Elephants Fighting: రెండు ఏనుగులు కొట్లాడుకుంటే ఎలా ఉంటుందో తెలుసా? వీడియో వైరల్

కేరళ రాష్ట్రంలో దట్టమైన అడువులు ఉంటాయి. ఆ అడవులలో ఏనుగులు నివాసం ఉంటాయి. కేరళలో అనాదిగా వస్తున్న సాంప్రదాయం ప్రకారం చాలా వరకు దేవాలయాలకు ఏనుగులు ఉంటాయి.

Written By: Anabothula Bhaskar, Updated On : March 24, 2024 8:43 am

Elephants Fighting

Follow us on

Elephants Fighting: సాధారణంగా ఏనుగులను శాంత జీవులు అంటారు. అవి ఇతర జంతువుల జోలికి వెళ్ళవు. తమ జోలికి ఇతర జంతువులు వస్తే వదిలిపెట్టవు. మామూలుగానే వాటికి తిక్క ఉండదు. తిక్క రేగితే మాత్రం ఎదుటి జంతువుకు నెక్స్ట్ బర్త్ డే ఉండదు. అడవికి రాజు లాంటి సింహం కూడా ఏనుగును చూస్తే తలవంచుకుని వెళ్తుంది. ఏనుగులకు ఆకలైనప్పుడే మాత్రమే తింటాయి. ఏదైనా ఆపద వచ్చినప్పుడే అరుస్తాయి. కానీ అరుదైన సందర్భాల్లోనే కోపంతో శివతాండవం చేస్తాయి. అప్పుడు ఉంటుంది నా సామి రంగా.. దేత్తడి పోచమ్మ గుడే. అలాంటి ఘటనే కేరళ రాష్ట్రంలో జరిగింది.

కేరళ రాష్ట్రంలో దట్టమైన అడువులు ఉంటాయి. ఆ అడవులలో ఏనుగులు నివాసం ఉంటాయి. కేరళలో అనాదిగా వస్తున్న సాంప్రదాయం ప్రకారం చాలా వరకు దేవాలయాలకు ఏనుగులు ఉంటాయి. వాటి మీద దేవుళ్ళ విగ్రహాలను ఏర్పాటు చేసి ఊరేగిస్తారు. అక్కడ అదొక ఆచారం. కొన్ని కొన్ని దేవాలయాల్లో ఏనుగులను ప్రత్యేకంగా అలంకరించి వాటితో వేడుకలు కూడా నిర్వహిస్తారు.. అయితే కొన్ని సందర్భాల్లో ఏనుగులు అతిగా ప్రవర్తిస్తాయి. మావటిలను తొక్కి చంపేస్తాయి. ఇలాంటి ఘటనలు కేరళ రాష్ట్రంలో సర్వసాధారణమే. అయితే కేరళ రాష్ట్రంలో రెండు ఏనుగులు పరస్పరం కొట్లాడుకోవడం ప్రజలు ప్రత్యక్షంగా చూశారు. అరట్టు పూజలో భాగంగా త్రిసూర్ లోని తారాక్కల్ ఆలయంలో వేడుకలు జరిపారు. ఈ వేడుకలకు భారీగా భక్తులు హాజరయ్యారు. స్వామివారికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో లైటింగ్ ఏర్పాటు చేశారు. భజన కళాకారులు వాయిద్యాలతో భక్తి గేయాలు ఆలపిస్తున్నారు. కానీ ఈ లోగా ఒక ఏనుగు గట్టిగా అరిచింది. దానికి మరొక ఏనుగు కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చింది. దీంతో మొదటి ఏనుగుకు ఒళ్ళు మండింది. ఇంకేముంది రెండవ ఏనుగు పై దాడి మొదలుపెట్టింది. ఇక పరస్పరం ఆ రెండు ఏనుగులు తొండాలతో కొట్లాడుకున్నాయి.

రెండు ఏనుగులు కొట్లాడుకుంటున్న దృశ్యాలను కొంతమంది వీడియో తీశారు. ఆ రెండు ఏనుగుల మధ్య గొడవను తగ్గించేందుకు భక్తులు ఎదగా ప్రయత్నించినప్పటికీ అవి శాంతించలేదు. పైగా మనుషులకంటే ఎక్కువ కోపంతో ఒకదానిపై మరొకటి దాడి చేసుకున్నాయి. అవి దాడి చేసుకుంటున్నంతసేపు చుట్టుపక్కల భయానక వాతావరణం నెలకొంది. ప్రజలు అరుపులు చేసుకుంటూ ఇళ్లకు వెళ్లిపోయారు. చివరికి అటవీ శాఖ అధికారులు వచ్చి ఆ రెండు ఏనుగులకు మత్తు ఇంజక్షన్ ఇచ్చారు. ఆ తర్వాత గాని అవి శాంతించలేదు…

ఈ రెండు ఏనుగులు కొట్లాడుకుంటున్న దృశ్యాలను కొందరు వీడియో తీశారు. సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోను చూసిన నెటిజన్లు ” వామ్మో అవి రెండు కొట్టుకుంటుంటే గాడ్జిల్లా సినిమా చూసినట్టు ఉంది. వాటి పక్కన ఉన్న వారి పరిస్థితి ఏమిటో” అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు.