Vizianagaram : బిడ్డతో వ్యభిచారం కోసం తల్లి చేసిన ఘాతుకం!

యుక్త వయసు అమ్మా­యి­లా కనిపించేలా చేసేందుకు హార్మోన్‌ ఇంజెక్షన్లు, ట్యాబ్లెట్లను వాడించడం మొదలుపెట్టింది. కన్న తల్లి చేష్ట­లను భరించలేక బాధిత బాలిక 1098 నంబర్‌కు ఫోన్‌ చేసి చైల్డ్‌లైన్‌ను ఆశ్రయించింది. 

Written By: Raj Shekar, Updated On : June 4, 2023 1:33 pm
Follow us on

Vizianagaram : అమ్మ.. రెండక్షరాల పదాన్ని మించిన గొప్ప కావ్యం ప్రపంచంలోనే లేదు. అమ్మ ఓ దైవం.. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే.. బ్రహ్మ అయినా.. ఓ అమ్మకు కొడుకే.. ఎంత చెప్పినా అమ్మగురించి తక్కువే. బిడ్డలు చెడ్డ వారు కావొచ్చు కానీ.. తల్లి ఎప్పుడు చెడ్డది కాదు. జ్ఞానం లేని జీవులు కూడా పిల్లలపై మాతృత్వాన్ని చూపుతాయి. కానీ, ఇక్కడ ఓ తల్లి దారితప్పింది. పెళ్లయిన కొన్నేళ్లకే మొదటి భర్తకు విడాకులిచ్చింది. ఆ తరువాత సబ్‌ ఇంజినీర్‌ను వివాహం చేసుకుంది. కొంతకాలానికి అతనితోనూ తెగతెంపులు చేసు­కుని వ్యభిచారం ప్రారంభించింది. చివరకు తన 15 ఏళ్ల కుమార్తెను కూడా వ్యభిచార కూపంలోకి దింపాలని, అనంతరం సినీ, టీవీ రంగంలోకి పంపించాలని భావించింది. ఆ బాలిక శరీర భాగా­లు విపరీతంగా పెరిగేలా.. యుక్త వయసు అమ్మా­యి­లా కనిపించేలా చేసేందుకు హార్మోన్‌ ఇంజెక్షన్లు, ట్యాబ్లెట్లను వాడించడం మొదలుపెట్టింది. కన్న తల్లి చేష్ట­లను భరించలేక బాధిత బాలిక 1098 నంబర్‌కు ఫోన్‌ చేసి చైల్డ్‌లైన్‌ను ఆశ్రయించింది.

తల్లిని విభేదించినా.. 
నవోదయ పాఠశాలలో చ­దువుతున్న ఓ బాలిక ఇటీవల పదో తరగతి పరీక్షలు రాసి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. ఆ బాలిక ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరంలో ఉంటున్న తల్లి దగ్గరకు ఇటీవల వచ్చింది. తెలియని వ్యక్తులు తరచూ ఇంటికి రావడం.. తల్లి తనముందే వారితో వ్యభిచారం చేయడాన్ని భరించలేక.. తల్లితో విభేదించింది.
తనలాగే ఉండాలని..
బాలికను కూడా తన మాదిరిగానే ఇంటికి వచ్చే వ్యక్తులతో చనువుగా ఉండాలని తల్లి ఒత్తిడి చేసింది. దీనిని బాలిక తట్టుకోలేకపోయింది. మరోవైపు శరీర భాగాలు పెరిగేందుకు ఇచ్చే ఇంజెక్షన్లు, టాబ్లెట్ల వల్ల అనారోగ్యానికి గురయింది. ఈ పరిస్థితుల్లో తల్లి ఒత్తిడిని తట్టుకోలేక గురువారం రాత్రి చైల్డ్‌లైన్‌ 1098కి కాల్‌ చేసి రక్షణ కోరింది. రంగంలోకి దిగిన చైల్డ్‌లైన్‌ సభ్యులు, దిశ పోలీసులు ఆ బాలికను దిశ స్టేషన్‌కు తీసుకువచ్చి విచారణ జరిపారు. బాలిక నుంచి ఫిర్యాదు తీసుకున్నాక అదేరోజు రాత్రి స్వధార్‌ హోమ్‌కు తరలించారు.
పునరావాస కేంద్రానికి..
అనంతరం విశాఖలోని ప్రభుత్వ బాలికల పునరావాస కేంద్రంలో చేర్పించారు. బాలిక సంక్షేమం చూడాలంటూ పునరావాస కేంద్రం సూపరింటెండెంట్‌కు రాష్ట్ర బాలల హక్కుల కమిషన్‌ చైర్మన్‌ అప్పారావు సూచించారు. ఈ విషయాన్ని విజయనగరం ఎస్పీ ఎం.దీపిక దృష్టికి తీసుకువెళ్లారు. బాలిక తల్లిని అదుపులోకి తీసుకుని చిల్డ్రన్స్‌ కోర్టులో విచారణ జరిపారు.
బిడ్డను కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లే… తన కనుపాపను రొంపిలోకి దించాలని చూడడం విషాదకం. అయితే తల్లి చేష్టలను పసిగట్టిన ఆ బాలిక.. ధైర్యం చేసి స్వేచ్ఛా జీవితం పొందింది. ఉన్నతంగా ఎదిగి మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షిద్దాం.