Homeఅంతర్జాతీయంIran US Tensions: ఇరాన్‌–అమెరికా ఉద్రిక్తతలు.. మళ్లీ కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు?

Iran US Tensions: ఇరాన్‌–అమెరికా ఉద్రిక్తతలు.. మళ్లీ కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు?

Iran US Tensions: పశ్చిమాసియాలో ఆధిపత్యం కోసం అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇరాన్‌తో యుద్ధం మొదలు పెట్టాడు. ఇజ్రాయెల్‌తో కలిసి దాదాపు 50 రోజులు భీకర దాడులు చేశారు. దీంతో ఇరాన్‌ కీలక నేతలు, సైనికాధికారులు మరణించినా యుద్ధంలో వెనక్కి తగ్గలేదు. అమెరికా దాడులను తట్టుకోవడంతోపాటు అమెరికా అనుకూల గల్ఫ్‌ దేశాలపై ప్రతీకార దాడులు చేసింది. దీంతో అమెరికాకు, అనుకూల దేశాలకు తీవ్ర నష్టం జరిగింది. దీంతో అమెరికా పరోక్షంగా ఓడిపోయినట్లయింది. దీంతో పరువు పోకుండా ట్రంప్‌ చర్చల పేరుతో సీజ్‌ఫైర్‌ చేరుకున్నారు. కానీ తుది ఒప్పందం కుదరలేదు.

మళ్లీ యుద్ధ మేఘాలు..
ట్రంప్‌ పాలనలో ఇరాన్‌ విషయంలో అమెరికా ధోరణి మరోసారి కఠినంగా మారుతోంది. ఇటీవలి ప్రకటనలు, చర్యలు చూస్తే, రాజకీయ ఒత్తిడి, ఆర్థిక ఆంక్షలు, యుద్ధ సంకేతాలు ఒకేసారి కనిపిస్తున్నాయి. ఇది కేవలం బెదిరింపులు మాత్రమేనా లేదా నిజమైన సంఘర్షణ దిశగా అడుగులు వేస్తున్నారా అనేది ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో కీలక చర్చనీయాంశమైంది.

తాజాగా ట్రంప్‌ హెచ్చరికలు..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇరాన్‌పై మరో దాడి అవసరమైతే వెనకాడేవాడిని కాదని స్పష్టం చేశారు. ఇరాన్‌తో ఒప్పందం కుదుర్చుకోవడానికి పరిమిత సమయమే ఇస్తున్నట్లు చెప్పడం ద్వారా ఒత్తిడి పెంచుతున్నారు. ఈ హెచ్చరికలు గతంలో ఇరాన్‌ అణు కార్యక్రమం, ప్రాంతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో వస్తున్నాయి. ఇక్కడ ముఖ్యమైన అంశం ఏమిటంటే, చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌ ఇరాన్‌కు ఆయుధాలు సరఫరా చేయబోమని ట్రంప్‌కు మాట ఇచ్చినట్లు తెలిపారు. ఇది అమెరికా దౌత్య విజయంగా చూడవచ్చు, కానీ చైనా–ఇరాన్‌ సంబంధాల లోతును పరిగణనలోకి తీసుకుంటే ఈ వాగ్దానం ఎంతవరకు నిలుస్తుందనేది సందేహాస్పదం.

యూఏఈపై డ్రోన్‌ దాడులు..
ప్రాంతీయ అస్థిరత సంకేతంగా గడిచిన 48 గంటల్లో ఇరాన్‌ నుంచి వచ్చిన ఆరు డ్రోన్లను యూఏఈ అడ్డుకున్నట్లు ప్రకటించింది. ఇది హౌతీ తిరుగుబాటుదారులు లేదా ఇరాన్‌లో ఐఆర్‌జీసీ చేస్తున్న చర్యలకు సంకేతం. ఈ సంఘటనలు పర్షియన్‌ గల్ఫ్‌లో షిప్పింగ్‌ మార్గాలు, ఇంధన రవాణా భద్రతను ప్రభావితం చేస్తాయి. ఇటువంటి ఘటనలు మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలను మరింత పెంచుతాయి.

ఇరాన్‌పై కొత్త ఆంక్షలు..
ఇదిలా ఉంటే.. అమెరికా ఆర్థిక యుద్ధం కొనసాగుతోంది. ఇరాన్‌ ఆంక్షలు ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తున్న నేపథ్యంలో అమెరికా మరిన్ని ఆంక్షలు విధించింది. ఇరాన్‌ ఫారిన్‌ కరెన్సీ ఎక్సే్ఛంజ్‌ సంస్థ ‘ఇబ్రహిమీ – అసోసియేట్స్‌’ (అమిన్‌ ఎక్సే్ఛంజ్‌)పై ఆంక్షలు విధించడం ద్వారా చైనా, హాంకాంగ్, యూఏఈలోని అనుబంధాలను టార్గెట్‌ చేసింది. ఇంకా 19 ఇరాన్‌ నౌకలపైనా ఆంక్షలు వచ్చాయి. ఈ చర్యలు ఇరాన్‌ ఆర్థిక వ్యవస్థను మరింత ఒత్తిడికి గురి చేస్తాయి. ఇరాన్‌ ఆయిల్‌ ఎగుమతులు, డాలర్‌ లావాదేవీలు ఇప్పటికే గణనీయంగా ప్రభావితమవుతున్నాయి.

అమెరికా టార్గెట్‌ అదే..
అమెరికా లక్ష్యం ఇరాన్‌ను ఒప్పందం వైపు లాగడం లేదా దాని ప్రాంతీయ ప్రభావాన్ని తగ్గించడమేనని విశ్లేషకులు అంటున్నారు. ఇరాన్‌ అణు కార్యక్రమాన్ని అడ్డుకోవడం, మధ్యప్రాచ్యంలో తన మిత్రదేశాల (ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, యూఏఈ) భద్రతను కాపాడటం, చైనా–రష్యా ప్రభావాన్ని పరిమితం చేయడం. ఆంక్షల ఒత్తిడిలో దేశాంతరాల్లో ప్రాక్సీ శక్తుల ద్వారా ప్రతిస్పందించే అవకాశం ఉంది. డ్రోన్, క్షిపణి దాడులు పెరగవచ్చు.

చైనా, రష్యా వైపు ఇరాన్‌ మరింత మొగ్గు చూపితే అంతర్జాతీయ సంబంధాలు మారవచ్చు. ఇంధన ధరలు పెరిగి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కూడా ప్రభావం చూపవచ్చు. ఇప్పటి వరకు ఆంక్షలు, హెచ్చరికలు, దౌత్యం ఒకేసారి నడుస్తున్నాయి. కానీ ఒక చిన్న తప్పిదం లేదా తీవ్రమైన ఘటన ఈ ఉద్రిక్తతలను పూర్తి స్థాయి సంఘర్షణగా మార్చే ప్రమాదం ఉంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version