China : చైనా దేశంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారందరూ శవాలుగా మారుతున్నారు. అయితే వాళ్లు నిజంగా చనిపోయి శవాలుగా మారడం లేదు.. శవాలుగా మారినట్లు నేలపై పడుకొని ఫోజులు ఇస్తున్నారు. గ్రాడ్యుయేషన్ గౌనులో ఇటీవల ఓ యువతి నేలపై పడుకుని చనిపోయినట్లు కనిపించిన ఫొటో ఒకటి చైనీస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇతర ఫొటోలలో ఆమె కుర్చీపై జారిపడి కూర్చున్నట్లు, గోడకు ఆనుకుని, మెట్ల మీద చనిపోయినట్లు కనిపించాయి. అయితే ఇదంతా అక్కడి పాలకులపై నిరసన. జాబ్మార్కెట్ నెమ్మదించడంతో తమకు ఉద్యోగాలు రావడం లేదని ఇలా వినూత్న నిరసన తెలుపుతున్నారు. తమకు చావే శరణ్యం అన్నట్లు ఫొటోలు చైనా సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు.
ఈ ఫొటోలు చైనాలో ఇటీవలి గ్రాడ్యుయేట్లు ఎదుర్కొంటున్న కఠినమైన వాస్తవికతను ప్రతిబింబించేలా ఉన్నాయి. చాలా మంది సాధారణ గ్రాడ్యుయేషన్ పోర్ర్టెయిట్లకు బదులుగా ఈ అసాధారణ చిత్రాలను షేర్ చేస్తున్నారు. ఫొటోలతో పాటుగా ఉన్న ఈ టైటిల్స్ వారు చనిపోయిన్నట్లుగా అందర్నీ భ్రమింప చేస్తున్నాయి. ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో 1.16 కోట్ల మంది గ్రాడ్యుయేట్లు ఉద్యోగ వేట ప్రారంభించబోతున్నారు. కానీ ఉద్యోగావకాశాలు అన్ని కనిపించడం లేదు. నగరాల్లో నిరుద్యోగం రేటు రికార్డు స్థాయిలో ఉంది, మేలో 20.8%కి చేరుకుంది. జాబ్ మార్కెట్లోకి ప్రవేశించే ఉద్యోగార్ధుల సంఖ్య పెరగడం వల్ల పరిస్థితి మరింత దిగజారింది.