Homeఅంతర్జాతీయంIran retaliatory attacks latest news: ఇరాన్‌ ప్రతీకార దాడులు.. మధ్యప్రాచ్యం మళ్లీ భీకర యుద్ధం!

Iran retaliatory attacks latest news: ఇరాన్‌ ప్రతీకార దాడులు.. మధ్యప్రాచ్యం మళ్లీ భీకర యుద్ధం!

Iran retaliatory attacks latest news: పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధం రాజుకుంటోంది. ఒకవైపు అమెరికా–ఇరాన్‌ మధ్య శాంతి చర్చలు జరుగుతున్నాయి. ఇంకోవైపు అమెరికా ఆత్మరక్షణ పేరుతో ఇరాన్‌లోని హార్ముజ్, క్వెష్మ్‌ ప్రాంతాలపై విరుచుకుపడుతోంది. ఒకవైపు శాంతి చర్చలు అంటూనే దాడులు ప్రారంభించిన అమెరికాపై ఇరాన్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో మరోసారి తీవ్రమైన ప్రతీకార చర్యలకు దిగింది. కువైట్, బహ్రెయిన్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై మిస్సైళ్లు, డ్రోన్ల దాడులు చేసినట్లు ఇరాన్‌ ప్రకటించింది. హార్ముజ్‌ ప్రాంతం, క్వెష్మ్‌ దీవి పై అమెరికా చేసిన దాడులకు ఇది సమాధానమని ఇరాన్‌ ప్రకటించింది. ఈ పరిణామం ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న మధ్యప్రాచ్య ప్రాంతాన్ని మరింత అగ్నిగుండంగా మార్చే అవకాశం ఉంది.

ప్రతీకార యుద్ధం షురూ..
ఇరాన్‌ తన దాడులను స్పష్టంగా ‘‘ప్రతీకారం’’గా ప్రకటించడం గమనార్హం. హార్ముజ్‌ జలసంధి సమీపంలోని క్వెష్మ్‌ దీవిపై అమెరికా చేసిన దాడులు ఇరాన్‌కు పెద్ద ఎదురుదెబ్బగా మారాయి. ఈ దీవి ఇరాన్‌ సైనిక వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగిన ప్రాంతం. ఇరాన్‌ ఇప్పుడు గల్ఫ్‌ దేశాల్లోని అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా తన సామర్థ్యాన్ని ప్రదర్శించింది. అయితే ఈ దాడులు ఎంతవరకు సఫలమయ్యాయి అనేది ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. ఇరాన్‌ తన ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్స్‌ సమర్థవంతంగా పని చేస్తున్నాయని చెప్పినప్పటికీ, కువైట్, బహ్రెయిన్‌ దేశాలు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని హెచ్చరికలు జారీ చేశాయి.

హార్ముజ్‌పై ప్రభావం..
హార్ముజ్‌ జలసంధి ప్రపంచ ఆయిల్‌ సరఫరాలో కీలకమైనది. ప్రపంచంలోని 20 శాతం ఆయిల్‌ ఈ జలసంధి గుండా ప్రయాణిస్తుంది. ఇరాన్‌ ఈ ప్రాంతంపై ఎక్కువ నియంత్రణ కోరుకుంటుంది, అమెరికా, దాని మిత్రదేశాలు దాన్ని స్వేచ్ఛగా ఉంచాలని కోరుకుంటాయి. ఈ నేపథ్యంలో జరుగుతున్న దాడులు కేవలం సైనిక చర్యలు మాత్రమే కాదు, ఆర్థిక యుద్ధంగా కూడా మారుతున్నాయి. ఈ ఘర్షణలు ఇప్పటికే గ్లోబల్‌ ఆయిల్‌ మార్కెట్లను కదిలించాయి. ఆయిల్‌ ధరలు పెరిగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యంగా భారత్‌ వంటి ఆయిల్‌ దిగుమతి ఆధారిత దేశాలు ఇందుకు ఎక్కువగా గురవుతాయి.

ప్రాంతీయ స్థిరత్వం ఎటువైపు..
ఇరాన్‌–అమెరికా మధ్య ఈ తాజా ఘర్షణ గల్ఫ్‌ దేశాలను కూడా నేరుగా బలిపీఠం చేస్తోంది. కువైట్, బహ్రెయిన్‌ వంటి దేశాలు తమ భూభాగంపై జరుగుతున్న దాడుల వల్ల అనవసరమైన ముప్పును ఎదుర్కొంటున్నాయి. ఇది ఇప్పటికే సున్నితంగా ఉన్న గల్ఫ్‌ రాజకీయ సమీకరణాలను మరింత క్లిష్టంగా చేస్తోంది. ఇరాన్‌ తన సైనిక బలాన్ని ప్రదర్శించడం ద్వారా ప్రాంతంలో తన ప్రభావాన్ని నిలబెట్టుకోవాలని చూస్తోంది. మరోవైపు అమెరికా తన మిత్రదేశాల భద్రతను కాపాడుతూ, ఇరాన్‌ను కట్టడి చేయాలని ప్రయత్నిస్తోంది. ఈ పరస్పర చర్యలు పెద్ద యుద్ధంగా మారే ప్రమాదం ఉంది.

తాజా దాడులు ఇరాన్‌–అమెరికా మధ్య ఉన్న ఏవైనా డిప్లమసీ ప్రయత్నాలను మరింత క్లిష్టతరం చేస్తాయి. రెండు వైపులా ఉన్న హెచ్చరికలు, ప్రతీకార వాగ్దానాలు యుద్ధం మరింత విస్తరించే అవకాశాలను పెంచుతున్నాయి. మధ్యప్రాచ్యం ఇప్పటికే చాలా సంక్షోభాలను ఎదుర్కొంటోంది. ఇలాంటి సమయంలో రెండు పక్షాలు కూడా సంయమనం పాటించి, డిప్లమసీ మార్గాన్ని ఎంచుకోవడం అవసరం ఉంది. ఉద్రిక్తతలు త్వరగా తగ్గకపోతే, ధరల పెరుగుదల రూపంలో ప్రపంచం మొత్తం దాని ధర చెల్లించాల్సి వస్తుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version