Homeట్రెండింగ్ న్యూస్Shivani Poddar: ఫ్యాషన్ కోర్సులు చేయకుండానే..ఫ్యాషన్ కంపెనీ ఓనర్ అయింది. 190 కోట్లు సంపాదించింది!

Shivani Poddar: ఫ్యాషన్ కోర్సులు చేయకుండానే..ఫ్యాషన్ కంపెనీ ఓనర్ అయింది. 190 కోట్లు సంపాదించింది!

Shivani Poddar: కష్టే ఫలి అంటారు కదా! ఆ యువతి విషయంలో ఇది నూటికి నూరుపాళ్ళు నిజమైంది.. నీకెందుకు అని ఈసడించిన వాళ్ళు ఉన్నారు. నీ వల్ల అవుతుందా అని దెప్పి పొడిచిన వాళ్ళు కూడా ఉన్నారు. వీటన్నింటినీ ఆమె తట్టుకుంది. ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సులేవీ చేయకుండానే.. బడా ఫ్యాషన్‌ బ్రాండ్‌కు సారథ్యం వహిస్తోంది. పదేళ్ల కిందట స్నేహితురాలితో కలిసి ఆమె నెలకొల్పిన సంస్థ నేడు కోట్లకు పడగలెత్తింది. భారతీయ సంప్రదాయ వస్త్ర శ్రేణికి ఆధునికత జోడించి…
మహిళల ప్రియమైన బ్రాండ్‌గా అవతరించేలా చేసింది. 190 కోట్ల కంపెనీగా ఎదిగేలా చేసింది. ఆ కంపెనీ పేరే ‘హై స్ర్టీట్‌ ఎసెన్షియల్స్‌’. ఆ కంపెనీ సహ యజమాని, 37 ఏళ్ల శివానీ పోద్దార్‌ విజయ పరంపర ఇది…

వరూ నమ్మరు కానీ..

హై స్ర్టీట్‌ ఎసెన్షియల్స్‌’ (హెచ్‌ఎస్‌ఈ) ప్రారంభించేనాటికి శివానీ పోద్దార్‌ కి ఫ్యాషన్‌ డిజైనింగ్‌ తెలియదు. వెబ్‌సైట్‌ నడిపించేటంత సాంకేతిక పరిజ్ఞానం లేదు. ఆమె స్నేహితురాలు, సహ వ్యవస్థాపకురాలైన తాన్వి మాలిక్‌ పరిస్థితి కూడా అదే. ఉన్నదల్లా… వారి మీద వారికి నమ్మకం. అయితే పారిశ్రామికవేత్త కావాలన్నది శివానీ పోద్దార్‌ చిరకాల కోరిక. ఆమె అమ్మా నాన్నలు ఎక్స్‌పోర్ట్‌ బిజినెస్‌ చేసేవారు. ఢిల్లీలోని యాభై చదరపు అడుగుల చిన్న ఆఫీస్‌లో వాళ్లు విజయవంతంగా వ్యాపారం కొనసాగిస్తున్నారు. వారి ఇంట్లో రోజూ డైనింగ్‌ టేబుల్‌ దగ్గర వ్యాపార లావాదేవీలకు సంబంధించిన చర్చలు నడుస్తుంటాయి. చిన్నప్పటి నుంచి ఆ చర్చలు వింటూ… అమ్మానాన్నను చూస్తూ పెరగడంవల్ల సొంత వ్యాపారం ప్రారంభించాలనే కోరిక ఆమెలో బలపడింది. అందుకే ఎంబీఏ ఫైనాన్స్‌లో చేరింది.

2009లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా అందుకున్న వెంటనే శివానీ పోద్దార్‌ కు ‘హిందుస్తాన్‌ యూనిలివర్‌’లో ఫైనాన్స్‌ మేనేజర్‌గా ఉద్యోగం వచ్చింది. దాంతో ముంబయి వెళ్ళింది.. అందులో ఏడాదిన్నర పని చేశాక ‘అవెండెస్‌ క్యాపిటల్‌’లో అసోసియేట్‌గా వెళ్ళింది. మంచి హోదా… అందుకు తగిన జీతం. ఏ ఇబ్బందులూ లేకుండా ఊహించినదాని కంటే అద్భుతంగా సాగిపోతోంది జీవితం.

కొలువులో కొత్త ఆలోచన…

‘అవెండెస్‌’లో ఉద్యోగంలో భాగంగా రోజూ ఎంతోమంది పారిశ్రామికవేత్తలతో మాట్లాడేది శివానీ పోద్దార్‌. వాళ్ల సంస్థలను విక్రయించడం లేదంటే నిధులు పొందడంలో సహకరించేది. ఇవన్నీ చూశాక పారిశ్రామికవేత్త కావాలన్న ఆమెలో చిరకాల కోరిక మేల్కొంది. ‘సొంతంగా నేనే ఒక సంస్థ ఎందుకు ప్రారంభించకూడదు?’. ఈ ఆలోచన ఆమెకి నిద్రపట్టనివ్వలేదు. ఇదే విషయం తాన్వి మాలిక్‌కు చెప్పింది. ఆమె మార్కెటింగ్‌ నిపుణురాలు. శివానీ పోద్దార్‌
చిన్ననాటి స్నేహితురాలు. కొంతకాలం వారిద్దరూ కలిసి చదువుకున్నారు. అప్పుడు ‘టైటాన్‌’లో పని చేసేది. చెప్పగానే తాన్వి కూడా ఓకే అంది.

