US Iran Conflict: పశ్చిమాసియాలో 40 రోజుల తర్వాత యుద్ధం ఆగింది. పాకిస్తాన్, టర్కీ, బహ్రెయిన్ చొరవతో ఇరాన్–అమెరికా మధ్య రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. దీనిని శాశ్వత శాంతి దిశగా తీసుకెళ్లాలని డొనాల్డ్ ట్రంప్ ప్రోత్సాహంతో పాకిస్తాన్ చొరవ తీసుకుంది. ఇరు దేశాల ముఖాముఖి చర్చలకు ఏర్పాటు చేసింది. ఏప్రిల్ 11, 12న ఇస్లామాబాద్ వేదికగా చర్చలు జరిగాయి. కానీ విఫలమయ్యాయి. ఇరు దేశాల మధ్య శాంతి కుదిర్చి క్రెడిట్ కొట్టేయాలని ఆశించిన పాకిస్తాన్ ఆశలపై నీళ్లు చల్లాయి. పాక్ ప్రయత్నం అమెరికా ఒత్తిడి, ఇరాన్ మొండితనంతో చర్చలు ఆగిపోయాయి.
రంగంలోకి రష్యా..
శాంతి చర్చలు విజయవంతం చేయడంలో పాకిస్తాన్ విఫలమైన నేపథ్యంలో రష్యా రంగంలోకి దిగింది. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజష్కియాన్కు ఫోన్ చేసి చర్చించారు. మధ్యవర్తిత్వానికి తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. యుద్ధం ఆపాలని, చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని కోరారు. అయితే దీనిపై అమెరికా ఇంకా స్పందించలేదు. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో జరిపిన చర్చలు మాత్రం విఫలమైనట్లు ట్రంప్ ప్రకటించారు.
రష్యా కీలక పాత్ర..
రష్యా ఇరాన్తో ఎస్–400 డీల్స్, సైబీరియా గ్యాస్ పైప్లైన్లు ద్వారా పటిష్టమైన సంబంధాలు కలిగి ఉంది. సిరియా యుద్ధంలో ఇరాన్తో కలిసి పనిచేసిన అనుభవం పుతిన్కు ఉంది. ఈ మధ్యవర్తిత్వం అమెరికా ఆధిపత్యాన్ని తగ్గించి బ్రిక్స్ ప్రభావం పెంచే అవకాశం ఉంది. ఇందుకు అమెరికా అంగీకరిస్తుందా.. ఇజ్రాయెల్ ఒప్పుకుంటుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రష్యా చొరవకు చైనా, టర్కీ మద్దతు తెలిపాయి.
పుతిన్ ప్రయత్నాలు విజయవంతమైతే, మధ్యప్రాచ్యలో కొత్త డిప్లొమసీ యుగం మొదలవుతుంది. అయితే అమెరికా ఆంక్షలు, ఇరాన్ అంతర్గత రాజకీయాలు శాంతి చర్చలకు అడ్డంకిగా మారాయి. రష్యా మధ్యవర్తిత్వాన్ని అమెరికా, ఇరాన్ అంగీకరిస్తే తదుపరి చర్చలు మాస్కోలో జరిగే అవకాశం ఉంది.