Poonam Gupta: ఆమె ఉన్నత చదువులు చదివింది. కానీ ఆశించిన ఉద్యోగం రాలేదు. రిస్క్ చేయాల్సిందే అని నిర్ణయించుకుంది. ఆ నిర్ణయమే ఇప్పుడు ఆమెను రూ.800 కోట్ల కంపెనీకి అధిపతిని చేసింది. కృషి, పట్టుదలతో వ్యాపారవేత్తగా రాణిస్తోంది. ఎంతోమంది మహిళలకు, పర్యావరణ వేత్తలకు స్ఫూర్తిగా నిలుస్తోంది ఎన్ఆర్ఐ వ్యాపారవేత్త పూనమ్ గుప్తా.
ఢిల్లీలో పుట్టి..
పూనమ్ గుప్తా ఢిల్లీలో 1976, ఆగస్టు 17న జన్మించింది. అక్కడి లేడీ ఇర్విన్ స్కూల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుకుంది. తర్వాత ఢిల్లీ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. లేడీ ఇర్విన్ స్కూల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో విద్యాభ్యాసం. ఆ తర్వాత, ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్, ఢిల్లీ FORE స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్, హాలెండ్లోని మాస్ట్రిక్ట్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఇంటర్నేషనల్ బిజినెస్ అండ్ మార్కెటింగ్లో ఎంబీఏ పట్టాలు పుచ్చుకుంది.
పెళ్లి తర్వాత..
ఇక పూనమ్ గుప్తా 2002లో వివాహం చేసుకుంది. భర్త పనీత్ గుప్తాతో కలిసి స్కాట్లాండ్ వెళ్లింది. అక్కడ కూడా పూనమ్కు ఉద్యోగం దొరకలేదు. అర్హతలు ఉన్నా పదే పదే జాబ్కు రిజెక్ట్ అయింది. ఇదే సమయంలో ఆమె తల్లి అనారోగ్యంతో మరణించింది. దీంతో మరింత కుంగిపోయింది. కానీ, నిరాశ చెందకుండా భిన్నంగా ఆలోచించింది. వ్యాపారం వైపు అడుగులు వేసింది.
రూ.లక్ష పెట్టుబడితో..
2003లో స్కాట్లాండ్లోని కిల్మాకోమ్లో కేవలం రూ.లక్ష పెట్టుబడితో పర్యావరణ స్పృహతో, రీసైక్లింగ్ బిజినెస్ పీజీ పేపర్ కంపెనీ లిమిటెడ్ పేరుతో సంస్థను స్థాపించింది. స్క్రాప్ పేపర్ను రీసైక్లింగ్ చేయాలనే ఆలోచనతోనే అక్కడి ప్రభుత్వం అనుమతితో కంపెనీ ఏర్పాటు చేసింది. మొదటి రెండేళ్లు ఒంటరిగా పనిచేసింది. తర్వాత ఒక స్నేహితుడు ఆమెతో పార్ట్టైమ్ ప్రాతిపదికన చేరాడు. వ్యాపారం విస్తరించడంతో ఆమె భర్తనే రూ.1.5 కోట్ల ప్యాకేజీతో కంపెనీలో చేరాడు.
రూ.800 కోట్ల టర్నోవర్..
లండన్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న పేపర్ కంపెనీలలో ఒకటిగా పూనమ్ కంపెనీ నిలిచింది. ఈ క్రమంలో ఏడాదికి ప్రస్తుతం రూ.800 కోట్ల టర్నోవర్ కలిగి ఉంది. యూరప్, అమెరికాలోని కంపెనీల నుంచి చిత్తు కాగితాలను కొనుగోలు చేసి దాని నుంచి మంచి నాణ్యమైన కాగితాన్ని తయారు చేసి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తోంది. ఇలా పీజీ పేపర్ సంస్థ విస్తరించి ప్రపంచంలోని 53 దేశాల నుంచి వస్తువులను దిగుమతి, ఎగుమతులను చేస్తుంది. ఇక పీజీ సంస్థ తొలుత ఎగుమతి చేసింది ఇండియాకే కావడం విశేషం.
ఇతర వ్యాపారాలు..
ఇక పూనమ్ గుప్తా ప్రయాణం పేపర్ సంస్థతోనే ఆగిపోలేదు. హాస్పిటాలిటీ, రియల్ ఎస్టేట్, మెడికల్తోపాటు ఐటీ రంగంలో కూడా ప్రవేశించింది. సుమారు 350 మంది ఉద్యోగులతో స్కాట్లాండ్ ప్రధాన కార్యాలయం వేదికగా తన సేవలు అందిస్తోంది. ఏడు దేశాలలో ఉన్న అనేక కార్యాలయాలతో 9 కంపెనీలు ఉన్నాయి. రానున్న రోజుల్లో పీజీ పేపర్ ఆదాయం రూ.1000 కోట్లను అధిగమించాలని పూనమ్గుప్తా లక్ష్యంగా పెట్టుకుంది.
వరించిన అవార్డులు..
పీజీ పేపర్ సీఈవో, యూకేలో ఉమెన్స్ ఎంటర్ప్రైజ్ స్కాట్లాండ్ అంబాసిడర్గా, అత్యంత అరుదైన గుర్తింపు పొందిన పారిశ్రామిక వేత్తల్లో పూనమ్గుప్తా ఒకరు. యూకే–ఇండియా సంబంధాలతో అత్యంత ప్రభావవంతమైన 100 మంది ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలకు వైవిధ్యాన్ని ప్రోత్సహిస్తారు. ఇండియాలోని యువతుల విద్య కోసం, మహిళా సాధికారతకు మద్దతు ఇస్తున్నారు పూనమ్ గుప్తా. ఈమెకు ఇద్దరు కూతుళ్లు సాన్వి, అన్య ఉన్నారు.