Hormuz Strait open: అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్ ప్రపంచ వాణిజ్యాన్ని శాసిస్తోంది. యుద్ధం మొదలైన మొదటి రోజే సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హతమయ్యాడు. దీంతో ఆగ్రహించిన ఇరాన్ సరుకు, చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధిని మూసివేసింది. అమెరికా మద్దతు దేశాలైన సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈ, బహ్రెయిన్, టర్కీ తదితర దేశాలపై ప్రతీకార దాడులు చేస్తోంది. ముఖ్యంగా గల్ఫ్ దేశాల ఆయిల్ రిఫైనరీలు, గ్యాస్ యూనిట్లను ధ్వంసం చేస్తోంది. దీంతో చమురు రవాణా ఆగిపోయింది. హర్మూజ్ వద్ద పెద్ద ఎత్తున నౌకలు నిలిచిపోయాయి. నౌకలు కదిలితే దాడి చేస్తామని ఇరాన్ హెచ్చరించింది 20 రోజులుగా అక్కడే ఉంటున్నాయి. మరోవైపు చమురు సంక్షోభం ముంచుకొస్తోంది. ఈ నేపథ్యంలో హర్మూజ్ తెరవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు 48 గంటల డెడ్లైన్ విధించాడు. ఈ నేపథ్యంలోఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ సంచలన ప్రకటన చేశారు. ఇరాన్పై దాడి చేసే వారికి తప్ప మిగతా అందరికీ జలసంధి తెరిచే ఉంటుందని స్పష్టం చేశారు. తమపై జరుగుతున్న దాడులకు యుద్ధభూమిలోనే దీటుగా బదులిస్తామన్నారు. చమురు సంక్షోభం నెలకొన్న వేళ ఈ ప్రకటన ఊరటనిస్తోంది. దీంతో అక్కడ చిక్కుకున్న 22 భారత నౌకలు తిరిగొచ్చేందుకు కూడా మార్గం సుగమమయ్యే అవకాశం ఉంది.
అమెరికాకు హెచ్చరిక..
పశ్చిమాసియా ఉద్రిక్తతలు తీవ్రమైన నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు అమెరికాకు హెచ్చరిక చేశాడు. తమ భూభాగంపై జరిగిన దాడులకు యుద్ధక్షేత్రంలోనే తగిన జవాబును ఇస్తామని హెచ్చరించారు. హార్ముజ్ ప్రపంచ చమురు రవాణాకు కీలకం. దీనిని తెరిచి ఉంచడం ద్వారా ఇరాన్ ఆర్థిక ఒత్తిడిని తగ్గించుకోవాలని భావిస్తోంది. ఈ చర్య యుద్ధ ఆంక్షల మధ్య దౌత్య ప్రయత్నాల్లా కనిపిస్తోంది.
Also Read: దురంధర్ మాదిరిగానే.. ఒక్కో ఉగ్రవాది ఒక్కో తీరుగా..గూస్ బంప్స్ తెప్పించే స్టోరీ ఇదీ
చిక్కుకున్న 22 భారత నౌకలు..
హార్ముజ్ ప్రాంతంలో భారత్కు చెందిన 22 నౌకలు చిక్కుకున్నాయి. తాజాగా ఇరాన్ ప్రకటనతో భారత వాణిజ్య నౌకలు తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఆగిపోయిన చమురు, సరుకు రవాణా పునఃప్రారంభానికి మార్గం సుగమమవుతుంది. భారతదేశం చమురు దిగుమతుల్లో ఈ సంధి ముఖ్యమైనది. 40 శాతం చముదు ఈ సంధి గుండానే రవాణా జరుగుతోంది. నౌకలు సురక్షితంగా తిరిగి రావడం వల్ల ఆర్థిక నష్టాలు తగ్గే అవకాశం ఉంది.
ఇరాన్ తాజా ప్రకటన ద్వారా శత్రువులను వదిలిపెట్టేది లేదని స్పష్టం చేసింది. ఇదే సమయంలో మిగతా దేశాలతో సంబంధాలను బలోపేతం చేయాలని చూస్తోంది. భవిష్యత్తులో దౌత్య చర్చలకు ఇది ఆధారంగా మారవచ్చు. అయితే, ఉద్రిక్తతలు తగ్గకపోతే ప్రాంతీయ సంక్షోభం మరింత తీవ్రమవుతుంది.