America Ram Temple: ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో భారతీయులు నివసిస్తున్నారు. ఉద్యోగం, వ్యాపారం కోసం పలు దేశాల్లో స్థిరపడ్డారు. ఇక దశాబ్దకాలంగా ఉన్నత విద్య, ఉద్యోగాల కోసం ఫారిన్ వెళ్తున్న భారతీయులు పెరుగుతున్నారు. ఇలా వెళ్తున్నవారంతా ఆయా దేశాల్లో ఒకేచోట ఉండేందుకు ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలో అక్కడ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను కొనసాగిస్తున్నారు. అక్కడి ప్రభుత్వాల అనుమతితో ఆలయాలు సైతం నిర్మిస్తున్నారు. ఇటీవలే అరబ్ దేశమైన అబుదాబిలో అతిపెద్ద హిందూ ఆలయం నిర్మించగా, తాజాగా అమెరికాలో రామ మందిరం నిర్మాణానికి అక్కడి హిందువులు శ్రీకారం చుట్టారు.
భద్రాచలం ఆలయం తరహాలో..
అమెరికాలోని అట్లాంటా సమీపంలోని కమింగ్ వద్ద భద్రాచల రామాలయం తరహాలో రామాలయ నిర్మాణం చేపట్టినట్లు అక్కడ ముఖ్య అర్చకుడిగా వ్యవహరిస్తున్న పద్మనాభాచార్యులు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులు, దాతల సహకారంతో 33 ఎకరాల్లో రూ.300 కోట్లతో ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. తోటి అర్చకులతో భద్రాచలంలోని సీతారామచంద్రస్వామి ఆలయ ప్రధానార్చకుడు సీతారామానుజాచార్యులతోపాటు కొంతమంది వైదిక పెద్దలను కలిసి సలహాలు తీసుకున్నారు.
ఆళ్లగడ్డలో విడిభాగాల నిర్మాణం..
ఇక అట్లాంటాలో రామాలయ పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ప్రధాన కోవెల విడిభాగాలను ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు చెందిన స్థపతులు నిర్మిస్తున్నారని పద్మనాభాచార్యులు తెలిపారు. ఆళ్లగడ్డలో పనులు పూర్తయ్యాక వాటిని అట్లాంటా ప్రాంతానికి విమానంలో తరలిస్తామని పేర్కొన్నారు. ఆలయ నిర్మాణం ఈ ఏడాది ఆగస్టు నాటికి పూర్తి చేసి అదే నెల 17న ఖగోళయాత్రను అయోధ్య నుంచి ప్రారంభిస్తామని తెలిపారు. సెప్టెంబరు 17 వరకు యాత్ర కొనసాగుతుందని పేర్కొన్నారు. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, అర్జెంటీనా, జపాన్, అలస్కా దేశాలకు సీతారాముల విగ్రహాలను ప్రత్యేక విమానంలో తీసుకెళ్లి శాంతి కల్యాణాలు నిర్వహిస్తామని వివరించారు.