Iran Attacks Gulf Countries: మిడిల్ ఈస్ట్ లో పరిస్థితులు అంతకంతకు దారుణంగా మారిపోతున్నాయి. ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయిల్ ముప్పేట దాడి చేస్తున్నాయి. ఇప్పటికే ఇరాన్ లో ఉన్న చమురు శుద్ధి చేసే ప్రాంతాలపై అమెరికా దాడులు చేసింది. ఇజ్రాయిల్ కూడా అదే స్థాయిలో దాడులు మొదలుపెట్టింది. దీంతో చమురు రవాణా కు ఆటంకం ఏర్పడుతోంది.
Also Read: మిడిల్ ఈస్ట్ లో యుద్ధం… మన బ్రహ్మోస్ గురించి చర్చ.. ఎందుకంటే
అమెరికా ఆ స్థాయిలో దాడులు చేస్తున్నప్పటికీ ఇరాన్ కేవలం గల్ఫ్ దేశాలపై మాత్రమే తన ప్రతీకారాన్ని చూపిస్తోంది. అటు ఇజ్రాయిల్ మీద కూడా దాడులు చేస్తోంది. అమెరికా భూభాగాన్ని మాత్రం ఇంతవరకు ఇరాన్ టచ్ చేయలేకపోతోంది. దీనికి గల కారణాలను అంతర్జాతీయ యుద్ద రంగ నిపుణులు రకరకాలుగా విశ్లేషిస్తున్నారు.
ఇరాన్ రాజధాని తెహరాన్ నుంచి అమెరికా తూర్పు తీరం దాదాపు పదివేల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇరాన్ దగ్గర ఉన్న బాలిస్టిక్ మిస్సైల్స్ కేవలం 2000 నుంచి 2,500 కిలోమీటర్లు దూరం మాత్రమే ప్రయాణించగలుగుతాయి. అందువల్ల ఇరాన్ అమెరికా భూభాగాన్ని ఇంతవరకు టచ్ చేయలేకపోయింది. ఇజ్రాయిల్.. గల్ఫ్ ప్రాంతాల్లో అమెరికా మిలిటరీ బేస్ ల మీద దాడులు చేస్తోంది. మరోవైపు అమెరికా వద్ద ఖండాంతరమైన క్షిపణులు ఉన్నాయి. ఇవి 13,000 కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. గంటకు 28 వేల కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతాయి. అమెరికా వద్ద బీ2, బీ52 బాంబర్లు ఉన్నాయి. ఇవి అత్యంత ప్రమాదకరమైనవి. ఇవి లక్ష్యాలను చేదించడంలో చురుకైన పాత్ర పోషిస్తాయి. నష్టాన్ని తీవ్రంగా కలిగించడంలోనూ అదే స్థాయిలో పనిచేస్తాయి.
అమెరికా ఇటీవల కాలంలో బీ2, బీ52 బాంబర్లను ఎక్కువగా వాడలేదు. ఇరాన్ మీద మాత్రం విస్తృతంగా ప్రయోగించింది. ఇరాన్ దేశాన్ని కకావికలం చేసింది. ఇరాన్ మీద అమెరికా ఇప్పటికీ దాడులు చేస్తూనే ఉంది. ఇజ్రాయిల్ కూడా తగ్గేది లేదు అన్నట్టుగా బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇలా దాడులు, ప్రతిదాడులతో మిడిల్ ఈస్ట్ ఒకరకంగా రావణ కాష్టం మాదిరిగా మారిపోయింది. ఇప్పట్లో పరిస్థితులు చక్కబడే సూచనలు కనిపించడం లేదు. అమెరికా మాత్రం చర్చలకు ఇరాన్ తమ దగ్గరికి వస్తున్నట్లు ప్రకటించినప్పటికీ.. అదంతా సత్య దూరమని తెలుస్తోంది.