King Charles
King Charles: ఎలిజిబెత్_2 మహారాణి మరణం తాలూకూ విషాదం నుంచి బ్రిటన్ రాజ కుటుంబం ఇంకా కోలుకోలేదు. పైగా ఆర్థికపరమైన సమస్యలు కూడా ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నాయని వార్తలు వస్తున్నాయి. ఇటీవల మహారాణివాడిన కారును వేలానికి పెట్టారు. ఇవన్నీ జరుగుతుండగానే బ్రిటన్ రాజ కుటుంబం ప్రపంచానికి ఒక చేదు వార్తను ప్రకటించింది. కొంతకాలంగా క్లోమ గ్రంధి సంబంధిత వ్యాధితో బాధపడుతున్న కింగ్ చార్లెస్_3 ఆస్పత్రిలో చికిత్స చేయించుకునేందుకు వెళ్లగా.. అక్కడ చేసిన పరీక్షల్లో ఆయనకు క్యాన్సర్ సోకింది అని తేలింది. దీంతో బ్రిటన్ రాజు కుటుంబంలో ఒక్కసారిగా అనుకోని కుదుపు ఏర్పడింది.. చార్లెస్_3 కి క్యాన్సర్ గా నిర్ధారణ అయిందని బకింగ్ హమ్ ప్యాలెస్ నుంచి సోమవారం ఒక ప్రకటన విడుదల అయింది. ” రోగ నిర్ధారణ పరీక్షలు పూర్తయ్యాయి. కింగ్ చార్లెస్_3 లో క్యాన్సర్ రూపాన్ని వైద్యులు గుర్తించారు” అని బకింగ్ హమ్ ప్యాలెస్ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ఆయనకు ఏ రకమైన క్యాన్సర్ సోకింది అనేది మాత్రం బకింగ్ హమ్ ప్యాలెస్ ప్రకటించలేదు.. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం క్లోమ గ్రంధి సంబంధితమైనది కాకుండా.. ఇతర క్యాన్సర్ ఆయనకి సోకి ఉంటుందని తెలుస్తోంది.. గత నెలలో ప్రోస్టేట్ గ్రంధి సంబంధిత వ్యాధికి చికిత్స పొందేందుకు చార్లెస్ ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చింది. అక్కడ ఆయనకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. కొన్ని మందులు రాసి కొద్ది రోజులు అయిన తర్వాత మళ్ళీ రండి అని సూచించారు. వైద్యులు చెప్పిన విధంగానే సోమవారం మళ్లీ ఆసుపత్రికి వెళ్లిన చార్లెస్_3 కి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో ఆయనకు క్యాన్సర్ సోకినట్టు నిర్ధారించారు. అయితే ఆయనకు ఏ క్యాన్సర్ సోకింది అని మాత్రం వైద్య వర్గాలు బయటికి వెల్లడించలేదు. బకింగ్ హమ్ ప్యాలెస్ కూడా ఈ విషయంలో గోప్యత పాటిస్తోంది. క్యాన్సర్ నిర్ధారణ అయిన నేపథ్యంలో చార్లెస్_3 వైద్యుల సూచన మేరకు ప్రజలను కలవడం రద్దు చేసుకున్నాడు. అంతేకాదు తనను కలవడానికి ఎవరూ రావద్దని ప్రకటన కూడా చేయించాడు.
క్యాన్సర్ నిర్ధారణ అయినప్పటికీ చార్లెస్_3 అవుట్ పేషెంట్ గా చికిత్స పొందుతున్నాడని బ్రిటన్ ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి ప్రకారం త్వరగానే కోలుకొని, ఎప్పటిలాగే ప్రజా జీవితాన్ని కొనసాగిస్తాడని ఆసుపత్రి వర్గాలు అంటున్నాయి. క్యాన్సర్ బారిన పడిన వారిలో అవగాహన పెంచేందుకు చార్లెస్_3 కోరుకున్న తర్వాత వివిధ కార్యక్రమాలు చేపడతారని ఆసుపత్రి వర్గాలు అంటున్నాయి. ఎలిజబెత్_2 మరణం తర్వాత రాజకుటుంబంలో పరిస్థితులు అంత ఆశాజనకంగా లేవు. చార్లెస్_3 కి క్యాన్సర్ నిర్ధారణ అయినప్పటికీ రాజ కుటుంబ సభ్యులు ఎవరూ అందుబాటులోకి రాలేదంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. క్యాన్సర్ నిర్ధారణ అయిన తర్వాత ఆ విషయాన్ని చార్లెస్_3 ప్రిన్స్ విలియం, హ్యారీ, తన కుటుంబ సభ్యులకు వ్యక్తిగతంగా తెలియజేశాడు. ప్రస్తుతానికి ప్రిన్స్ హ్యారీ, భార్య మేఘన్ మార్క్లే వేరే ప్రాంతంలో ఉన్నందున.. త్వరలో చార్లెస్_3 వద్దకు చేరుకుంటారని బకింగ్ హమ్ ప్యాలెస్ వర్గాలు చెబుతున్నాయి..ప్రిన్స్ హ్యారీ, భార్య మేఘన్ మార్క్లే కొంతకాలంగా రాజకుటుంబంతో దూరంగా ఉంటున్నట్టు తెలుస్తోంది..ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్క్లే ను వివాహం చేసుకోవడం వల్లే ఆ కుటుంబంలో అంతర్గత విభేదాలు తలెత్తాయని అప్పట్లో కథనాలు వినిపించాయి.
చార్లెస్_3 కి క్యాన్సర్ నిర్ధారణ అయిన తర్వాత.. ఈ విషయాన్ని బకింగ్ హమ్ ప్యాలెస్ వర్గాల ద్వారా తెలుసుకున్న తర్వాత ప్రపంచ దేశాల అధినేతలు స్పందిస్తున్నారు. ” దేవుడు ఇష్టపడితే నేను త్వరలో కింగ్ చార్లెస్ తో మాట్లాడుతాను. అతడికి క్యాన్సర్ నిర్ధారణ అయిన విషయం తెలిసిన దగ్గర నుంచి ఆందోళన చెందుతున్నాను. అతడు త్వరగా కోలుకోవాలి” అని అమెరికా అధ్యక్షుడు జోబైడన్ పేర్కొన్నారు. “క్యాన్సర్ ను జయించాలంటే సంపూర్ణ ధైర్యం అవసరం. చార్లెస్_3 కి భగవంతుడు అన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఆయన పూర్తి శక్తితో తిరిగి వస్తాడు. ఇందులో నాకు ఎటువంటి సందేహం లేదు. దేశం మొత్తం ఆయన వెంట ఉంది” అని ఇంగ్లాండ్ ప్రధానమంత్రి రిషి సునాక్ ట్విట్టర్ ఎక్స్ లో పేర్కొన్నారు. “చార్లెస్_3 త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అని” ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్ ట్విట్టర్ ఎక్స్ లో పేర్కొన్నారు.