Bangladesh : బంగ్లాదేశ్‌లో బలవంతపు రాజీనామాలు.. హిందువులపైనే ఒత్తిడి..

బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల విషయంలో చెలరేగిన అల్లర్లు కాస్త తగ్గినా.. ఆ దేశంలో హిందువులపై అరాచకాలు కొనసాగుతున్నాయి. అల్లర్ల సమయంలో హిందూ ఆలయాలు, హిందువుల ఇళ్లపై దాడులు చేసిన అరాచక శక్తులు.. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా అరాచకాలు కొనసాగిస్తున్నాయి.

Written By: Raj Shekar, Updated On : September 1, 2024 4:57 pm

Bangladesh

Follow us on

Bangladesh : బంగ్లాదేశ్‌లో నెల క్రితం.. రిజర్వేషన్ల అంశంపై షేక్‌ హసీనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అక్కడి యువత దేశంలో అరాచకం సృష్టించింది. ఏకంగా ప్రధాని షేక్‌ హసీనా దేశం విడిచి పారిపోయేలా చేశారు. ఇక అల్లరి మూకలు దేశం మొత్తం విధ్వంసం సృష్టించారు. సైనికులు, పోలీసులు చూస్తూ ఊరుకుండిపోయారు. ఇక ఇదే సమయంలో బంగ్లాదేశ్‌లోని హిందూ ఆలయాలను ధ్వసం చేశారు. హిందువులపై దాడుల చేశారు. ఈ అల్లర్లలో వందల మంది చనిపోయారు. అల్లరి మూకలు కోరుకున్న హసీనా ప్రభుత్వం ఓడిపోయింది. కొత్త ప్రభుత్వం ఏర్పడింది. అయినా హిందూ ఉద్యోగులపై దాడులు కొనసాగుతున్నాయి. హిందూ ఉపాధ్యాయులు తమ ప్రభుత్వ ఉద్యోగాలకు రాజీనామా చేయవలసి వస్తోంది. నిరసనకారులు పాఠశాలలు, కళాశాలలకు వచ్చి పలు నినాదాలు చేస్తూ హిందూ ఉపాధ్యాయులు రాజీనామా చేయాలని కోరుతూ వారిపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపధ్యంలో 50 మంది హిందూ ఉపాధ్యాయులు తమ ఉద్యోగాలను వదిలిపెట్టారు.

పాఠశాలలకు వచ్చి ఒత్తిడి..
బంగ్లాదేశ్‌ వార్తాపత్రిక ప్రోథోమ్‌ అలో తెలిపిన వివరాల ప్రకారం.. ఆగస్టు 29న కొందరు విద్యార్థులు బరిషల్లోని బకర్‌ంజ్‌ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్‌ శుక్లా రాణి హల్డర్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఆమె కొద్దిసేపు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో ఆమె ఖాళీ కాగితంపై నేను రాజీనామా చేస్తున్నాను అని అని రాసి, వారికి ఇచ్చారు. ఆగస్టు 18న అజింపూర్‌ ప్రభుత్వ బాలికల పాఠశాల, కళాశాలకు చెందిన 50 మంది బాలికలు ప్రిన్సిపాల్‌ గీతాంజలి బారువా, అసిస్టెంట్‌ ప్రిన్సిపాల్‌ గౌతమ్‌ చంద్ర పాల్, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ షహనాజా అక్తర్లను రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. డైలీ స్టార్‌ వార్తాపత్రికతో బారువా మాట్లాడుతూ ‘ఆగస్టు 18న ముందు వారు ఎప్పుడూ నా రాజీనామాను అడగలేదు. ఆ రోజు ఉదయం వారు నా కార్యాలయంలోకి చొరబడి నన్ను అవమానించారు’ అని ఆమె తెలిపారు. సోషల్‌ మీడియాలో సర్క్యులేట్‌ అవుతున్న వీడియోలలో ఉపాధ్యాయులను విద్యార్థులు చుట్టుముట్టడం, రాజీనామా లేఖలపై బలవంతంగా సంతకం చేయించడం కనిపిస్తుంది.

బలవంతపు రాజీనామాలు..
కబీ నజ్రుల్‌ యూనివర్శిటీలోని పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ గవర్నెన్స్‌ స్టడీస్‌ విభాగానికి చెందిన అసోసియేట్‌ ప్రొఫెసర్‌ షంజయ్‌ కుమార్‌ ముఖర్జీ మీడియాతో మాట్లాడుతూ తాను డిపార్ట్‌మెంట్‌ హెడ్‌ పదవికి బలవంతంగా రాజీనామా చేయవలసి వచ్చిందని తెలిపారు. ఆ సమయంలో బంగ్లాదేశ్‌కు చెందిన రచయిత్రి తస్లీమా నస్రీన్‌ మైనారిటీ హిందువులకు మద్దతుగా మాట్లాడారు. బంగ్లాదేశ్లోని ఉపాధ్యాయులను బలవంతంగా రాజీనామా చేయిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. తాత్కాలిక అధ్యక్షుడు యూనస్‌ ఈ అంశంపై స్పందించడం లేదన్నారు.