Oman
Oman: గల్ఫ్ దేశం ఒమన్ రాజధాని మస్కట్ లో కాల్పుల ఘటన కలకలం రేపింది. దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా అనేక మంది గాయపడ్డారు. చనిపోయినవారిలో ఒకరు భారతీయుడు. గాయపడిన వారిలో కూడా ఒక భారతీయుడు ఉన్నట్లు ఒమన్లోని భారతీయ రాయబార కార్యాలయం తెలిపింది. భారతీయుడి మృతికి సంతాపం ప్రకటించింది. బాధిత కుటుంబానికి అన్నివిధాలుగా సహాయం అందిస్తామని తెలిపింది.
నలుగురు పాకిస్థానీయులు..
ఇక కాల్పుల ఘటనలో మృతిచెందిన వారిలో మరో నలుగురు పాకిస్థానీయులు. ఈ ఘటనలో మరో 30 మంది గాయపడినట్లు అక్కడి అధికారులు తెలిపారు. ఈమేరకు పాకిస్థాన్ అధికారులకు అధికారులు సమాచారం అందించారు. మృతులకు సంతాపం తెలిపారు. గాయపడిన వారికి ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు.
అసాధారణ ఘటన..
ఒమన్ దేశంలో హింసాత్మక ఘటనలు సాధారణంగా జరుగవు. కఠిన చట్టాల కారణంగా అందరూ చట్టాలకూ లోబడే ఉంటారు. కానీ, తాజాగా ముగ్గురు దుండుగులు మసీదు వద్ద అసాధారణంగా జరిపిన కాల్పులతో ఒమన్ ఉలిక్కి పడింది. ఈఘటనలో ఐదుగురు మరణించారు. 30 మందికిపైగా గాయపడ్డారు. కాల్పుల ఘటనలో అప్రమత్తమైన ఒమన్ రాయల్ పోలీసులు దుండగులను వెంటనే మట్టుపెట్టారు. అయితే కాల్పులకు కారణం ఏమిటి.. దీని వెనుక ఎవరున్నారు. అనేది మాత్రం వెల్లడి కాలేదు. గాయపడినవారిలో విదేశాలకు చెందినవారు ఉన్నట్లు తెలిపారు.
పరిస్థితి చక్కదిద్దిన పోలీసులు
కాల్పుల తర్వాత పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు. ఈమేరకు చర్యలు చేపట్టారు. అవసరమైన అన్ని భద్రతా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఘటన స్థలం నుంచి ఆధారాలు కూడా సేకరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈమేకు ఎక్స్లో సమాచారం పోస్టు చేశారు.
అప్రమత్తమైన అమెరికా..
ఒమన్లో జరిగిన కాల్పుల ఘటనతో అగ్రరాజ్యం అమెరికా అప్రమత్తమైంది. ఒమన్లో ఉంటున్న అమెరికన్లు కాల్పులు జరిగిన ప్రదేశానికి దూరంగా ఉండాలని తమ పౌరులకు సూచించింది. ఒమన్ అధికారులతో అమెరికా రాయబార కార్యాలయం అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. కాల్పుల ఘటనపై ఆరా తీశారు. ఈ ఘటన వెనుక ఎవరు ఉన్నారనే విషయంపై దర్యాప్తు చేపట్టారు.
స్పందించిన పాక్..
ఇదిలా ఉండగా ఒమన్లో కాల్పుల ఘటనపై పాకిస్థాన్ కూడా స్పందించింది. ఘటనను ఖండించింది. ఇది ఉగ్రవాదుల పనే అని పేర్కొంది. పాకిస్థానీయులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
40 శాతం మంది ప్రవాసులే..
ఇక ఒమన్లో 4 మిలియన్లకుపైగా జనాభా ఉంది. ఇందులో 40 శాతం మంది ప్రవాస కార్మికులే. ఉపాధి నిమిత్తం భారత్తోపాటు పాకిస్థాన్, బంగ్లాదేశ్, బూటాన్, ఆఫ్ఘనిస్థాన్ తదితర దేశాల నుంచి ఒమన్కు వలస వచ్చినవారు అధికంగా ఉన్నారు.