ఆరు నెలలు అధ్యయనం చేశాం

ఫ్యాషన్‌ ఇ-కామర్స్‌ కంపెనీ నెలకొల్పాలనేది వారి ఆలోచన. దాని కోసం అధ్యయనం మొదలుపెట్టారు. ఇప్పటికే ఉన్నవాటితో పోటీ పడి ఎలా నిలదొక్కుకోవాలి? అసలు కొత్త బ్రాండ్‌కు మార్కెట్‌ ఉందా? ఉంటే ధరలు ఎలా ఉన్నాయి? …ఇలా ఆరు నెలల పాటు అన్ని కోణాల్లో అధ్యయనం చేశారు. ఈ క్రమంలో ఎంతోమంది వినియోగదారులు, వ్యాపారస్తులను కలిసి మాట్లాడారు. అన్నిటినీ బేరీజు వేసుకుని, ఒక నివేదిక సిద్ధం చేసుకున్నారు. ఆసక్తికరమైన అంశం ఏంటంటే… మగవారితో పోలిస్తే మహిళల ఫ్యాషన్‌ ఉత్పత్తుల రంగం పరిధి తక్కువగా ఉన్న దేశం మనదే. వీటన్నిటి నేపథ్యంలో భారత్‌ ఫ్యాషన్‌ రంగం మరింతగా వేగంగా అభివృద్ధి చెందుతుందనే అంచనాకు వచ్చారు. ఆ అంచనాతోనే మేం దాచుకున్న డబ్బుతో 2012లో ‘హెచ్‌ఎస్‌ఈ’ ఇ-కామర్స్‌ కంపెనీ ప్రారంభించారు. ఆ సంస్థ ద్వారా మహిళల ఫ్యాషన్‌ వేర్‌ ‘ఫ్యాబ్‌అలే’ బ్రాండ్‌ తీసుకువచ్చారు. పాశ్చాత్య వస్త్ర శ్రేణుల బ్రాండ్‌ ఇది.

అన్నీ మేమే.. ఎవరూ రాలేదు...

ఎప్పుడైతే వ్యాపార ఆలోచన వచ్చిందో… అప్పుడే వారు ఉద్యోగాలు వదిలేశారు. ఢిల్లీలోని ఓ వంద చదరపు అడుగుల గదిలో ఆఫీస్‌. ఆరంభంలో ఇద్దరే ఉద్యోగులు ఉండేవారు. డ్రెస్‌లు డిజైనింగ్‌ నుంచి మార్కెటింగ్‌, సప్లై చైన్‌, వెబ్‌సైట్‌ మెయింటెనెన్స్‌… ప్రతిదీ వారు ఇద్దరే చూసుకున్నారు. వారికి ఫ్యాషన్‌ డిజైనింగ్‌, కోడింగ్‌లు రాకపోయినా… నేర్చుకుని, ప్రయత్నించారు. ఇన్వెస్టర్ల దగ్గరకు వెళితే… వారికి ఏమీ తెలియదన్న కారణంతో వెనక్కి పంపారు. వెబ్‌డెవలపర్స్‌తో కూర్చొని సైట్‌ బిల్డింగ్‌లో వారు పని చేశారు. చివరకు ఫొటోషాప్‌ కూడా నేర్చుకున్నారు. వస్త్రాలు కొని, కొన్ని వెరైటీలు రఫ్‌గా డిజైన్‌ చేసి, బయట టైలర్లకు ఇచ్చి కుట్టించారు. మొదటి ఆరు నెలలు వారి ఆఫీస్‌ ఓ ట్రైనింగ్‌ సెంటర్‌లా మారింది. వెబ్‌సైట్‌ ప్రారంభించాక కంపెనీ నడిపించాలంటే నిధులు కావాలి. వాటి కోసం ఆన్‌లైన్‌ ఆర్డర్లు ఎప్పుడు వస్తాయా అని వేచి చూశారు. పెట్టుబడి పెట్టేవారిని తేవడం పెద్ద సవాలుగా మారింది. అనుభవం లేదని వారిని ఎవరూ నమ్మలేదు.

