France Heatwave: కేవలం మన దగ్గరే అనుకున్నాం.. ప్రపంచ దేశాలలో కూడా ఎండలు గట్టిగానే కొడుతున్నాయి. పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల జలాలు విపరీతంగా వేడెక్కుతున్న నేపథ్యంలో వర్షాలు కురవడం లేదు. వర్షాలు కురువకపోవడంతో ఎండలు దంచి కొడుతున్నాయి.. ముఖ్యంగా సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు.. ఒక స్థాయి ఉష్ణోగ్రత అయితే పెద్దగా ఇబ్బంది ఉండదు. అదే అంతకుమించితే మాత్రం మనుషులు తట్టుకోలేరు.. ఇప్పుడు ఆ దేశంలో కూడా అలానే జరుగుతోంది.
యూరప్ ఖండంలో అత్యంత కీలకమైన దేశాలలో ఫ్రాన్స్ ఒకటి. ఇక్కడ మంచు విపరీతంగా కురుస్తూ ఉంటుంది. ఉష్ణోగ్రతలు ఒక స్థాయిలో మాత్రమే నమోదు అవుతూ ఉంటాయి. అందువల్లే ఆ దేశంలో పర్యటించడానికి పర్యాటకులు ఆసక్తి చూపిస్తుంటారు. పైగా ప్రఖ్యాతమైన ఈఫిల్ టవర్ కూడా అక్కడే ఉంది.. అక్కడి వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి పర్యాటకులు కూడా ఆస్వాదిస్తూ ఉంటారు.. అక్కడ ఉష్ణోగ్రతలు సాధ్యమైనంతవరకు 35 డిగ్రీలకు మించిపోవు. ఒకవేళ ఏవైనా అనుకోని మార్పులు జరుగుతే తప్ప అక్కడ ఆ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కావు.. కానీ కొంతకాలంగా అక్కడ ఉష్ణోగ్రతలు ఏకంగా 45 డిగ్రీలను మించి పోతున్నాయి.
1947 తర్వాత ఇప్పుడు అక్కడ ఆ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. చల్లటి వాతావరణంలో మాత్రమే ఉండేందుకు ఇష్టపడే ఫ్రాన్స్ వాసులు ఆ స్థాయిలో ఎండను తట్టుకోలేకపోతున్నారు. ఇంట్లో ఉంటే ఉక్క పోత విపరీతంగా వేధిస్తున్న నేపథ్యంలో ఫ్రాన్స్ వాసులు చల్లదనం కోసం కెనాల్స్.. నీటి కుంటల్లోకి దూకి ఈత కొడుతున్నారు. అయితే కొంతమందికి సరిగ్గా ఈత రాకపోవడంతో నీటిలో మునిగి చనిపోతున్నారు.. గడిచిన ఐదు రోజుల్లో ఫ్రాన్స్ దేశవ్యాప్తంగా ఏకంగా 40 మంది చనిపోయారు. ప్రమాదకరమైన కెనాల్స్ లో ఈత కొట్టేందుకు దూకి.. అంతమంది చనిపోయారు.. రోజుల వ్యవధిలో 40 మంది చనిపోవడంతో ఫ్రాన్స్ దేశ అధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదకరమైన కాల్వలో దూకి ప్రాణాలు కోల్పోవద్దని హెచ్చరికలు జారీ చేశారు
ఎల్ నీనో ఎఫెక్ట్ వల్ల ఈసారి ఫ్రాన్స్ దేశంలో ఉష్ణోగ్రతలు విపరీతంగా నమోదు అవుతున్నాయి.. ఎండ వేడి మాత్రమే కాకుండా ఉక్కపోత కూడా అధికంగా ఉంటున్నది. అందువల్లే ప్రజలు ఉపశమనం కోసం ఈత కొడుతున్నారు. కొంతమంది నిర్లక్ష్యంగా దూకడంతో నీటిలో మునిగి చనిపోతున్నారు.. మరి కొద్దిరోజులు ఫ్రాన్స్ దేశంలో ఇదే స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అధికారులు చెబుతున్నారు. అసలే చల్లటి దేశమైన ఫ్రాన్స్ లో ఈ స్థాయిలో ఉష్ణోగ్రతల నమోదు అయితే ఎలా బతకాలో అర్థం కావడం లేదని అక్కడి ప్రజలు వాపోతున్నారు.
