Kathmandu Plane Crash
Kathmandu Plane Crash: మన పొరుగు దేశం నేపాల్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. చిన్నదేశమైన నేపాల్లో ప్రధాన ఎయిర్పోర్టు ఖాట్మండులో ఉంది. ఇది అంతర్జాతీయ విమానాశ్రయం. నేపాలీలు ప్రపంచంలో ఎక్కడికి వెళ్లాలన్నా.. ఈ ఎయిర్పోర్టు నుంచే వెళ్తారు. ఇక ప్రపంచ దేశాల నుంచి నేపాల్కు వెళ్లేవారు కూడా ఖాడ్మండు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులోనే ల్యాండ్ అవుతారు. హిమాలయాల్లో ఉన్న నేపాల్ పూర్తిగా హిందూ దేశం. ఈ దేశంలో అనేక ఆధ్యాత్మిక క్షేత్రాలు ఉన్నాయి. అందుకే ఏటా లక్షల మంది పర్యాటకులు వెళ్తుంటారు. ఇక నేపాల్కు పర్యాటకంగా కూడా మంచి ఆదాయం వస్తుంది. అయితే నేపాల్ వాతావరణ పరిస్థితులు విమాన ప్రమాదాలకు కారణమవుతోంది. అందుకే ప్రపంచంలో ఎక్కువగా విమాన ప్రమాదాలు జరిగే దేశంగా గుర్తింపు పొందింది. ఇక్కడ ఏటా విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా నేపాల్ రాజధాని ఖాట్మండులోని ఇంటర్నేషనల్ ఎయిర్పనోర్టులో విమాన ప్రమాదం జరిగింది. విమానం టేకాఫ్ అవుతుండగా కుప్పకూలింది. ఈ ఘటనలో 19 మంది మరణించారు. ప్రమాద సమయంలో విమానంలో 19 మంది ఉన్నారు. ఘటన స్థలంలోనే 18 మంది మృతిచెందగా ఒకరు ఆస్పత్రికి తరలించిన తర్వాత మృతిచెందారు. ఇక ప్రమాదానికి గురైన విమానం నేపాల్కు చెందిన శౌర్య ఎయిర్లైన్స్కు చెందిన సీఆర్జే 200గా అక్కడి మీడియా తెలిపింది. ఫ్లైట్ టేకాఫ్ అయినప్పుడు పైగి ఎగిరేందుకు అవసరమైన ఆల్టిట్యూడ్ రాలేదు. ఆ సమయంలోనే రన్వేపైనే విమానం స్లిప్ అయింది. వెంటనే కుప్పకూలింది. వెంటనే మంటలు అంటుకుని విమానం కాలిపోయింది. దీంతో అందులోని 18 మంది అగ్నికి ఆహుతయ్యారు. పైలట్ ఒక్కడే ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఇతడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు.
Also Read: ఎలాన్ మస్క్ వీడియో: రన్ వేపై మోడీ, ట్రంప్, ఒబామా.. ఏఐ ఫ్యాషన్ షో వీడియోతో ఆశ్చర్యంలో దేశాధినేతలు..
ఎయిర్పోర్టు చుట్టూ లోయలు..
ఇదిలా ఉంటే ఖాట్మండు ఎయిర్పోర్టు చుట్టూ లోయలు ఉన్నాయి. దీంతో ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఎయిర్పోర్ట్ ఖాట్మండు ఇంటర్నేషనల్ ఎయిర్పోట్టును గుర్తించారు. ఇక విమానాల ప్రమాదాల రికార్డు కూడా నేపాల్కే ఉంది. అక్కడి విమానాశ్రయ పరిస్థితులు, విమానాలు లాండ్ అవుతుండగా ఎదురయ్యే వాతావరణ పరిస్థితుల కారణంగా ఇక్కడ ఇప్పటి వరక చాలా విమానాలు కూలిపోయాయి. వేలాది మంది మృత్యువాతపడ్డారు. దీంతో విమాన ప్రమదాల్లో నేపాల్ ఎప్పుడూ వార్తలో నిలుస్తుంది. 2010 నుంచి ఇప్పటి వరకూ నేపాల్లో దాదాపు 12 ఘోర ప్రమాదాలు జరిగాయి. అంటే దాగాపు ఏడాదికి ఒక విమాన ప్రమాదం జరిగింది. తాజాగా జరిగిన విమాన ప్రమాదం బుధవారం(జూలై 24న) ఉదయం 11 గంటలకు జరిగినట్లు నేపాల్ అధికారులు తెలిపారు. గతేడాది జనవరిలో జరిగిన విమాన ప్రమాదంలో 72 మంది మృతిచెందారు. ఎయిర్పోర్టు సమీపంలోని లోయలో విమానం పడి ముక్కలైంది. అంతకు ముందు 2022లో మే 29వ తేదీన తారా ఎయిర్ లైన్స్కు చెందిన విమానం కూడా ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 22 మంది దుర్మరణం చెందారు.
