Balakrishna Veerasimha Reddy : ఏపీ సీఎం జగన్ ప్రతిపక్షాలను అణిచివేస్తున్నారు. వారికి వాయిస్ లేకుండా చేస్తున్నారు. కనీసం ప్రజలను కలవడానికి.. ఓ పండుగ చేసుకోవడానికి కూడా అనుమతించడం లేదు. మనల్ని నిరంకుశంగా పాలించిన బ్రిటీష్ వారు తెచ్చిన నల్లచట్టాలను ఇప్పుడు అమలు చేస్తూ ప్రతిపక్షాల గొంతునొక్కేస్తున్నారు. ఈరోజు కుప్పంలో పర్యటించిన చంద్రబాబును అడ్డుకొని అనుమతి నిరాకరించిన జగన్.. ఆయన బావ మరిది.. హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే అయిన బాలయ్య నటించిన ‘వీరసింహారెడ్డి ప్రీరిలీజ్ ఈవెంట్ కు అనుమతులు రద్దు చేసి గట్టి షాకిచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబుకే కాదు.. ఆయన బామ్మర్ధి, స్టార్ హీరో బాలయ్యను వదలనని స్పష్టం చేశారు. ముందస్తు అనుమతి తీసుకొని తన కొత్త సినిమా ‘వీరసింహారెడ్డి’ సినిమా ప్రీరిలీజ్ ను ఘనంగా నిర్వహిద్దామని ప్లాన్ చేసిన బాలయ్యకు తాజాగా జగన్ సర్కార్ షాకిచ్చింది. ఏపీలో ప్రీరిలీజ్ ఫంక్షన్ జరగడానికి అనుమతి నిరాకరించింది.
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య నటించిన తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి’. ఈ సినిమాలో పవర్ ఫుల్ పాత్రలో బాలయ్య కనిపించనున్నాడు. శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సినిమా సిద్ధమైంది.
వీరసింహారెడ్డి ప్రీరిలీజ్ ఈవెంట్ ను ఒంగోలులో భారీగా నిర్వహించడానికి మేకర్స్ రెడీ అయ్యారు. జనవరి 6న సాయంత్రం 6 గంటలకు ఈ ప్రిలీజ్ ఒంగోలులో నిర్వహించనున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా చేశారు. జనవరి 12న జరగబోయే ఈ ఈవెంట్ కోసం అన్ని ఏర్పాట్లు చేసిన వేళ జగన్ సర్కార్ షాక్ ఇచ్చింది. జగన్ కూడా కాలేజీ రోజుల్లో బాలయ్యకు ఫ్యానే. అలాంటిది ఇప్పుడు సీఎం అయ్యాక ఫక్తు రాజకీయ నేతగా తన అభిమాన హీరోకు కూడా షాకివ్వడాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు.
ఒంగోలులో జరగాల్సిన బాలయ్య ‘వీరసింహారెడ్డి’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కు అనుమతిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరాకరించింది. ఏపీలో ఇటీవల చంద్రబాబు సభలో 8 మంది చనిపోవడం.. మరో సభలో ముగ్గురు చనిపోవడంతో బ్రిటీష్ రూల్ 1861 కింద సభలు, సమావేశాలకు అనుమతులు నిరాకరించింది. ఈ క్రమంలోనే బాలయ్య ప్రీరిలీజ్ కు కూడా అనుమతులు రద్దు చేసింది. దీంతో చేసేదేం లేక కార్యక్రమం రద్దు చేస్తున్నట్టు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు ప్రకటించారు.
అధికార వైసీపీ కార్యక్రమాలకు అనుమతినిస్తూ ప్రతిపక్షాలకు సంబంధించిన కార్యక్రమాలకు జగన్ సర్కార్ అనుమతులు ఇవ్వడం లేదు. ఈరోజు కుప్పంలో చంద్రబాబు పర్యటనకు అనుమతి నిరాకరిస్తే ఆయన అక్కడ ధర్నా చేశారు. ఇప్పుడు ఆయన బావమరిది బాలయ్య సినిమా ఫంక్షన్ కు బ్రేకులు వేశారు. ఏపీలో జగన్ సర్కార్ చేస్తున్న ఈ దమనకాండపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.