Homeఅంతర్జాతీయంChina Pakistan Relations: బలపడతున్న చైనా–పాక్‌ బంధం.. అమెరికా ఇండో–పసిఫిక్‌ వ్యూహానికి సవాల్‌

China Pakistan Relations: బలపడతున్న చైనా–పాక్‌ బంధం.. అమెరికా ఇండో–పసిఫిక్‌ వ్యూహానికి సవాల్‌

China Pakistan Relations: అమెరికాతో ఒకవైపు సత్సంబంధాలు కొనసాగిస్తున్న పాకిస్తాన్‌.. ఇదే సమయంలో అమెరికా బద్ధ శత్రువు అయిన చైనాతోనూ దోస్తానీ చేస్తోంది. డ్రాగన్‌ కంట్రీతో బంధం బలపర్చుకుంటోంది. తైవాన్, దక్షిణ చైనా సముద్రం, సీపీఈసీ వంటి సున్నితమైన అంశాలపై చైనా విధానాలకు ఇస్లామాబాద్‌ బహిరంగంగా మద్దతు ఇస్తోంది. ఈ పొత్తు బలపడటంతో అమెరికా నేతృత్వంలోని ఇండో–పసిఫిక్‌ వ్యూహం, అలాగే వాషింగ్టన్‌–ఢిల్లీ మధ్య దీర్ఘకాలిక భాగస్వామ్యం ప్రభావితం అవుతున్నాయి.

ఉమ్మడి ప్రకటనలో కీలక సందేశాలు..
మే నెలలో చైనా పర్యటన సందర్భంగా పాకిస్తాన్‌ సైన్యాధ్యక్షుడు ఆసిమ్‌ మునీర్, ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ తో జరిగిన చర్చల తర్వాత విడుదలైన సంయుక్త ప్రకటనలో బీజింగ్‌కు ఇస్లామాబాద్‌ పూర్తి మద్దతు వ్యక్తం చేసింది. ‘వన్‌ చైనా’ సూత్రానికి తన నిబద్ధతను గట్టిగా పునరుద్ఘాటించిన పాకిస్తాన్, తైవాన్‌ను చైనాలో విడదీయరాని భాగంగా అభివర్ణించింది. తైవాన్‌ స్వాతంత్య్రాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేసింది. షింజియాంగ్, టిబెట్, హాంకాంగ్, దక్షిణ చైనా సముద్రం వంటి అంశాలపై చైనా తీసుకుంటున్న వైఖరికి కూడా పూర్తి మద్దతు ఇచ్చింది.

అమెరికా వ్యూహానికి ఇబ్బంది..
అమెరికా ఇండో–పసిఫిక్‌ వ్యూహం ప్రాంతీయ స్థిరత్వం, నౌకాయాన స్వేచ్ఛ, బలాబలాల సమతుల్యత, తైవాన్‌పై బలవంతపు విలీనాన్ని నిరోధించడం వంటి లక్ష్యాలపై ఆధారపడి ఉంది. అయితే పాకిస్తాన్‌ చైనా వైపు మొగ్గు చూపడం ఈ వ్యూహానికి నేరుగా సవాల్‌గా మారుతోంది. చైనా అధ్యక్షుడు జిన్‌ పింగ్‌ ప్రతిపాదించిన ‘షేర్డ్‌ ఫ్యూచర్‌ ఫర్‌ హ్యుమానిటీ’, గ్లోబల్‌ డెవలప్‌మెంట్, గ్లోబల్‌ సెక్యూరిటీ, గ్లోబల్‌ సివిలైజేషన్, గ్లోబల్‌ గవర్నెన్స్‌ ఇనిషియేటివ్‌లకు పాకిస్తాన్‌ మద్దతు ఇస్తోంది. అమెరికా ఏకపక్ష చర్యలను పరోక్షంగా విమర్శించిన ఈ ప్రకటన, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఫాసిజం, మిలిటరిజం పునరావృతం కాకుండా జాగ్రత్త పడాలని కూడా పిలుపిచ్చింది.

సీపీఈసీ, బీఆర్‌ఐలో సహకారం..
బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనిషియేటివ్‌ (బీఆర్‌ఐ)లో భాగమైన చైనా–పాక్‌ ఆర్థిక నడవా (సీపీఈసీ) ప్రాజెక్టులో రెండు దేశాలు మరింత సహకారానికి సిద్ధంగా ఉన్నాయి. మౌలిక సదుపాయాలు, వ్యవసాయం, విద్య, ఆరోగ్యం వంటి రంగాల్లో ‘చిన్న, అందమైన’ ప్రాజెక్టులను మరింతగా చేపట్టాలని నిర్ణయించాయి. కశ్మీర్‌ విషయంలో చైనా పాకిస్తాన్‌ వైఖరిని సమర్థించడం, సరిహద్దు నదుల సహకారం గురించి చర్చించడం జరిగింది.

అమెరికా ఏం చేస్తుంది..
ఇటీవల ఢిల్లీకి వచ్చిన అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారత్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలంగా నొక్కి చెప్పారు. పాకిస్తాన్‌తో అమెరికా సంబంధాలు నిర్దిష్టమైన, తాత్కాలిక ప్రయోజనాల కోసమేనని, అవి భారత్‌తో ఉన్న దీర్ఘకాలిక వ్యూహాత్మక పొత్తుకు ఎలాంటి ఆటంకం కలిగించవని ఆయన స్పష్టం చేశారు. వివిధ దేశాలతో తాత్కాలికంగా కలిసి పని చేయడం సాధారణమేనని, కానీ ఇండియాతో ఉన్న సంబంధం ప్రత్యేకమైనదని రూబియో పేర్కొన్నారు.

పాకిస్తాన్‌ చైనా వైపు మొగ్గు చూపడంతో అమెరికా తన ఇండో–పసిఫిక్‌ వ్యూహాన్ని, ముఖ్యంగా తైవాన్‌ విషయంలో తన ప్రయోజనాలను జాగ్రత్తగా సమతుల్యం చేసుకోవాల్సి వస్తోంది. ఒకవైపు ట్రంప్‌ ప్రభుత్వం పాకిస్తాన్‌ నేతలను ప్రశంసిస్తుండగా, మరోవైపు ఇస్లామాబాద్‌ బీజింగ్‌ ఆధిపత్య లక్ష్యాలకు మద్దతు ఇవ్వడం వాషింగ్టన్‌కు ఇబ్బంది కలిగిస్తోంది. ఈ పరిస్థితి భారత్‌తో అమెరికా వ్యూహాత్మక సంబంధాలను బలహీనపరచకుండా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version