School Bus Fire Accident : ఘోరం.. కనీవినీ ఎరుగని దారుణం.. స్కూల్ బస్సులో మంటలు.. మాటలకందని విషాదం..

ఘోరం.. కనివిని ఎరుగని దారుణం.. అది మాటలకందని విషాదం.. దట్టంగా పొగలు.. ఎంతకూ తగ్గని మంటలు.. ఆ మంటలను ఆర్పడానికి అగ్నిమాపక సిబ్బంది చేయని ప్రయత్నం అంటూ లేదు.

Written By: Anabothula Bhaskar, Updated On : October 1, 2024 7:30 pm

School Bus Fire Accident

Follow us on

School Bus Fire Accident :  ఆసియా ఖండంలో విలాస దేశంగా పేర్కొన్న థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ లో దారుణం చోటుచేసుకుంది.. పాఠశాలకు విద్యార్థులను తీసుకెళ్తున్న ఓ బస్సు ప్రమాదానికి గురైంది. ఆ ప్రమాదంలో ఆ స్కూల్ బస్ పూర్తిగా దగ్ధమైంది. బ్యాంకాక్ లోని సెంట్రల్ ఉతాయ్ థాని ప్రావిన్స్ నుంచి ఆ బస్సు తిరిగి వస్తోంది. ఈ క్రమంలోనే బస్సు ప్రమాదానికి గురైంది. ఆ ఘటన చోటుచేసుకుంటున్న సమయంలో బస్సులో 44 మంది ట్రావెల్ చేస్తున్నారు. అందులో విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి ప్రయాణం చేస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో 25 మంది విద్యార్థులు చనిపోయారని భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే మంటలు బస్సును మొత్తం అంటుకున్నాయి. దట్టమైన పొగలు అలముకున్నాయి. మంటల తాకిడికి బస్సు మొత్తం కాలిపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఆ మంటలను ఆర్పడానికి తీవ్రంగా ప్రయత్నం చేశారు. బస్సు ప్రమాదానికి గురైన చోటు రద్దీగా ఉన్న ప్రాంతం కావడంతో.. ఆ ప్రాంతం మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది. ఈ ఘటన జరిగిన వెంటనే థాయిలాండ్ ప్రధానమంత్రి షిన వత్రా వెంటనే స్పందించారు. మృతులకు సంతాపం తెలిపారు. అయితే విద్యార్థులు ఒక ట్రిప్ కు వెళ్లి వస్తుండగా ఈ దారుణం జరిగిందని తెలుస్తోంది. ” ఆ బస్సులో మొత్తం 44 మంది ప్రయాణిస్తున్నారు. అందులో 38 మంది విద్యార్థులున్నారు. ఆరుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. ఆ ప్రమాదం నుంచి ఇప్పటివరకు 16 మంది విద్యార్థులను, ముగ్గురు ఉపాధ్యాయులను రక్షించాం. మిగిలిన వారికి సంబంధించి ఇంకా స్పష్టత రావాల్సి ఉందని” థాయిలాండ్ రవాణా శాఖ అధికారులు పేర్కొన్నారు..

ఈ ప్రమాదంపై థాయిలాండ్ మంత్రి అనుతిన్ చర్న విరకుల్ మాట్లాడారు. మృతుల సంఖ్యను ఇంకా ధ్రువీకరించలేదని చెప్పారు. ఘటన స్థలంలో దర్యాప్తు కొనసాగుతుందని పేర్కొన్నారు. జరిగిన సంఘటన ప్రకారం 25 మంది చనిపోయారని అంజనా వేస్తున్నామని వివరించారు. అయితే మంటలు తాకిడి ఎక్కువగా ఉండడంతో బస్సులో నుంచి మృతదేహాలను బయటికి తీయలేకపోయామని ఆయన పేర్కొన్నారు.. అయితే ఆ మంటల్లో చాలామంది సజీవ దహనం అయ్యారని తెలుస్తోంది. ఈ ప్రమాదానికి సంబంధించి అనేక వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ అయ్యాయి. ఆ వీడియోల ప్రకారం బస్సులో మంటలు విపరీతంగా కనిపిస్తున్నాయి. నల్లటి పొగ అలముకుంది. మంటలు తాకిడి కూడా తీవ్రంగా ఉంది. అయితే ఆ బస్సు నుంచి ఎటువంటి ఆర్త నాదాలు వినిపించకపోవడం విశేషం. అయితే ఆ ప్రమాదం జరిగినప్పుడు బస్సు టైరు ఒకటి పేలిపోయిందని స్థానికులు చెబుతున్నారు. అయితే సహాయక చర్యల్లో ఒక సంస్థ పాలుపంచుకుంది. ఆ సమయంలో పదికి పైగా మృతదేహాలను తాము చూసామని ఆ సంస్థ బాధ్యులు ఫేస్ బుక్ వేదికగా వెల్లడించారు. ” ఆ సమయంలో ప్రమాద తీవ్రత దారుణంగా ఉంది. మంటలు విపరీతంగా ఉన్నాయి. అయినప్పటికీ మేము సహాయక చర్యల్లో పాల్గొన్నాం. ఆ సమయంలో 10 దాకా మేము మృతదేహాలను చూసామని” ఆ సంస్థ బాధ్యులు పేర్కొన్నారు.