US Presidential Elections: డిబేటా.. వద్దురా బాబు.. హారిస్‌తో ముఖాముఖిపై భయపడుతున్న డొనాల్డ్ ట్రంప్‌

అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ.. మంగళవారం (సెప్టెంబర్‌ 10న) అమెరికాలో అధికార డెమొక్రటిక్, విపక్ష రిపబ్లిక్‌ పార్టీ అభ్యర్థుల మధ్య డిబేట్‌ జరిగింది. ఇందులో కమలా స్పష్టమైన ఆధిపత్యం కనబర్చారు. దీంతో మరో డిబేట్‌కే ట్రంప్‌ వెనుకాడుతున్నారు.

Written By: Raj Shekar, Updated On : September 13, 2024 3:47 pm

US Presidential Elections(2)

Follow us on

US Presidential Elections: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఇంకా 50 రోజులే మిగిలి ఉంది. దీంతో ఎన్నికల ప్రచారం జోరు పెరిగింది. బరిలో ఉన్న అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. అన్నివర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ తరుణంలో సెప్టెంబర్‌ 10న అమెరికాలో ఓ టీవీ ఛానెల్‌ అధికార డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థి కమలా హారిస్, ప్రతిపక్ష రిపబ్లిక్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ మధ్య డిబేట్‌ ఏర్పాటు చేసింది. తొలి డిబేట్‌ అధ్యక్షుడు బైడెన్, మజీ అధ్యక్షుడు ట్రంప్‌ మధ్య జరిగింది. ఇందులో బైడెన్‌ తేలిపోయారు. ట్రంప్‌ దూకుడుకు బైడెన్‌ సమాధానం ఇవ్వడంలో తడబడ్డారు. తర్వాత అనూహ్యంగా బైడెన్‌ తప్పుకున్నారు. తర్వాత రేసులోకి వచ్చిన కమలా హారిస్‌తోనూ డిబేట్‌కు ట్రంప్‌ సై అన్నారు. కానీ, మగళవారం జరిగిన డిబేట్‌లో ఈసారి ట్రంప్‌ తడబడ్డారు. సమాధానం చెప్పలేక కమలపై వ్యక్తిగత విమర్శలు చేశారు. ఇక కమల తూటాల్లాంటి మాటలతో ట్రంప్‌ను ఇరుకున్న పెట్టారు. ఆయన దోషి అని నేరం నిరూపితమైందని, ఇంకా అనేక కేసులు పెండింగ్‌లో ఉన్నాయని పదే పదే ప్రస్తావించారు. దీంతో ట్రంప్‌ సమర్థించుకోలేకపోయారు. ఈ తరుణంలో మరో డిబేట్‌కు ట్రంప్‌ ఇప్పుడు జంకుతున్నారు.

సిద్ధంగా లేనన్న ట్రంప్‌..
ఇటీవల జరిగిన డిబేట్‌లో కమలా పైచేయి సాధించినట్లు అమెరికా మీడియా కూడా ప్రచారం చేస్తోంది. సోషల్‌ మీడియాలో కమలా మాటలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ నేపథ్యంలో కమలాహారిస్‌ మరోసారి చర్చకు సిద్ధంగా లేనని ట్రంప్‌ వెల్లడించడం గమనార్హం. ఈ విషయాన్ని ట్రంప్‌ స్వయంగా సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ‘డిబేట్లో నేనే గెలిచాను.. కానీ సర్వేలు మాత్రం భిన్నంగా చూపిస్తున్నాయి. పరాజితురాలు హారిస్‌ మరోసారి చర్చకు నేను సిద్ధంగా లేను’ అ ని ట్రంప్‌ పేర్కొన్నారు. ‘నేను మూడో చర్చకు రెడీగా లేను’ అని పేర్కొన్నారు.

నవంబర్‌ 5న అధ్యక్ష ఎన్నికలు..
ఇదిలా ఉంటే.. అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్‌ 5న జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్ష రేసులో గట్టిగా తలపడుతున్న ట్రంప్, కమలా హారిస్‌ పెన్సిల్వేనియాలోని నేషనల్‌ ఇనిíస్టిట్యూషన్‌ వేదిగా డిబేట్‌ నిర్వహించారు. ఇందులో కమలా హారిస్‌ విజయం సాధించారని పలు మీడియా కథనాలు వెల్లడించాయి. ట్రంప్‌ మాత్రం హారిస్‌పై తానే పైచేయి సాధించానని చెప్పుకుంటున్నారు. ఈ చర్చ జరిగిన 24 గంటల్లోనే హారిస్‌కు 47 మిలియన్ల (భారత కరెన్సీలో దాదాపు రూ.394కోట్లు) విరాళాలు సమకూరినట్లు పేర్కొన్నాయి. ఇదిలా ఉంటే అక్టోబరు 1న న్యూయార్క్‌ ట్రంప్‌ రన్నింగ్‌ మేట్‌ జేడీ వాన్స్, డెమోక్రటిక్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ టీమ్‌ వాజ్‌ మధ్య చర్చ జరగనుంది.

ట్రంప్‌పై నేరాభియోగాలు కొట్టివేత..
మరోవైపు ఎన్నికలు సమీపిస్తున్న వేళ అమెరికా కోర్టులు ట్రంప్‌కు ఊరటనిచ్చాయి. 2020 ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకొన్న కేసులో ట్రంప్‌కు ప్రమేయం ఉందనే అభియోగాల్లోని రెండు కౌంటీలను జార్జియాకు చెందిన ఫాల్టన్‌ కౌంటీ న్యాయమూర్తి తోసిపుచ్చారు. ట్రంప్‌పై ఉన్న ఎనిమిది ఆరోపణలతోపాటు మిగిలిన కేసుల విచారణకు అనుమతించారు.