Governor Vs KCR: దేశంలో రాజ్యాంగ వ్యవస్థ, శాసన వ్యవస్థ రెండు కూడా జోడు గుర్రాలు.. ఇవి సక్రమంగా పనిచేస్తేనే వ్యవస్థలు బాగా పనిచేస్తున్నట్టు లెక్క.. దేశం అభివృద్ధి పథంలో సాగుతున్నట్టు లెక్క.. అయితే వీటికి అపరిమితమైన అధికారాలు ఉండటంవల్ల ఒక్కోసారి ఆహలు దెబ్బతింటాయి.. అవే పలు కీలక పరిణామాలకు నాంది పలుకుతాయి.. ఇక గత కొద్దికాలంగా తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్ మధ్య పొసగడం లేదు. మొదట్లో రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య మంచి సంబంధాలే ఉండేవి.. కానీ పాడి కౌశిక్ ఎమ్మెల్సీ అభ్యర్థి త్వం పై గవర్నర్ ప్రశ్నించడంతో కాక మొదలైంది.. అప్పటినుంచి ఇప్పటిదాకా అది రావణ కాష్టం లాగా మండుతూనే ఉంది.. ఇది ఎప్పటికి చల్లారుతుందో తెలియదు కానీ… ఇప్పటికైతే ఉప్పు నిప్పు లాగానే ఉంది.. అయితే మరి కొద్ది రోజుల్లో రాష్ట్ర బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో మరొకసారి గవర్నర్ విషయం చర్చకు వస్తోంది.

వాస్తవానికి టెక్నికల్ గా ఒక రాష్ట్ర ప్రభుత్వానికి అధిపతి గవర్నరే.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధమ మహిళగా ఆమెకు ప్రత్యేక గుర్తింపు కూడా ఉంటుంది.. ఇలాంటి సందర్భంలో గవర్నర్ ఏం చేయగలదు? ఆమెకు కోపం వస్తే మనకు నష్టం ఏమిటి? ఆమెను అడుగడుగునా అవమానిస్తే మాత్రం ఆమె చేయగలిగేది ఏముంటుంది? ఈ భావనతో కెసిఆర్ ప్రభుత్వం ఒక మహిళ గవర్నర్ తమిళి సైని అన్ని రకాలుగా అవమానించడం కొనసాగుతూనే ఉంది.. మరి ఓ థర్డ్ రేట్ లీడర్ అయితే ఆమెను చిల్లర భాషలో కామెంట్స్ చేశాడు.. అయినా తనపై ఈ సో కాల్డ్ బీఆర్ఎస్ పార్టీ గానీ, ఈ సో కాల్డ్ గుణాత్మక ప్రభుత్వం గానీ సదరు నాయకుడి మీద చర్య తీసుకోలేదు. కనీసం ఖండించలేదు.. అని ఎలా అర్థం చేసుకోవాలి? గవర్నర్ ను తిట్టినా గో హెడ్ అని పరోక్షంగా సమ్మతిని ఇస్తోందా?
టెక్నికల్ గా రాష్ట్ర ప్రభుత్వానికి ఆమె అధిపతి కాబట్టి… ఇప్పుడు ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ కు ఆమోదం తప్పనిసరి కాబట్టి… రాష్ట్ర ప్రభుత్వం బెంబేలెత్తిపోతోంది.. ఏకంగా ఆమె మీద హైకోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉందని మీడియా చెబుతోంది.. ప్రభుత్వం ఆమె ప్రసంగం అక్కర్లేదు అనుకుంది.. గవర్నర్ ప్రసంగం లేకుండానే శాసనసభ సమావేశాలు నిర్వహించింది. ఆమె కూడా గోకడం మొదలుపెడితే… ఇక్కడ జరుగుతున్నది కూడా అదే… బిజెపి హై కమాండ్ కు, హోం మంత్రిత్వ శాఖకు చెప్పకుండా ఆమె చేయదు.. కాకపోతే ఒక షాక్ ఇవ్వడం తప్ప… అల్టిమేట్ గా గవర్నర్ బడ్జెట్ కు ఆమోదం చెప్పొచ్చు. ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గవర్నర్ల పట్ల, గవర్నర్ వ్యవస్థ పట్ల వ్యతిరేకత ప్రభలుతున్న స్థితిలో తెలంగాణలో కూడా కావాలని సంక్షోభాన్ని క్రియేట్ చేయడం కేంద్రానికి ఇష్టం ఉండకపోవచ్చు.

గవర్నర్లు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులుగా ఉండాలి.. రాష్ట్ర ప్రభుత్వాల పాలన మీద నిఘా ఉండాలి.. అవసరమైతే కొరడా తీసుకునే సర్వాధికారాలు కేంద్రానికి ఉండాలి.. లేకపోతే ఈ రాష్ట్రాల ప్రభుత్వాలు ఇష్టారాజ్యం విధానాలతో, పాలనతో దేశాన్ని చిరిగిన విస్తరి చేస్తాయి.. అంతేకాదు దేశ సార్వభౌమాధికారానికి కూడా ఈ ప్రాంతీయ పెత్తందారులు చేటుగా పరిణమించగలరు.. గవర్నర్లను ధిక్కరించడం, ఆ వ్యవస్థ ఉండకూడదని కోరుకోవడం అంటే కేంద్రం పెత్తనం ఉండకూడదని అనుకోవడమే… రాష్ట్రాలు స్వయం ప్రతిపత్తిని కోరుకోవడమే.. మన రాష్ట్రాల పాలన రీతులను గమనిస్తే మాత్రం, అది దేశ సమగ్రతకు నష్టదాయకమే.. కాకపోతే అదంతా వేరే చర్చ…
తెలంగాణ గవర్నర్ విషయానికి వస్తే… తెలంగాణ ప్రభుత్వం ఒకవేళ హైకోర్టు నాశ్రయించి, బడ్జెట్ ను ఆమోదించాలని కోర్టు ద్వారా గవర్నర్ కు చెప్పిస్తారని వార్తల సారాంశం.. అసలు గవర్నర్ల వీధుల్లో హైకోర్టు జోక్యం చేసుకోగలదా? అది తన అధికార పరిధిలోకి వస్తుందా? ఇది కేసీఆర్ ప్రభుత్వ ముఖ్యులకు తెలియదా? ఒకవేళ నిజంగానే హై కోర్టు అలా ఆదేశిస్తే, గవర్నర్ పట్టించుకోకపోతే హై కోర్టు చేయగలిగేది ఏముంది?
ఒకవేళ గవర్నర్ ఆమోదం లేనిదే బడ్జెట్ ను శాసనసభలో ప్రవేశపెట్టి మమ అనిపిస్తే ఆ బడ్జెట్ కు చెల్లుబాటు ఉంటుందా? అదీ ప్రశ్నే? మీరు బడ్జెట్ ను ఆమోదించండని అని హైకోర్టు గవర్నర్ ను ఆదేశిస్తే, ఆమె దాన్ని లైట్ తీసుకుంటే మాత్రం మన రాజ్యాంగ వ్యవస్థల అధికార పరిధిలో మరోసారి చర్చకు వస్తాయి.. ఇవి కొన్నాళ్లపాటు అలా మీడియాలో నానుతూ ఉంటాయి. తర్వాత సంధి కుదురుతుంది.