నేపాల్లోనే విమాన ప్రమాదాలు ఎందుకు..?
తెల్లని, చల్లని హిమాలయ పర్వతాల మధ్య ప్రకృతి అందాలతో ఆహ్లాదంగా కనిపించే నేపాల్లో తరచుగా విమాన ప్రమాదాలు జరుగుతాయి. ఇక్కడ విమాన ప్రమాదాలకు భౌగోళిక, ఆర్థిక కారణాలు ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన రన్వేలు నేపాల్లో ఉన్నాయి. ముఖ్యంగా ‘లుకుల’ వంటి ప్రమాదకరమైన రన్వేలపై విమానాలు దింపడం నిపుణులైన పైలట్లకు కూడా కష్టం. మౌంట్ ఎవరెస్టు వెళ్లేవారికి ఈ ఎయిర్ పోర్టే కీలకం. సముద్రమట్టానికి చాలా ఎత్తులో పర్వతాల మధ్యలో ఈ ఎయిర్ పోర్టు ఉంటుంది. ఇక్కడి రన్వే చాలా చిన్నది. దీని పొడవు కేవలం 527 మీటర్లు మాత్రమే. ప్రపంచంలోనే 14 అత్యంత కఠిన పర్వతాల్లో 8 నేపాల్లోనే ఉన్నాయి. వీటిల్లో ఎవరెస్ట్ కూడా ఒకటి.
వేగంగామారే వాతావరణం..
ఇక నేపాల్లో విమాన ప్రమాదాలకు రన్వేలు ఒక కారణమైతే.. అక్కడి వాతావరణ పరిస్థితులు కూడా మరో కారణం. ప్రాంతం కావడంతో ఇక్కడి వాతావరణం వేగంగా మారుతుంది. ఎయిర్ పోర్టులు సముద్రమట్టానికి ఎత్తుగా ఉంటాయి. ఇక్కడ గాలి. సాంద్రత తక్కువగా ఉంటుంది. దీంతో విమానాల ఇంజిన్ల సామర్థ్యం తగ్గిపోతుంది. హఠాత్తుగా వాతావరణం మారితే మార్గం కనిపించడం కష్టమైపోతుంది. దీనికి గాలి సాంద్రతలో తేడాలు కూడా తోడవడంతో ప్రయాణాన్ని కఠినంగా మార్చేస్తాయి.
కాలం చెల్లిన టెక్నాలజీ..
ఇక ప్రపంచంలోని పేద దేశాల్లో నేపాల్ ఒకటి. ఇక్కడ విమాన సర్వీసులు నిర్వహించే సంస్థలు దేశీయ ప్రయాణాలకు పాత విమానాలనే వాడతాయి. అనుకోని సమస్యలు ఎదురైతే తట్టుకొనేలా అత్యాధునిక వాతావరణ రాడార్లు, జీపీఎస్ టెక్నాలజీ వంటివి వీటిల్లో ఉండవు. అక్కడ ఇప్పటికీ దశాబ్దాల నాటి విమానాలు వినియోగిస్తుంటారు. ఈ పాత విమానాలకు వేగంగా మారే తావావరణాన్ని తట్టుకునే టెక్నాలజీలు లేవు. అందుకే బ్రిటన్ వంటి దేశాలు, దౌత్య కార్యాలయాలు నేపాల్లో ప్రయాణించే తమ దేశస్తులకు ముందస్తు సూచనలు చేస్తాయి. ఈ నేపథ్యంలో నేపాల్లో పరిస్థితుల్లో మార్పు తెచ్చేందుకు ఐక్యరాజ్య సమితికి చెందిన ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ నేపాల్ ఎయిర్లైన్స్తో కలిసి పనిచేస్తోంది.
Also Read: కమల హారిస్ గెలవాలని.. తమిళనాడులోని ఆమె స్వగ్రామంలో ప్రత్యేక పూజలు…