IT raids On Director Sukumar: టాలీవుడ్ లో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. నేటి ఉదయం నుండి అధికారులు మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలైన నవీన్ యెర్నేని, రవి శంకర్ ఆఫీసులు, నివాసాలపై సోదాలు నిర్వహిస్తున్నారు. దర్శకుడు సుకుమార్ మీద కూడా అధికారులు దృష్టి పెట్టినట్లు సమాచారం. ఆయన ఆఫీస్, ఇంటిలో ఐటీ దాడులు జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ పై జరిగిన ఈ దాడులు పరిశ్రమను కుదుపుకు గురి చేశాయి.
ప్రస్తుతం పరిశ్రమలో హవా మైత్రీ మూవీ మేకర్స్ దే. ఒక్కో చిత్రాన్ని వందల కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్, విజయ్ దేవరకొండ హీరోగా ఖుషి, రామ్ చరణ్-బుచ్చిబాబు, ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ చిత్రాలకు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలుగా ఉన్నారు.
ప్రస్తుతం దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్ తో పుష్ప 2 తెరకెక్కిస్తున్నారు. ఇటీవల కొత్తగా డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి అడుగు పెట్టారు. మైత్రీ మూవీ మేకర్స్ చేస్తున్న, ప్రకటించిన చిత్రాల బడ్జెట్ వెయ్యి కోట్లకు పైమాటే. దీంతో ఐటీ అధికారులు వీరిపై దృష్టి పెట్టారు. పుష్ప 2 దర్శకుడిగా ఉన్న సుకుమార్ మీద కూడా దాడులు జరగడం ఊహించని పరిణామం.
కాగా ఈ ఏడాది మైత్రీ మూవీ మేకర్స్ రెండు భారీ హిట్స్ నమోదు చేశారు. బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన వీరసింహారెడ్డి రూ. 130 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇక చిరంజీవి హీరోగా తెరకెక్కిన వాల్తేరు వీరయ్య రెండు వందల కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ క్రమంలో మైత్రీ మూవీ మేకర్స్ పై ఐటీ సోదాలు జరగడం చర్చకు దారితీసింది.