Homeఅంతర్జాతీయంModi double impact India: మోడీ డబుల్ ధమాకా.. దశాబ్దాల పీడలకు విరుగుడు

Modi double impact India: మోడీ డబుల్ ధమాకా.. దశాబ్దాల పీడలకు విరుగుడు

Modi double impact India: 2014లో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు, భారతదేశం రెండు భయంకరమైన అంతర్గత సవాళ్లను ఎదుర్కొంటోంది. అందులో ఒకటి నక్సలిజం. దీనిని మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ‘దేశంలో అతిపెద్ద అంతర్గత సవాలు‘ అని పిలిచారు. రెండోది జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదం. ఇక్కడ వేర్పాటువాద విషసర్పం బుసలు కొడుతూ, నిత్యం రక్తపాతానికి కారణమవుతోంది. కానీ 12 ఏళ్లలో మోదీ ప్రభుత్వం అనుసరించిన కఠిన, సమగ్ర విధానాలతో ఈ రెండు సమస్యలకు దాదాపు చెక్‌ పెట్టింది. ఇది కేవలం భద్రతా విజయం కాదు.. అభివృద్ధి, పాలనా సంస్కరణల సమన్వయ ఫలితం.

2014 నాటి పరిస్థితి..
2014 నాటికి నక్సలిజం 126 జిల్లాలకు విస్తరించి ఉంది. ‘తిరుపతి నుంచి పశుపతి‘ వరకు, ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్ర నుంచి తమిళనాడులోని వయనాడ్‌ వరకు, కర్ణాటక, మహారాష్ట్ర, ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌ మీదుగా నేపాల్‌ వరకు ఒక విశాలమైన ‘రెడ్‌ కారిడార్‌‘ను నిర్మించాలని మావోయిస్టులు భావించారు. 2014లో ఏడాదికి 1,091 నక్సల్‌ సంబంధ ఘటనలు జరిగాయి. 2014 నాటికి 1,800 మంది భద్రతా సిబ్బంది, 4,700 మంది సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఛత్తీస్‌గఢ్‌లోని అబూజ్‌మడ్‌ అడవులు మావోయిస్టులకు అడ్డాగా మారాయి. అక్కడ వారు సమాంతర ప్రభుత్వాన్ని నడిపారు. బడులు, ఆస్పత్రులు లేవు, కానీ గిరిజనులపై పట్టు సాధించారు. నాడు ఛత్తీస్‌గఢ్‌లో ఏడాదికి కేవలం 1,084 కి.మీ రోడ్లు మాత్రమే నిర్మించబడ్డాయి.

కశ్మీర్‌ ఉగ్రవాదం..
జమ్మూ కశ్మీర్‌లో 2014 నాటికి 250 ఉగ్రదాడులు జరిగాయి. 200కు పైగా ఉగ్రవాదులు క్రియాశీలకంగా ఉన్నారు. హిజ్‌బుల్‌ ముజాహిద్దీన్, లష్కర్‌–ఏ–తోయిబా వంటి సంస్థలు సొంత సామ్రాజ్యాన్ని నిర్మించాయి. భారత్‌కు 1.25 కోట్ల మంది పర్యాటకులు వస్తే, కశ్మీర్‌ లోయకు వెళ్లేది కేవలం 13 లక్షలు మాత్రమే. వేర్పాటువాద విషసర్పం బుసలు కొడుతూ, అభివృద్ధిని అడ్డుకుంది.

మోదీ వ్యూహం సక్సెస్‌..
2014 తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ రెండు సమస్యలపై దృష్టి సారించింది. భద్రతా బలగాలకు పూర్తి అధికారం, అత్యాధునిక ఆయుధాలు ఇచ్చింది. నక్సల్స్‌ ఆర్థిక మూలాలను దెబ్బతీసింది. టెక్నాలజీ సాయంతో నక్సల్‌ నాయకత్వాన్ని టార్గెట్‌ చేసింది. నక్సలిజంపై విజయం సాధించింది. 2014–2024 మధ్య నక్సల్‌ సంబంధ ఘటనలు 53 శాతం తగ్గాయి. 2014లో 126 నక్సల్‌ ప్రభావిత జిల్లాలు ఉండగా, 2024 నాటికి అవి కేవలం 18కి తగ్గాయి. ఇందులో 6 జిల్లాలు మాత్రమే ఇప్పుడు తీవ్ర ప్రభావిత జిల్లాలుగా ఉన్నాయి. 2025 నాటికి ఇది 12కి, 2026 నాటికి 3కి తగ్గింది. 2011లో 445 మంది నక్సలైట్లు లొంగిపోగా, 2025 అక్టోబర్‌ నాటికి ఈ సంఖ్య 1,225కి పెరిగింది. 2025లో 2,300 మంది లొంగిపోయారు. 2026లో ఇప్పటికే 630 మంది లొంగిపోయారు. అగ్రనేతలు కూడా ఆయుధాలు వదిలి రాజ్యాంగాన్ని చేతపట్టారు.

