CM Revanth Reddy: తెలంగాణకు భారీగా పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా సీఎం రేవంత్రెడ్డి ఆగస్టు 3న అమెరికా, దక్షిణ కొరియా పర్యటనకు వెళ్లారు. దాదాపు 8 రోజులు అమెరికాలోనే ఉన్నారు. ఎన్నారైలతో, అమెరికాకు చెందిన పారిశ్రామిక వేత్తలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు. పలు కంపెనీలతో ఎంవోయూ చేసుకున్నారు. తాజాగా అమెరికా పర్యటన ముగించుకుని దక్షిణ కొరియా వెళ్లారు. ఆయన వెంట మంత్రి శ్రీధర్బాబు, సీఎస్ శాంతికుమారితోపాటు అధికారుల బృందం ఉంది. దక్షిణ కొరియా రాజధాని సియోల్లో వ్యాపారులతో సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావాలని ఆహ్వానించారు. తెలంగాణలో ఉన్న సదుపాయాలు, పెట్టుబడి దారులకు ప్రభుత్వం కల్పించే సదుపాయాలను వివరించారు. అంతకు ముందు శాన్ఫ్రాన్సిస్కోలో సీఎం రేవంత్రెడ్డి, మంత్రి శ్రీధర్బాబు డ్రైవర్ లేని కారులో ప్రయాణించారు. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డ్రైవర్ అవసరం లేకుండా సెన్సార్లు, జీపీఎస్ ట్రాకింగ్తో కారు ఎలా ప్రయాణిస్తుందో అడిగి తెలుసుకున్నారు. అమెరికా పర్యటన ముగించుకున్న తర్వాత.. సీఎం రేవంత్రెడ్డి టీమ్ దక్షిణ కొరియాకు వెళ్లింది. సియోల్లో పలువురు కంపెనీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించారు.
మన ఇస్రో కూడా డ్రైవర్ లెస్కార్ల తయారీ..
సాధారణంగా ఏ వాహహనం అయినా.. డ్రైవర్ లేనిదే ముందుకు సాగదు. రోడ్లపై డ్రైవర్ లేకుండా నడిపే వాహనాలు దాదాపు ఉత్పత్తి కాలేదనే చెప్పాలి. అంతరిక్షంలోకి కూడా.. మానవ రహిత రాకెట్లను పంపిస్తున్నారు. అలాంటి టెక్నాలజీ వైపు ఇస్రో పయనిస్తోంది. ప్రస్తుతం ప్రపంచంలోని చాలా టెక్ కంపెనీలు మానవ రహిత లేదా డ్రైవర్ లేకుండా వెళ్లే కార్లను తయారు చేస్తున్నాయి. అందులో భాగంగానే ఆ వైపు పయనిస్తోంది చైనా. చైనీస్ సెర్చ్ ఇంజన్ సర్వీస్ కంపెనీ బైడు కొత్త సెల్ఫ్ డ్రైవింగ్ కారును విడుదల చేసింది. ఈ కొత్త ఆటోమేటిక్ వాహనం ధర 2.50 లక్షల యువాన్ల వరకు ఉంటుందని బైడు కంపెనీ తెలియజేసింది.
హైదరాబాద్కు టెక్నాలజీ
డ్రైవర్ అవసరం లేకుండా వాటంతట అవే వాహనాలు నడిచే సాంకేతికతను ఐఐటీ హైదరాబాద్ పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసింది. ఈ డ్రైవర్ లెస్ (అటానమస్ నావిగేషన్ డేటా అక్విజిషన్ సిస్టం) టెక్నాలజీని వినియోగించుకునేందుకు స్టార్టప్ కంపెనీలు ముందుకు రావాలంటూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఐఐటీ లోని ప్రత్యేక పరిశోధన విభాగం ’టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ఆన్ అటానమస్ నావిగేషన్ (టిహాన్)’ ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసింది. ఇప్పటికే ఈ సాంకేతికతతో కూడిన డ్రైవర్ లెస్ వాహనాలను ఐఐటీహెచ్లో వినియోగిస్తున్నారు. ఈ వాహనాలు ప్రధాన గేటు నుంచి వర్సిటీ లోని అన్నిచోట్లకు విద్యార్థులు, అధ్యాపకులను చేరవేస్తున్నాయి. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో టెస్లా వంటి డ్రైవర్ లెస్ వాహనాలు అందుబాటులో ఉన్నాయి. సాధారణ పౌరులు కూడా వాటిని వినియోగిస్తున్నారు. అయితే అక్కడి రోడ్లు, ప్రత్యేక ఫుట్పాత్లు, ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థ, ట్రాఫిక్ నిబంధనలు, ఇతర అంశాలకు మన దేశానికి బాగా తేడా ఉంటుంది. ఈ క్రమంలో మన దేశంలో రోడ్లు, ట్రాఫిక్ వ్యవస్థ, పాదచారులకు అనుగుణంగా ’అటానమస్’ వాహనాల సాంకేతికతను టిహాన్ అభివృద్ధి చేసింది. ఇందుకోసం ఆధునిక రాడార్లు, త్రీడీ టెక్నాలజీ, అల్గారిథమ్లను వినియోగించింది. వర్సిటీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్, మెకానికల్, ఏరోస్పేస్, సివిల్, మేథమెటిక్స్, డిజైన్స్ వంటి వివిధ విభాగాల పరిశోధక విద్యార్థులు ఈ ప్రాజెక్టులో పలుపంచుకుంటున్నారు.