TMC cut money controversy: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీని అక్కడి ప్రజలు చిత్తుగా ఓడించారు. దీంతో 15 ఏళ్ల తృణమూల్ పాలన ముగిసింది. వరుసగా మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ నాయకులు 15 ఏళ్లు సాగించిన అరాచకాలతో ప్రజలు విసిగిపోయారు. ఇటీవల ఎన్నికల్లో బుద్ధి చెప్పారు. ప్రస్తుతం సువేందు అధికారి నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది. దీంతో ప్రజలు గతంలో సాగించిన అరాచకాలను గుర్తుచేసుకుంటూ టీఎంసీ నేతలపై తిరగబడుతున్నారు. ఇటీవల మమత బెనర్జీ మేనల్లుడిపై దాడిచేశారు. ఈ నేపథ్యంలో బెంగాల్ రాజకీయాలు మళ్లీ ఒక వికృతమైన సత్యాన్ని బయటపెడుతున్నాయి. గతంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల నుంచి ‘కట్ మనీ’ పేరుతో లక్షలు, కోట్లు కొల్లగొట్టిన తృణమూల్ కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఆ డబ్బును ప్రజలకు తిరిగి ఇస్తున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.
బెంగాల్లో కట్ మనీ వ్యవస్థ..
2021 నుంచి ముఖ్యంగా కూచ్ బెహర్ జిల్లాలో టీఎంసీ నేతలు ప్రభుత్వ పథకాల డబ్బు వచ్చినప్పుడు ప్రతీ లబ్ధిదారుడి నుంచి రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు కట్ చేసి వసూలు చేశారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఇది ఒక్క జిల్లాకు పరిమితం కాదు. రాష్ట్రవ్యాప్తంగా ఈ అవినీతి సంస్కృతి లోతుగా వ్యాపించింది. ఇప్పుడు అదే నేతలు గ్రామాల్లోకి వెళ్లి, డబ్బు తిరిగి ఇస్తూ, క్షమాపణ చెప్పుతున్నారు. అయితే ఇది నిజమైన పశ్చాత్తాపం కాదు..అధికారం కోల్పోయిన భయం నుంచి పుట్టిన భయం.
అధికారంలో ఉన్నంత కాలం అరాచకం..
అధికారంలో ఉన్నప్పుడు టీఎంసీ నేతలు ప్రజల డబ్బును సులభంగా కొల్లగొట్టారు. అధికారం పోవడం, ప్రజలు తిరుగుబాటు చేయడం, టీఎంసీ ఎమ్మెల్యేలు కూడా సైలెంట్ కావడంతో నేతలు డబ్బు తిరిగి ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలాంటి రాజకీయ వ్యవస్థ ఎంత దారుణంగా ఉందో ఈ ఘటనలు స్పష్టంగా చెబుతున్నాయి.
బెంగాల్లో ఇప్పుడు జరుగుతున్న ఈ ‘‘కట్ మనీ రిటర్న్’’ డ్రామా ఒక విషయం స్పష్టం చేస్తోంది. అధికారం లేని చోట మాత్రమే ప్రజలకు న్యాయం జరుగుతుందన్న భయానకమైన సందేశం ప్రజల మనసుల్లోకి వెళ్తోంది. నిజమైన ప్రజాస్వామ్యం అధికారం ఉన్నా, లేకపోయినా న్యాయం జరిగే వ్యవస్థను కోరుకుంటుంది. కానీ బెంగాల్లో ప్రస్తుతం జరుగుతున్నది దానికి భిన్నం. ఈ ఘటనలు తృణమూల్కు మాత్రమే కాదు, మొత్తం రాజకీయ వ్యవస్థకు ఒక హెచ్చరిక.
