Homeఅంతర్జాతీయంIndia Turkey Strategic Rivalry: తుర్కియే తాట తీసే స్కెచ్‌.. భారత్‌ నేసిన వ్యూహాత్మక వలయం!

India Turkey Strategic Rivalry: తుర్కియే తాట తీసే స్కెచ్‌.. భారత్‌ నేసిన వ్యూహాత్మక వలయం!

India Turkey Strategic Rivalry: భారత్‌ ఇక రక్షణ దిగుమతిదారు మాత్రమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా వ్యూహాత్మక సమతుల్యతను మార్చగల ఆయుధ ఎగుమతి శక్తిగా ఎదగుతోంది. ఆర్మేనియా సైనిక పరేడ్‌లో భారత్‌ తయారీ అత్యాధునిక వ్యవస్థల ప్రదర్శన, సైప్రస్‌ అధ్యక్షుడు నికోలస్‌ క్రిస్టోడౌలిడెస్‌ భారత్‌ సందర్శన, బ్రహ్మోస్‌ వంటి ఆయుధాల కొనుగోలు చర్చలు – ఇవన్నీ తుర్కియే, అజర్‌బైజాన్‌లలో ఆందోళన సృష్టిస్తున్నాయి. ఇది సాధారణ వ్యాపారం కాదు.. ప్రాంతీయ శక్తి సమీకరణాలను పునర్నిర్మించే ధైర్యవంతమైన దౌత్యం.

ఆర్మేనియా పరేడ్‌…
మే 28న ఆర్మేనియా జాతీయ దినోత్సవం సందర్భంగా జరిగిన సైనిక పరేడ్‌లో భారత్‌ అందించిన ఏటీఏజీ హౌవిట్జర్లు, పినాకా రాకెట్‌ లాంచర్లు, రాడార్లు, ఆకాశ్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్స్‌ వంటి వ్యవస్థలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఇవి ఆర్మేనియా తన సంప్రదాయ సరఫరాదారులైన రష్యా నుంచి దూరమవుతూ, భారత్‌ వైపు మొగ్గు చూపుతున్నట్లు స్పష్టం చేస్తాయి. బ్రహ్మోస్‌ సూపర్‌సోనిక్‌ క్రూజ్‌ మిస్సైల్స్‌ కొనుగోలు చర్చలు కూడా జరుగుతున్నట్లు సమాచారం. అజర్‌బైజాన్‌తో సుదీర్ఘ సంఘర్షణ ఉన్న నేపథ్యంలో ఈ ఆయుధాలు ఆర్మేనియాకు కొత్త ఆత్మవిశ్వాసం ఇస్తాయి. తుర్కియే మద్దతుతో ఆర్మేనియా పై ఒత్తిడి తీసుకునే అజర్‌బైజాన్‌కు ఇది పెద్ద షాక్‌.

సైప్రస్‌ అధ్యక్షుడు భారత్‌∙సందర్శన..
తాజాగా మెడిటరేనియన్‌లో 20–23 మధ్య సైప్రస్‌ అధ్యక్షుడు నికోలస్‌ క్రిస్టోడౌలిడెస్‌ భారత్‌ను సందర్శించారు. 2026–2031 రక్షణ రోడ్‌మ్యాప్‌ను బలోపేతం చేశారు. బ్రహ్మోస్, నాగాస్త్ర (ఆంటి–డ్రోన్‌) వ్యవస్థలు, డ్రోన్లు, మారిటైమ్‌ సెక్యూరిటీ సహకారం ప్రధాన చర్చలు. ఇది తుర్కియే ఆక్రమణ, బ్లూ హోమ్‌ల్యాండ్‌ (మావి వతన్‌) సిద్ధాంతం కారణంగా భద్రతా సవాళ్లు ఎదుర్కొంటున్న సైప్రస్‌కు కీలకం. తుర్కియే 1974 నుంచి సైప్రస్‌ ఉత్తర భాగాన్ని ఆక్రమించి ఉంచడం, సముద్ర సంపదపై దావా వేయడం – ఈ విస్తరణవాదానికి భారత్‌ ఆయుధాలు బలమైన సవాల్‌ అవుతాయి. గ్రీస్‌తో కలిసి ఈ మూడు దేశాలు (ఆర్మేనియా–సైప్రస్‌–గ్రీస్‌) తుర్కియేను మూడు దిక్కుల నుంచి ఒత్తిడికి గురి చేస్తున్నాయి.