అభివృద్ధి వేగవంతం..
2012లో ఏడాదికి 1,084 కి.మీ రోడ్లు నిర్మించబడితే, ఇప్పుడు ఏడాదికి 12 వేల కి.మీ రోడ్లు నిర్మించబడుతున్నాయి. 8,500 మొబైల్‌ టవర్లు నిర్మించబడ్డాయి. 576 ఫోర్టిఫైడ్‌ పోలీస్‌ స్టేషన్లు, 68 హెలిప్యాడ్లు నిర్మించబడ్డాయి. ఛత్తీస్‌గఢ్‌ దేశ మధ్యభాగంలో ఉండటంతో, నాలుగు దిక్కుల నుంచి ఆపరేషన్లు నిర్వహించడం సాధ్యమైంది. దీంతో నక్సలిజం వెన్నువిరిగి, ‘నక్సల్‌–ముక్త భారత్‌‘ దిశగా దేశం అడుగులు వేస్తోంది.

కశ్మీర్‌లో మార్పు..
2019 ఆగస్టులో ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత కశ్మీర్‌లో పూర్తి మార్పు వచ్చింది. 2022లో 1.88 కోట్ల మంది పర్యాటకులు కశ్మీర్‌లో పర్యటించారు. 2023లో ఈ సంఖ్య 2.11 కోట్లకు పెరిగింది. కశ్మీర్‌ లోయకు వెళ్లినవారు 2012లో 13 లక్షలు ఉండగా, ఇప్పుడు కోటి మందికి పెరిగింది. ఉగ్రదాడులు గణనీయంగా తగ్గాయి. 2019లో 250 నుంచి 2023 నాటికి 29కి తగ్గాయి. ఉగ్రవాదుల ఆర్థిక మూలాలను భారత్‌ దెబ్బకొడుతోంది. కశ్మీర్‌ లోయలో త్రివర్ణ పతాకం ఎగురుతోంది. వేర్పాటువాదం 2019కి ముందు ఉన్నంత తీవ్రంగా లేదు. రాళ్లదాడి, హింసాత్మక షట్‌డౌన్లు పూర్తిగా ఆగిపోయాయి.

విజయానికి కారణాలు..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పూర్తి సమన్వయం. పోలీసులకు పూర్తి అధికారం, ఆధునిక ఆయుధాలు అందించింది. రోడ్లు, మొబైల్‌ టవర్లు, ఆస్పత్రులు, పాఠశాలల నిర్మాణంతో గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వం పట్టు సాధించింది. డ్రోన్లు, ఉపగ్రహ చిత్రాలు, సమాచార సేకరణతో నక్సల్‌ నాయకత్వాన్ని టార్గెట్‌ చేసింది. ఆయుధాలు వదిలినవారికి పునరావాసం, ఉద్యోగాలు ఇవ్వడం వల్ల నక్సల్స్‌ సంఖ్య తగ్గింది. ఆర్టికల్‌ 370 రద్దు వంటి ధైర్యసాహసాలు కశ్మీర్‌లో కొత్త యుగాన్ని ప్రారంభించాయి. ఉగ్రవాదం పూర్తిగా అంతం కావడానికి ఇంకా సమయం పడుతుంది. ఇది సరిహద్దు ప్రాంతం కావడం, పాకిస్తాన్‌ ఉగ్రవాదులను పంపడం వల్ల పూర్తి నియంత్రణ కష్టంగా ఉంది.

మోదీ ప్రభుత్వం అనుసరించిన అభివృద్ధి విధానం భారతదేశాన్ని రెండు భయంకరమైన అంతర్గత సవాళ్ల నుంచి కాపాడింది. నక్సలిజం గణనీయంగా తగ్గి, దేశం ‘నక్సల్‌–ముక్త‘ దిశగా అడుగులు వేస్తోంది. కశ్మీర్‌లో ఉగ్రవాదం కొనఊపిరితో ఉంది, పర్యాటకం, అభివృద్ధి కొత్త శిఖరాలను అందుకుంటున్నాయి. ఇది కేవలం భద్రతా విజయం కాదు.. పాలనా సంస్కరణలు, అభివృద్ధి, జాతీయవాదం కలగలిపిన సమగ్ర విజయం. భారతదేశం ఇప్పుడు మరింత బలమైన, ఏకీకృత దేశంగా మారింది.

 

 

 

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version