Iran vs USA war impact: పశ్చిమాసియాలో అమెరికా రాజేసిన అగ్గి సెగ ప్రపంచానికి తాకింది. ఇంధన మార్కెట్లను అతలాకుతలం చేస్తోంది. హార్మూజ్ జలసంధి మూసివేత భయంతో క్రూడ్ ఆయిల్ ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ సంక్షోభంలో ఆయిల్, గ్యాస్ దిగుమతులపై ఆధారపడిన భారత్, యూకే, యూరోపియన్ యూనియన్, సౌత్ కొరియా, జపాన్ వంటి దేశాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. మరోవైపు, సంక్షోభానికి కారణమైన అమెరికాతోపాటు రష్యా, కెనడా, నార్వే వంటి ఇంధన ఎగుమతిదారులు భారీ లాభాలు ఆర్జిస్తున్నారు.
భారత్పై తీవ్ర ప్రభావం
భారత్ తన ఇంధన అవసరాల్లో 85 శాతం దిగుమతులపై ఆధారపడి ఉంది. క్రూడ్ ధరలు బ్యారెల్కు పది డాలర్లు పెరిగితే దేశంపై అదనంగా 12 నుంచి 18 బిలియన్ డాలర్లు(సుమారు రూ.లక్ష కోట్ల నుంచి రూ.1.5 లక్షల కోట్లు) అదనపు భారం పడుతోంది. నెల రోజుల్లో మాత్రమే ఇండియా దిగుమతి బిల్లు 42 బిలియన్ డాలర్లు పెరిగింది. ఈ సంక్షోభం కారణంగా భారత రూపాయి విలువ 94.8కి పడిపోయింది. డాలర్ బలపడటం, దిగుమతి ఖర్చు పెరగడంతో విదేశీ మారక నిల్వలు కరిగిపోతున్నాయి.
ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి
క్రూడ్ ధరల పెరుగుదలతో భారత్ జీడీపీ వృద్ధి 0.50 శాతం తగ్గే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణం 30 నంచి 40 బేస్పాయింట్లు పెరుగుతుంది. ఆటోమొబైల్, ఏవియేషన్, పెయింట్స్ వంటి రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
లాభపడుతున్న దేశాలు ఇవీ..
యుద్ధం వల్ల అత్యధికంగా లాభపడుతున్న దేశం రష్యా. భారత్కు రష్యన్ ఆయిల్ అమ్మకాలు 50 శాతం పెరిగాయి. నెల రోజుల్లో మాత్రమే అదనంగా 5 బిలియన్ డాలర్లు(రూ47,500 కోట్లు)ఆదాయం సంపాదించింది. చైనా కూడా రష్యా నుంచి భారీగా చమురు కొనుగోలు చేస్తోంది. అమెరికా, కెనడా, నార్వే కూడా ఇంధన సరఫరా ద్వారా నెలలో ఒక్కోదాని సరాసరి 3 బిలియన్ డాలర్ల నుంచి 5 బిలియన్ డాలర్ల అదనపు ఆదాయం పొందాయి.
Also Read: ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. యుద్ధంలోకి అనవసరంగా దిగిన అమెరికా
ఇరాన్కు ఆశ్చర్యకర లాభం
యుద్ధంలో ప్రత్యక్షంగా చిక్కుకున్న ఇరాన్ కూడా రెట్టింపు ప్రయోజనం పొందుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర 100 డాలర్లు దాటగా, ఇరాన్ తన చమురును గత 10 నెలల్లో ఎన్నడూ లేనంత తక్కువ డిస్కౌంట్కు విక్రయిస్తోంది. రోజువారీ ఆదాయం రెట్టింపైంది.
నష్టపోతున్న దేశాలు..
యుద్ధం కారణంగా భారత్ అదనపు దిగుమతి ఖర్చు 15 నుంచి 18 బిలియన్ డాలర్లకు పెరిగింది. రూపాయి ఆల్టైం కనిష్టానికి పడిపోయింది. యూరోపియన్ యూనియన్ ఇంధన బిల్లు 30 శాతం పెరిగింది. జర్మనీ, ఇటలీ వంటి పారిశ్రామిక దేశాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.# జపాన్, సౌత్ కొరియా 99 శాతం ఇంధన దిగుమతులపై ఆధారపడతాయి. దీంతో ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ ఎగుమతులపై ప్రతికూల ప్రభావం పడుతోంది.యూకే బ్రెక్సిట్ తర్వాత ఇంధన భద్రత సమస్యలు మరింత తీవ్రమయ్యాయి. పెట్రోల్, డీజిల్ ధరలు 25 శాతం పెరిగాయి.
చైనాపై తక్కువ ప్రభావం?
చైనాపై ఈ సంక్షోభం ప్రభావం తక్కువగా ఉంది. రష్యా నుంచి సరసమైన ధరలకు చమురు సరఫరా జరుగుతోంది. స్ట్రాటెజిక్ ఆయిల్ రిజర్వులు (90 రోజుల అవసరానికి సరిపడా) ఉన్నాయి. ఇరాన్ నుంచి నేరుగా చమురు దిగుమతి అవుతోంది.
ఇరాన్–అమెరికా యుద్ధం ఒక తరహా ఆర్థిక యుద్ధంగా మారింది. సంక్షోభాన్ని సృష్టించిన అమెరికా, దానికి ప్రత్యక్ష కారణమైన ఇరాన్ రెండూ లాభపడుతుండగా, మధ్యలో చిక్కుకున్న భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు తీవ్రంగా నష్టపోతున్నాయి.
రష్యా, కెనడా, నార్వే వంటి దేశాలు నెలకు 3 నుంచి 5 బిలియన్ డాలర్ల అదనపు ఆదాయం ఆర్జిస్తుండగా, భారత్ మాత్రం 15 నుంచి 18 బిలియన్ల అదనపు భారం మోస్తోంది. యుద్ధం ముగిసిన తర్వాత కూడా, ప్రపంచ ఇంధన మార్కెట్లు, వాణిజ్య సమీకరణాలు శాశ్వతంగా మారిపోయే అవకాశం ఉంది.