World Photography Day 2023: కరిగిపోని కాలాన్ని పదికాలాల పాటు ఒడిసిపట్టి కళ్లముందు సాక్షాత్కరింప చేసేది ఫొటో.. నిన్నటి జ్ఞాపకాలను రేపటికి సజీవంగా దృశ్య కావ్యంగా నిలుపుతుంది చిత్రం… వేయి పదాలు చెప్పని అర్థాన్ని ఒక్క ఫొటో సజీవంగా చూపుతుంది. అందుకే చిత్రానికి ప్రాధాన్యత పెరిగిపోయింది. .. ఒకప్పుడు ఫొటో అంటే అదేదో గొప్పింటి వాళ్లకే అవకాశం దక్కింది… కానీ నేటి ఆధునిక పోకడలతో సెల్ అందుబాటులోకి వచ్చాక ఫొటో మరింత దగ్గరయ్యింది… దీంతో ప్రతి వ్యక్తికీ ఫొటో సుపరిచితం అయ్యింది. ఒకప్పుడు కెమెరాలు.. స్టిల్కెమెరాలతో వృత్తిగా ఎంచుకున్న వ్యక్తులకు మాత్రమే ఫోటోలు తీసే అవకాశం ఉండేది. కానీ నేడు ప్రతి పనికీ ఫొటో జతయ్యింది. ఫొటో లేకుండా కనీసం ఏ పనీ జరిగే పరిస్థితి లేకుండా పోయింది.
మరిచిపోలేని మధుర జ్ఞాపకాలను పదిలంగా నిలిపేది కాలంతో పాటు మనముందు కదిలిపోతున్న అపురూప దృశ్యాన్ని కళ్లముందు సాక్షాత్కరింప చేసేదే ఫొటోగ్రఫీ. ప్రాచీన కాలంలో కెమెరా అంటే ఒక చీకటి గదిలో వస్తువులపై కాంతిని ప్రసరింపచేసి దానిని చిత్రీకరించే వారు. 1800 సంవత్సరం వరకు కెమెరా అంటూ ఏమీ లేదు. థామస్ వెడ్జ్ వుడ్ అనే వ్యక్తి కెమెరా ద్వారా ఫొటోలను తీసే విధానాన్ని కనిపెట్టారు. 1820లో నైస్ఫోర్నిప్సిక్ ద్వారా విజయం సాధించారు. ఆ తర్వాతకెమెరాను లూయిస్ దుగ్గరే అనే వ్యక్తి మరింత అభివృద్ధి చేశారు. ఆ తర్వాత వాణిజ్యపరంగా 1839లో కెమెరాను ప్రపంచానికి పరిచయం చేశారు. తొలుత బ్లాక్ అండ్వైట్ చిత్రాలను మాత్రమే తీసుకునే వీలుకలిగింది. ఆ తర్వాత 1985 తర్వాత కలర్ ఫిల్మ్లతో చిత్రాలు తీసే కెమెరాలు మార్కెట్లోకి లభ్యమయ్యాయి. 1995 తర్వాత కంప్యూటర్ ఆధారిత ఎలక్ర్టానిక్ డిజిటల్ కెమెరాలు మార్కెట్లోకి రావడంతో ఫొటోగ్రఫీలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ఆధునిక టెక్నాలజీ ఫొటోగ్రఫీ రంగాన్ని శాసిస్తోంది. ఈ డిజిటల్ రంగం రావడంతో సమాజంలో ఫొటోగ్రఫీకి మరింత ప్రాముఖ్యత పెరిగింది. దీనితో పాటు ఒకప్పుడు పెద్దపెద్ద నగరాలకే పరిమితమైన స్టూడియోలు, కలర్ల్యాబ్లు నేడు మండల, గ్రామీణ ప్రాంతాల్లోకి కూడా ఫోటోస్టూడియోలు విస్తరించాయి. కలర్ల్యాబ్లు కూడా వేలాదిగా అందుబాటులోకి రావడంతో ప్రజలకు ఫొటోగ్రఫీ మరింత అందుబాటులోకి వచ్చింది. నేడు పత్రికల్లో ప్రముఖ చిత్రాలు.. ఇళ్లలో చిన్న వేడుకలనుంచి వివాహాలు.. ఇతర అన్ని శుభకార్యక్రమాలు ఫొటోగ్రఫీతో ముడిపడ్డాయి. డిజిటల్ కెమెరాల నుంచి స్మార్ట్ఫోన్ల వరకు ఫొటోగ్రఫీ అందుబాటులోకి వచ్చింది. ఫలితంగా ఫొటోగ్రఫీకి మంచి ఆదరణ లభిస్తోంది.
