Indian Sailors: నెల రోజుల తర్వాత భారత నావికులకు విముక్తి.. అదుపులో మరో 11 మంది!

ఏప్రిల్‌ 13న హర్మూజ్‌ జలసంధి సమీపంలో ఇజ్రాయెల్‌ కుబేరుడికి చెందిన వాణిజ్య నౌక ఎంఎస్‌సీ ఏరిస్‌ను ఇరాన్‌కు చెందిన ఐఆర్‌జీసీ దళం హెలికాప్టర్లతో వెంబడించి అదీనంలోకి తీసుకుంది.

Written By: Raj Shekar, Updated On : May 10, 2024 2:41 pm

Indian Sailors

Follow us on

Indian Sailors: ఇజ్రాయెల్‌తో ఉద్రిక్తతల వేళ భారత్‌కు వచ్చే ఓ నౌకనుగత నెల ఇరాన్‌ అదుపులోకి తీసుకుంది. ఇందులో భారత్‌కు చెందిన పలువురు భారతీయ నావికులు ఉన్నారు. అనేక సంప్రదింపులు, చర్చల అనంతరం నెల రోజుల తర్వాత నౌకలోని కొందరిని టెహ్రాన్‌ విడుదల చేసింది. ఈమేరకు ఇరాన్‌ లోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. విడుదలైన వారిలో ఎంఎస్‌సీ ఏరిస్‌లోని భారత సిబ్బంది ఐదురుగు ఉన్నారు. గురువారం సాయంత్రం వారు స్వదేశానికి బయల్దేరారు. నావికుల విడుదల కోసం భారత ఎంబసీ, కాన్సులేట్‌ చేసే ప్రయత్నాలకు ఇరాన్‌ అధికారల నుంచి సహకారం లభిస్తోందని భారత దౌత్య కార్యాలయం తెలిపింది. ఇక ఇరాన్‌ అదుపులో ఉన్న నౌకలో భారతీయులతోపాటు ఫిలిప్పీన్స్, ఎస్టోనియాకు చెందిన మరో ఇద్దరు సిబ్బందిని కూడా టెహ్రాన్‌ ఇడుదల చేసింది.

ఏం జరిగిందంటే…
ఏప్రిల్‌ 13న హర్మూజ్‌ జలసంధి సమీపంలో ఇజ్రాయెల్‌ కుబేరుడికి చెందిన వాణిజ్య నౌక ఎంఎస్‌సీ ఏరిస్‌ను ఇరాన్‌కు చెందిన ఐఆర్‌జీసీ దళం హెలికాప్టర్లతో వెంబడించి అదీనంలోకి తీసుకుంది. ఈ నౌకలో మొత్తం 25 మంది సిబ్బంది ఉన్నారు. అందులో 17 మంది భారతీయులు. వీరి విడుదల కోసం భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ ఆ మధ్య ఇరాన్‌ విదేశాంగ శాఖ మంత్రి హుసేన్‌ అమీర్‌ అబ్దుల్లాహియాన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఆయన అబ్యర్థన మేరకు మన సిబ్బందిని టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం అధికారులు కలిసేందుకు అనుమతి ఇచ్చారు.

చర్చల తర్వాత విడుదల..
అనంరత జరిపిన చర్చలతో భారతీయ సిబ్బందిలో ఒకరైన కేరళ మహిళ అటెస్సా జోసెఫ్‌ను ఇరాన్‌ విడుదల చేసింది. ఏప్రిల్‌ 18న ఆమె క్షేమంగా స్వదేశానికి చేరుకున్నారు. తాజాగా మరో ఐదుగురిని విడుదల చేసింది. మిగిలిన 11 మంది భారత నావికులు ఇంకా టెహ్రాన్‌ అదుపులోనే ఉన్నారు. అయితే ఈ సంఖ్యను భారత విదేశాంగశాఖ ధ్రువీకరించలేదు. మరోవైపు నౌకలోని పాక్‌ జాతీయులను ఇరాన్‌ గత నెలలోనే విడుదల చేసినట్లు తెలిసింది.