Pakistan economic crisis : మన దాయాది దేశం పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. ఇప్పటికే ఐఎంఎఫ్, అమెరికా, సౌదీ అరేబియా, యూఏఈ ఇచ్చే అప్పులతోనే నెట్టుకొస్తోంది. ఇక ప్రస్తుతం జరుగుతున్న ఇరాన్, అమెరికా–ఇజ్రాయెల్ యుద్ధం పాకిస్తాన్ను ఆటలో అరటిపండులా మార్చింది. ఎవరూ ఆ దేశాన్ని పట్టించుకోవడం లేదు. మరోవైపు ఆయిల్ సంక్షోభంతో దేశంలో వ్యవస్థలు స్తంభించాయి. ఇటీవలే ప్రభుత్వం పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. ఉద్యోగులకు వర్క్ఫ్రం హోం ఇచ్చింది. రవాణా వ్యవస్థ స్తంభించిపోతోంది. విద్యుత్ సమస్యలు పెరిగాయి. పెట్రోల్ ధర రూ.350 చేరింది. ఈ పరిస్థితిలో షెహబాజ్ షరీఫ్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.
రిపబ్లిక్ డే వేడుకలు రద్దు…
షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్తాన్ ప్రభుత్వం మార్చి 23 రిపబ్లిక్ డే వేడుకలను పూర్తిగా రద్దు చేసింది. గల్ఫ్ ప్రాంతంలో ఇరాన్పై అమెరికా–ఇజ్రాయిల్ యుద్ధం ఇంధన సంక్షోభాన్ని తీవ్రతరం చేసింది. పొదుపు చర్యలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు, దీనితో దేశ ఆర్థిక సవాళ్లు మరింత స్పష్టమవుతున్నాయి.
నిలిచిన ఆయిల్ సరఫరా..
ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేస్తున్నాయి. దీంతో ఇరాన్ గల్ఫ్ దేశాలపై దాడి చేస్తోంది. మరోవైపు అమెరికాపై ఒత్తిడి తెచ్చేలా ఆర్మూజ్ జలసంధిని మూసివేసింది. అమెరికా, ఇజ్రాయెల్ నౌకలను అనుమతించడం లేదు. దీంతో ఇంధన సరఫరా ఆగిపోయింది. పాకిస్తాన్ 80% చమురు గల్ఫ్లోని ఇరాన్, సౌదీల నుంచి తీసుకుంటుంది. ధరలు డాలర్ 150కి చేరడంతో పెట్రోల్ లీటర్ రూ.350, డీజిల్ రూ.300కు చేరింది. దీంతో విద్యుత్ సమస్యలు కూడా ఉన్నాయి. రవాణా సమస్యలు తీవ్రమవుతున్నాయి.
జెండా ఆవిష్కరణకే పరిమితం..
మార్చి 23న నిర్వహించే రిపబ్లిక్ వేడుకల్లో సైనిక కవాతు, 31 గన్ సెల్యూట్, సాంస్కృతిక కార్యక్రమాలు, ఫైర్వర్క్స్ అన్నీ ఆపేశారు. బదులుగా రాజధాని ఇస్లామాబాద్లో సాధారణంగా జెండా ఆవిష్కరణ మాత్రమే. ప్రాంతీయ స్థాయిలో కూడా నిరాడంబర కార్యక్రమాలు మాత్రమే, ఖర్చు పెట్టుబడులు తగ్గించాలని ఆదేశాలు.
పొదుపు చర్యలు..
ఇంధనం కొరత కారణంగా వర్క్ వీక్ను 4 రోజులకు మార్చారు. సర్కారీ ఆఫీసులు వారానికి రెండు రోజులు మూసివేస్తారు. మంత్రులు, అధికారుల విదేశీ ప్రయాణాలు నిలిపివేశారు. వేతనాలు 30 శాతం తగ్గించారు. చమురు రిజర్వులు 11 రోజులు, ఎల్పీజీ నిల్వలు 9 రోజులు మాత్రమే ఉన్నాయి. దీంతో ప్రైవేట్ ఈవెంట్లపై నిషేధం విధించారు. రిపబ్లిక్ డే వేడుకల రద్దుతో రూ.500 కోట్లు ఆదా అవుతాయని ఆర్థికశాఖ అంచనా వేసింది.
చారిత్రక సందర్భం..
రిపబ్లిక్ డే 1940 లాహోర్ రిజల్యూషన్ స్మరణకు, 1956 రాజ్యాంగ అమలుకు చిహ్నం. 1971 యుద్ధం తర్వాత కూడా రద్దు కాలేదు. ఇది 75 ఏళ్ల చరిత్రలో మొదటిసారి, ఆర్థిక సంక్షోభ తీవ్రతను తెలియజేస్తుంది. ప్రధాని కార్యాలయం ప్రకటనలో ‘జాతీయ ఐక్యత ప్రదర్శన‘ పేరిట సమర్థించారు.
పాకిస్తాన్ నిర్ణయం రాజకీయంగా ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుంది, కానీ దీని ద్వారా జాతీయ సమస్యలపై దృష్టి సారించారు. మధ్యప్రాచ్య యుద్ధం కొనసాగితే పాక్కు మరిన్ని సవాళ్లు తప్పవు.