అత్యాధునిక పోకడలు
ప్రస్తుతం చిన్న శుభకార్యమైనా ఫొటోగ్రఫీకి అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నారు. ఫొటోగ్రఫీలో ఆధునిక పోకడలు సంతరించుకుంటున్నాయి. క్యాండిడ్ ఫొటోగ్రఫీ,డ్రోన్ కెమెరాలతో, ఎల్ఈడీలు, గింబర్షాట్స్, మినీజిన్నీ, ఫ్లైడర్షాట్స్,క్రేన్లతో షూటింగ్ , వీడియోగ్రఫీలో టీజర్స్, వీడియో ఆహ్వానాలు, విజువల్స్ మొత్తాన్ని పెళికుమారుడు, పెళ్లికూతురుని ముందస్తుగానే ఔట్డోర్లో షూటింగ్ చేసి పాటలతో కనువిందుగా చూపిస్తున్నారు. ఇటీవల కాలంలో ఈతరహా ఫొటోగ్రఫీకి మంచి డిమాండ్ పెరింగింది. ఒకప్పుడు రాజధాని కేంద్రాల్లో, పెద్దపెద్ద నగరాల్లో ఒక స్థాయి కలిగిన కుటుంబాల్లో జరిగే వేడుకలకు ఇలాంటి ఖరీదైన ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీని వినియోగించే వారు. కానీ క్రమేణా అది ద్వీతీయ శ్రేణి పట్టణాల నుంచి మండల కేంద్రాలకు, తద్వారా గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరిస్తోంది.
క్యాండిడ్ ఫొటోగ్రఫీ
ఈ తరహాలో ఏదైనా శుభకార్యంలో ఆ కుటుంబీకులు, శుభకార్యం జరిగే సందర్భంలో వారికి తెలియకుండా వారి ముఖకవళికలను ఆనందక్షణాలను కెమెరాల్లో బందిస్తారు. కెమెరామెన్ అత్యంత చాకచక్యంతో వారికి తెలియకుండానే కెమెరాలో క్లిక్మనిపిస్తారు. ఆ తర్వాత ఆక్షణాలను ఫొటో ద్వారా ముంద్రించి ఆల్బంలో అందంగా అలంకరించి ఇస్తున్నారు. దీంతో నూతన వధూవరులైతేనేం, శుభకార్యం జరిగిన కుటుంబీకులకు ఆశ్యర్యానికి గురయ్యేలా చిత్రీకరణ చేస్తారు. వీడియోగ్రఫీలో కూడా ఇలాగే ఉంటుంది. ఇలాంటి ఫొటోగ్రఫీ కాస్త ఖరీదుగానే ఉంటుంది. ఒకప్పుడు పెళ్లికి రూ 10నుంచి 15వేల బడ్జెట్ను కేటాయించే వారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో లక్షల్లో బడ్జెట్ కేటాయిస్తున్నారు. ఒకప్పటితో పోల్చితే ప్రస్తుత ఫొటోగ్రఫీ అత్యంత ఖరీదైనదిగా మారింది.
ఖరీదైన ఆల్బమ్లు
పెళ్ళి, గృహప్రవేశం, ఓణీల వేడుకలు ఇలా శుభకార్యం ఏదైనా ఆ జ్ఞాపకాలను మననం చేసుకునేందుకు ఫోటో ఆల్భం ప్రధానమైంది. ఈ ఆల్బమ్ను ఫొటోగ్రాఫర్లు అందంగా సిద్ధం చేసి ఇస్తున్నారు. క్యాండిడ్ ఫొటోగ్రఫీ, బ్లాక్అండ్ వైట్ చిత్రాలతో ఆల్బంలను తయారు చేస్తున్నారు. ఒక్కో సైజును బట్టి ఆల్బమ్ను సిద్ధం చేస్తున్నారు. కరిజ్మా, టెరిబుల్ నాన్టెరిబుల్, మెటాలిక్ , ఎంబోజింగ్ ఆల్బమ్ లు పలు ఆకర్షణీయమైన పద్ధతుల్లో తయారు చేస్తున్నారు. వీటికి ఒక్కో రకానికి ఒక్కో విధంగా రేటును వసూలు చేస్తున్నారు.
వీడియో ఆహ్వానాలు
మారుతున్న బిజీ ప్రపంచానికి అనుగుణంగా పెళ్లిళ్లకు, ఇతర శుభకార్యాలకు ఆహ్వానాలు కొత్తపుంతలు తొక్కుతోంది. వధూవరులను ముందస్తుగానే షూటింగ్ చేసి రెండు నిమిషాలనుంచి మూడు నిమిషాల నిడివితో అత్యంత ఆధునికీకరణ పద్దతులో వీడియో టీజర్స్ను సిద్ధం చేస్తున్నారు. దీన్ని బంధువులకు,స్నేహితులకు సెల్ఫోన్ల ద్వారా వాట్సప్ వీడియో ఆహ్వానాలను పంపిస్తున్నారు. ఇటీవల కాలంలో దీనికి మరింత ఆదరణ పెరిగింది. అంతే కాదు వివాహ సందర్భంలోనూ నూతన వధూవరులపైచిత్రీకరించిన పాటలు, సన్నివేశాలు సినిమా సందర్భాలకు తీసిపోని విధంగా మన ఛాయాచిత్రకారులు అధునాకడ పోకడలతో ప్రజలను ఆకట్టుకుంటున్నారు.