మరో బ్రాండ్‌కు శ్రీకారం…

అయితే వారు పట్టు వదల్లేదు. ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. వచ్చింది వచ్చినట్టు వ్యాపారంలోనే పెట్టుబడి పెడుతూ వచ్చారు. కొన్ని మాసాలకు క్రమంగా లాభాల్లో పడ్డారు. నాలుగేళ్లు తిరిగే సరికి రూ.35 కోట్ల బ్రాండ్‌ రెవెన్యూ సాధించారు. అప్పుడే వారి బ్యాంక్‌ ఖాతాల్లో డబ్బు కనిపించింది. వాటితో కంపెనీని మరింత విస్తరించే పనులు మొదలుపెట్టారు. అయితే ఒక దీపావళి సమయంలో వారి ఉత్పత్తుల అమ్మకాలు బాగా తగ్గిపోయాయి. ఇది వారిని ఆలోచనలో పడేశాయి. ఆందోళన పడకుండా… దాన్ని ఒక అవకాశంగా తీసుకున్నారు. భారతీయ వస్త్రాలకు పాశ్చాత్య హంగులద్ది నలభై క్రాప్‌టాప్స్‌ ఆన్‌లైన్‌లో వదిలారు. పదిహేను రోజుల్లోనే అవన్నీ అమ్ముడయ్యాయి. దాంతో తరువాతి నాలుగు నెలలు కూడా అదే కలెక్షన్‌ అందుబాటులో ఉంచితే… అవీ మిగల్లేదు. అప్పుడు అనుకున్నారు… వారి కంపెనీని భారీ స్థాయికి తీసుకువెళ్లాల్సిన సమయం వచ్చిందని. భారతీయ సంప్రదాయ దుస్తులకు ఆధునిక మెరుగులు అద్ది ‘ఇండ్యా’ పేరుతో సరికొత్త బ్రాండ్‌ను ఆవిష్కరించారు. పది మిలియన్‌ డాలర్ల ఆదాయం రాబట్టాలన్న లక్ష్యంతో పని చేశారు.

కరోనా కుదిపినా…

వారి కొత్త కలెక్షన్‌ మహిళలకు విపరీతంగా నచ్చాయి. దాంతో ఆఫ్‌లైన్‌లో కూడా అమ్మకాలు జరపాలని నిర్ణయించారు. బడా షాపింగ్‌ మాల్స్‌తో ఒప్పందాలు చేసుకుని దేశంలోని ప్రధాన నగరాల్లో అందుబాటులోకి తెచ్చారు. తరువాత మేమే సొంతంగా స్టోర్స్‌ ప్రారంభించారు. ప్రస్తుతం మా కంపెనీకి దేశంలోని పది నగరాల్లో పాతిక స్టోర్స్‌ ఉన్నాయి. అయితే కరోనా మా బిజినెస్‌పై తీవ్ర ప్రభావం చూపించింది. ఏడాదికి నాలుగు రెట్లు అభివృద్ధితో దూసుకుపోతున్న వారి కంపెనీ… 2020లో 130 కోట్ల టర్నోవర్‌కు చేరుకుంది. కానీ కరోనా వల్ల ఆదాయం సున్నాకు పడిపోయింది. అమ్మకాలు మళ్లీ ఎప్పుడు మొదలవుతాయో తెలియదు. చాలా కంపెనీలు మూత పడిపోతున్నాయి. మమ్మల్ని నమ్ముకుని పదకొండు వందల మంది ఉద్యోగులు జీవిస్తున్నారు. వాళ్లకు జీతాలు ఎలా ఇవ్వాలి? ఖాళీగా ఉండే కుదరదు. కనుక వారి దగ్గరున్న వస్త్రాలతో మాస్క్‌లు, టీషర్ట్‌లు కూడా తయారు చేశాం. ఇంటికి వెళ్లి డ్రెస్‌లు అమ్మారు. అలా కొంత ఆదాయం రాబట్టి, సంస్థను నిలబెట్టుకున్నారు. చివరకు 2021 చివర్లో జనం స్టోర్స్‌కు రావడం మొదలుపెట్టారు. ఊపిరి పీల్చుకున్నారు. ఇక అక్కడి నుంచి విజయవంతంగా సాగిపోతున్నారు.

అంతర్జాతీయంగానూ…

గత ఏడాది ‘ఇండ్యా లక్సే’ పేరుతో వెడ్డింగ్‌ వేర్‌ బ్రాండ్‌ తీసుకువచ్చారు. లెహంగాలు, చీరల కలెక్షన్‌ ఇది. వీటి అమ్మకాలకు బెంగళూరులో ప్రత్యేకంగా ఒక స్టోర్‌ నెలకొల్పారు. ఏడాదిలో పన్నెండు శాతం వృద్ధి కనిపించింది. వెబ్‌సైట్‌ ద్వారా కొనేవారిలో ఎనభై శాతం విదేశాల్లో ఉండే భారతీయులే. దీనివల్ల వారి బ్రాండ్‌కు అంతర్జాతీయంగానూ ఆదరణ లభిస్తోంది. ‘అమెజాన్‌’లో అమెరికాలో కూడా అందుబాటులో ఉన్నాయి. బ్రిటన్‌, దక్షిణాఫ్రికా, నేపాల్‌, మలేషియాల్లోనూ త్వరలో అమ్మకాలు ప్రారంభించనున్నారు. ఈ ఏడాది వారి సంస్థ నికర ఆదాయం రూ.190 కోట్లు. ఏదిఏమైనా సొంత ఆలోచనతో నాకంటూ ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నందుకు మహిళలుగా వారు గర్వపడుతున్నారు. ఆత్మవిశ్వాసంతో ప్రయత్నిస్తే మహిళలు ఏ రంగంలోనైనా రాణించగలరని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణలుగా నిలుస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version