Homeఅంతర్జాతీయంIndian Immigrants Lifestyle: రూ.10 కోట్లు సంపాదించినా విదేశాల్లోనే భారతీయులు.. డబ్బు కన్నా జీవనశైలికి ప్రాధాన్యం?

Indian Immigrants Lifestyle: రూ.10 కోట్లు సంపాదించినా విదేశాల్లోనే భారతీయులు.. డబ్బు కన్నా జీవనశైలికి ప్రాధాన్యం?

Indian Immigrants Lifestyle: చాలా మంది భారతీయులు విదేశాలకు వెళ్లేటప్పుడు ఒకే ప్రణాళికతో వెళ్తారు. కొన్ని సంవత్సరాలు కష్టపడి పని చేసి, తగినంత సంపాదన చేసుకొని, భారత్‌ వచ్చి సుఖంగా స్థిరపడాలని అనుకుంటారు. చాలా మందికి ఆ ‘‘మ్యాజిక్‌ నంబర్‌’’ రూ.10 కోట్లు. కానీ ఈ కల నిజం కావడం చాలా అరుదు. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో దశాబ్దాలు గడిపిన భారతీయులను అడిగితే ఒక వాస్తవం బయటపడుతుంది. ఎక్కువ మంది శాశ్వతంగా తిరిగి రావడం లేదు. ఇటీవల అమెరికాలో ఉంటున్న భారతీయ మహిళ వీడియో వైరల్‌ అయ్యాక ఈ చర్చ మళ్లీ జాతీయ స్థాయిలో మండిపోయింది.

డబ్బు సమస్య కాదు..

వీడియోలో ఆ మహిళ విదేశాల్లో ఉండిపోవడానికి ప్రధాన కారణం డబ్బు సరిపోకపోవడం కాదని, డాలర్‌ ఆదాయం మొదలైన తర్వాత ‘మంచి జీవితం’ అనే భావన పూర్తిగా మారిపోతుందని తెలిపింది. నెలకు 50 వేలు లేదా ఒక లక్ష రూపాయలు ఇంటికి పంపడం అక్కడి వృత్తి నిపుణులకు చాలా సాధారణం అని పేర్కొంది. ఒకప్పుడు దూరంగా అనిపించిన ఆర్థిక లక్ష్యాలు చాలా త్వరగా సాధ్యమవుతాయని చెపిపంది. కానీ ఆ లక్ష్యం నెరవేరాక కూడా చాలా మంది తిరిగి రావడం లేదు. ఐదు సంవత్సరాలు అనుకున్నది పది, పది అనుకున్నది ఇరవై సంవత్సరాలు అవుతోంది.

మంచి జీవనశైలి కోసం..
కాలం గడిచేకొద్దీ వలస జీవితం కేవలం ఆర్థికం కాకుండా జీవనశైలి సంబంధిత నిర్ణయంగా మారిపోతుంది. వృత్తి పురోగతి, పిల్లల విద్య, స్నేహాలు, సమాజంలో ఏర్పడే స్థానం.. ఇవన్నీ బలపడతాయి. విదేశీ నెట్‌వర్క్‌లు భారత్‌లోని సంబంధాల కంటే ఎక్కువ బలం పొందుతాయి. ఒకప్పుడు తాత్కాలికంగా ఉన్న దేశం నెమ్మదిగా సొంత ఇల్లులా అనిపించడం మొదలవుతుంది. ముఖ్యంగా పిల్లలు ఉన్న కుటుంబాల్లో ఈ మార్పు ఎక్కువగా కనిపిస్తుంది. మొదట ఉన్నత సాలరీ కోసం వెళ్లినా, తర్వాత పిల్లలకు మంచి విద్యా వ్యవస్థ, ఉన్నతమైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, నాణ్యమైన పబ్లిక్‌ సేవలు, సురక్షిత వాతావరణంచ మొత్తం జీవన నాణ్యత కోసం అక్కడే స్థిరపడతారు.

భారత్‌ మారుతున్నా..
గత రెండు దశాబ్దాల్లో భారత్‌ ఆర్థికంగా, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌గా చాలా ముందుకు వచ్చింది. బెంగళూరు, హైదరాబాద్, పుణే వంటి నగరాలు ప్రపంచ స్థాయి అవకాశాలు అందిస్తున్నాయి. కొంతమంది ఉన్నత స్థాయి టెక్‌ ప్రొఫెషనల్స్‌ తిరిగి వస్తున్నారు కూడా. అయినప్పటికీ, ఇప్పటికీ ఏటా సుమారు 7 లక్షల మంది నైపుణ్యం కలిగిన భారతీయులు విదేశాలకు వెళ్తున్నారు. భారత్‌ ప్రపంచంలోనే అత్యధిక రెమిటెన్స్‌(సుమారు 135 బిలియన్‌ డాలర్లు) పొందుతున్న దేశం కావడం ఈ వలసల ఆర్థిక ప్రయోజనాన్ని చూపిస్తుంది. కానీ ఇది ఒకేసారి బ్రెయిన్‌ డ్రెయిన్, బ్రెయిన్‌ గెయిన్‌ రెండింటినీ సూచిస్తోంది.

అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే మొదట డబ్బు గురించి మాట్లాడుతారు, చివరికి సంస్కృతి, భావోద్వేగాలు, పిల్లల భవిష్యత్తు, సమాజంలో భాగస్వామ్యం వంటి అంశాల వైపు మళ్లిపోతారు. రూ.10 కోట్లు సంపాదించడం కంటే, ఒకసారి ఏర్పడిన జీవనశైలిని, సంబంధాలను, సామాజిక మూలాలను తొలగించడం చాలా కష్టం. డబ్బు పెంచడం సాధ్యమైనా, మనసులో ఏర్పడిన ఇల్లును మార్చుకోవడం అంత సులభం కాదు. కొందరు ఎప్పటికీ తిరిగి రారు. కొందరు ఎప్పటికైనా వస్తారని ఆశపడుతూ ఉంటారు. మరికొందరు రెండు దేశాల మధ్యనే జీవితం గడుపుతారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version