భారత్ లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. వేల సంఖ్యలో కరోనా కేసులు నమోవదవుతున్నా అదే సంఖ్యలో రికవరీ కేసులు ఉండటంతో ప్రజల్లో గతంతో పోలిస్తే వైరస్ గురించి భయం తగ్గింది. అయితే కరోనా గురించి వెలుగులోకి వస్తున్న విషయాలు ప్రజల్లో భయాందోళనను అంతకంతకూ పెంచుతున్నాయి. వైరస్ బారిన పడి కోలుకున్న వారిలో కంటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.
వైరస్ నుంచి కోలుకున్న తర్వాత కంటికి సంబంధించిన ఏ సమస్యలు వచ్చినా వైద్యుడిని సంప్రదించాలని సూచనలు చేస్తున్నారు. ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వైద్యులు కోలుకున్న వారిలో ప్రధానంగా రెటీనా సంబంధిత సమస్యలు, చూపుకు సంబంధించిన సమస్యలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. రెటీనల్ వాస్క్యులర్ వ్యాధి ఎక్కువగా కోలుకున్న వారిలో కనిపిస్తోందని.. నిర్లక్ష్యం వహిస్తే దృష్టి లోపం ఏర్పడే అవకాశం ఉందని సూచిస్తున్నారు.
కరోనా బారిన పడ్డ వారిలో కొందరిలో తీవ్ర కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయని వారికి చికిత్స కోసం వైద్యులు స్టెరాయిడ్లను ఎక్కువగా వినియోగిస్తున్నారని.. ఫలితంగా కంటికి ముప్పు ఏర్పడుతోందని చెబుతున్నారు. కంటి చూపు మసక బారడం రెటినోపతి యొక్క ప్రధాన లక్షణమని వైద్యులు వెల్లడిస్తున్నారు. వైరస్ నుంచి కోలుకున్న తరువాత కంటి సమస్యలు కనిపిస్తే పరీక్షలు చేయించుకోవాలని సూచనలు చేశారు.
ఆస్పత్రికి రాలేని వారు టెలీ కన్సల్టేషన్ ద్వారా సంప్రదించాలని వైద్యులు వెల్లడించారు. కరోనా చికిత్స కోసం వైద్యులు స్టెరాయిడ్లు ఇస్తే వారిలో వారిలో కంటి సమస్యలతో పాటు చర్మ సంబంధిత సమస్యలు కూడా వస్తాయని వైద్యులు వెల్లడించారు. కరోనా గురించి కొత్త వార్తలు వెలుగులోకి వస్తూ ఉండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతూ ఉండటం గమనార్హం.