తుర్కియే ఆందోళన…
తుర్కియేకు ఈ అభివృద్ధి పెద్ద ఎదురుదెబ్బ. భారత్‌ వ్యతిరేక వైఖరి – కాశ్మీర్‌ విషయంలో పాకిస్తాన్‌కు మద్దతు, ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో పాక్‌కు టర్కిష్‌ డ్రోన్లు అందించడం – ఇవి భారత్‌ను తుర్కియే వైపు వ్యూహాత్మకంగా చర్య తీసుకోవడానికి ప్రేరేపించాయి. ఆపరేషన్‌ సిందూర్‌లో భారత్‌ ఎదుర్కొన్న టర్కిష్‌ డ్రోన్లను ఇప్పుడు దాని ప్రత్యర్థులకు అందించడం చారిత్రక ప్రతీకారంగా కనిపిస్తోంది. బ్లూ హోమ్‌ల్యాండ్‌ సిద్ధాంతం ద్వారా తుర్కియే ఈజియన్, మెడిటరేనియన్‌ సముద్రాల్లో విస్తృత దావాలు వేస్తోంది. గ్రీస్‌ దీవులు, సైప్రస్‌ ఈఈజెడ్, ఆర్మేనియా సరిహద్దులపై ఒత్తిడి – ఇవన్నీ ఇప్పుడు భారత్‌ సాయంతో ఎదుర్కొనే సామర్థ్యం పొందుతున్నాయి. టర్కిష్‌ మీడియా, విశ్లేషకులు ఇప్పటికే ‘‘నైట్‌మేర్‌’’ అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

భారత్‌కు ఇది ఏమిటి?
ఇది కేవలం ఆయుధ వ్యాపారం కాదు. ఆత్మనిర్భర్‌ భారత్‌ లక్ష్యాన్ని సాకారం చేస్తూ, చైనా–పాకిస్తాన్‌–తుర్కియే అక్షానికి బలమైన ప్రత్యామ్నాయం సృష్టిస్తోంది. ఇండో–పసిఫిక్‌ నుంచి మెడిటరేనియన్‌ వరకు భారత్‌ ప్రభావం విస్తరిస్తోంది. ఇది భారత్‌ రక్షణ ఎగుమతులను పెంచడంతోపాటు, బహుముఖ భాగస్వామ్యాల ద్వారా జాతీయ భద్రతను బలపరుస్తుంది. అయితే, ఈ వ్యూహం సవాళ్లు కూడా తెచ్చిపెడుతుంది. నాటో సభ్యుల మధ్య సంఘర్షణలు, కొత్త ఉద్రిక్తతలు ఏర్పడవచ్చు. దీర్ఘకాలికంగా స్థిరత్వం కావాలంటే ఆయుధ దౌత్యంతోపాటు సమర్థవంతమైన డిప్లమసీ అవసరం.

భారత్‌ ఇప్పుడు ప్రపంచ వేదికపై తన శక్తిని నిరూపిస్తోంది. ఆయుధాల ద్వారా స్నేహితులకు భద్రత, ప్రత్యర్థులకు సందేశం ఇదే ఆధునిక భారత్‌ భాష. తుర్కియేకు ఇది హెచ్చరికగా మారాలి. ప్రాంతీయ విస్తరణవాదానికి ఎదురు ఎలా ఉంటుందో భారత్‌ చూపిస్తోంది. ఇది కేవలం ఆరంభం మాత్రమే.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version