Vizag: సమస్యలు చుట్టు ముట్టినప్పుడు.. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పుడు వాటిని ఎదుర్కొలేక చాలా మంది ఆత్మహత్య శరణ్యం అనుకుంటున్నారు. నాలుగు రోజుల క్రితం పిల్లల అనారోగ్య సమస్యలు భరించలేక సాఫ్ట్వేర్ దపంతులు పిల్లలతో కలిసి హైదరాబాద్లోని కుషాయిగూడలో ఆత్మహత్య చేసుకున్నారు. అది మర్చిపోకముందే.. విశాఖపట్నంలో ఆర్థిక ఇబ్బందులు భరించలేక దంపతులు ఆత్మహత్య చేసుకుంటామంటూ సెల్ఫీ వీడియో తీసుకుని కనిపించకుండా పోయారు.
స్టీల్ ప్లాంట్ ఉద్యోగి.. ఆర్థిక ఇబ్బందులు..
ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లా వడ్లపూడి తిరుమలనగర్కు చెందిన వరప్రసాద్(47), మీరా(41) దంపతులు. వరప్రసాద్ స్టీల్ప్లాంట్ ఉద్యోగి. గతకొద్ది రోజులుగా వీరు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నామని, పిల్లలను బాగా చూసుకోవాలని ఓ వీడియో తీసి బంధువులకు పంపి సెల్ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. ఈ వీడియోను చూసిన వారి కుమారుడు కృష్ణసాయి తేజ్ దువ్వాడ పోలీస్ స్టేష¯Œ లో ఫిర్యాదు చేశారు.
గాలిస్తున్న పోలీసులు..
కేసు నమోదు చేసిన దువ్వాడ పోలీసులు దంపతుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఈ క్రమంలో అనకాపల్లి జిల్లాలోని ఏలేరు కాలువ దగ్గర దంపతుల బ్యాగు, దుస్తులు, చెప్పులు లభ్యమయ్యాయి. ప్రస్తుతానికి మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంతకు వాళ్లు ఎక్కడికైనా వెళ్లిపోయారా..? ఆత్మహత్య చేసుకున్నారా..? అన్న కోణంలో విచారణ చేస్తున్నారు.