట్రంప్కు ఆధిక్యం ఇస్తుండగా, మరోసారి కమలా హారిస్కు ఆధిక్యం ఇస్తున్నాయి. దీంతో పోలింగ్ నాటికి కూడా గెలుపు ఎవరిదో చెప్పడం కష్టమని అంటున్నారు నిపుణులు. ఇక ఈ ఎన్నికల్లో వలసలు, ఆబార్షన్లు కీలక ప్రచారాస్త్రాలుగా మారాయి. మరోవైపు ఇజ్రాయెల్ యుద్ధం, రష్యా–ఉక్రెయిన్ వార్ అంశాలు కూడా ప్రభావం చూపుతాయని అంటున్నారు ఈ తరుణంలో అమెరికా ఉపాధ్యక్షురాలు, డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ కీలక వ్యాఖ్యలు చేశారు.
రష్యా అధ్యక్షుడిపై..
అమెరికా, రష్యా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. ఆధిపత్యం కోసం ఇరు దేశాలు పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలోనే అమెరికా మద్దతులో దూకుడు ప్రదర్శించిన తమ పొరుగు దేశం ఉక్రెయిన్పై రష్యా రెండేళ్లుగా సైనిక చర్య కొనసాగిస్తోంది. ఇప్పటికీ వార్ ముగియడం లేదు. మరోవైపు ఉక్రెయిన్కు అమెరికా ఆయుధాలు, ఆర్థిక సాయం చేస్తోంది. ఈ తరుణంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న కమలా హారిస్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే రష్యా–ఉక్రెయిన్ శాంతి చర్చల్లో భాగంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ను కలవనని ప్రకటించారు. ఓ ఇంటర్వ్యూలో ఈమేరకు సమాధానం ఇచ్చారు. ఉక్రెయిన్ లేకుండా ద్వైపాక్షిక చర్చలు కావు. ఉక్రెయిన్ భవిష్యత్తుపై ఆదేశమే చెప్పాలి అని పేర్కొన్నారు. ఇదే సమయంలో ఉక్రెయిన్పై రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విధానాలపై కమలా విమర్శలు చేశారు. ట్రంప్ అధ్యక్షుడిగా ఉంటే పుతిన్ ప్రస్తుతం ఉక్రెయిన్లోని కీవ్లో అధికారాన్ని సాధించేవారని తెలిపారు.
ట్రంప్కు అండగా మస్క్…
ఇదిలా ఉంటే.. నవంబర్ 5న జరుగనున్న అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్కు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మద్దతు తెలిపారు. ట్రంప్ అధ్యక్షుడు అయ్యే వరకు తాను ఆయన వెంటనే ఉంటానని తెలిపారు. టకర్ కార్లసన్తో జరిగిన ఇంటర్వ్యూలో ఈమేరకు వ్యాఖ్యానించారు. ట్రంప్ గెలవకపోతే అమెరికాకు ఇవే చివరి ఎన్నికలని పేర్కొన్నారు. డెమొక్రాట్లు గెలిస్తే ప్రజాస్వామ్యానికి ప్రమాదమని ఆరోపించారు. వలస వాదుల అంశంపైనా మస్క్ స్పందిచారు. ఉద్దేశపూర్వకంగా కొన్ని కీలక రాస్ట్రాలకు వలసవాదులను తరలిస్తున్నారని ఆరోపించారు. వారికి పౌరసత్వం కల్పిస్తే డెమోక్రాట్లకు ఓటర్లుగా మారతారని తెలిపారు. డెమొక్రాట్లు పాలిస్తే వచ్చే నాలుగేళ్లలో స్వింగ్ స్టేట్స్ కనుమరుగవుతాయని ఆరోపించారు.