
Janasena And BJP Alliance: రాష్ట్రంలో బిజెపి – జనసేన పొత్తు పెటాకులు కాబోతుందా..? రాష్ట్రంలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఇరు పార్టీల మధ్య చిచ్చురేపాయా..? బిజెపి అగ్ర నాయకత్వం ఏం కోరుకుంటుంది..? రాష్ట్ర నాయకత్వం ఆలోచన ఏముంది..? జనసేన – టీడీపి కోరుకుంటున్నది జరుగుతుందా..? రీడ్ దిస్ స్టోరీ.
ఎంకిపెల్లి సుబ్బి చావుకొచ్చింది అన్నట్టుగా తయారయింది రాష్ట్రంలోని బిజెపి – జనసేన పొత్తు పరిస్థితి. గత మూడేళ్లుగా రాష్ట్రంలో బిజెపి – జనసేన పొత్తుల కొనసాగుతున్నాయి. పేరుకే పొత్తులో ఉన్న ఈ రెండు పార్టీలు ఎప్పుడో పొట్టి ధర్మాన్ని పాటించినట్లు బయటకు కనిపించిన దాఖలాలు లేవు. ఈ రెండు పార్టీలు ఉమ్మడిగా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడిన సందర్భాలు కనిపించవు. కానీ బిజెపి – జనసేన పొత్తులోనే ఉన్నాయన్న వ్యాఖ్యలు ఇరు పార్టీల నుంచి వినిపిస్తుంటాయి. అయితే, ఈ పొత్తుపై తాజాగా బిజెపి నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బిజెపి నుంచి పోటీ చేసి సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయిన పివిఎన్ మాధవ్ జనసేన – బిజెపి పొత్తుపై కాస్త భిన్నమైన కామెంట్ చేశారు.
పేరుకే బిజెపి – జనసేన పొత్తు..
రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి ఘోర పరాభవాన్ని చూడడంతో పార్టీ నేతలు తీవ్ర ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా అమరావతిలోని పార్టీ కార్యాలయంలో పదాధికారుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడిన ఉత్తరాంధ్ర పట్టభద్రుల మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ ఈ రెండు పార్టీల పొత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేనతో తమ పొత్తు పేరుకు మాత్రమే ఉందని, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పొత్తులో భాగంగా తమకు ఓటు వేయమని జనసేన ఎక్కడా చెప్పలేదని మాధవ పేర్కొన్నారు. మొన్నటి ఎన్నికల్లో వైసీపీని ఓడించాలని మాత్రమే చెప్పిన జనసేన, బిజెపికి ఓటు వేయాలని చెప్పకపోవడం గమనార్హమని పేర్కొన్నారు. జనసేన తమకే మద్దతిస్తుందని పిడిఎఫ్ సోషల్ మీడియాలో ప్రచారం చేసిన విషయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లిన స్పందించలేదని ఆయుర్వేదన వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం నిర్వహించిన పెట్టుబడుల సదస్సుకు కేంద్ర మంత్రులు హాజరు కావడం కూడా తమ కొంపముంచిందని ఈ సందర్భంగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బిజెపి వైసిపి కలిసి వెళుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ప్రజలు నమ్మడం వల్లనే తమకు ఓట్లు వేయలేదని, వైసిపి వ్యతిరేక ఓటు అంతా తెలుగుదేశం పార్టీకి పడిందని ఆయన పేర్కొన్నారు. తాజా బిజెపి నాయకుల వ్యాఖ్యలు నేపథ్యంలో రెండు పార్టీల మధ్య పొత్తు మరోసారి చర్చనీయాంశంగా మారింది.
బయటపడిన పొత్తు లోపాలు..
పొత్తు ధర్మానికి సంబంధించి మాజీ ఎమ్మెల్సీ మాధవ్ వ్యాఖ్యల నేపథ్యంలో.. ఒత్తుకు సంబంధించిన లోపాలు బయటపడినట్టు అయింది. మాధవ్ చెప్పినట్లు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపికి జనసేన మద్దతు ఇవ్వకపోవడానికి అనేక అంశాలు కారణాలుగా ఉన్నట్లు విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలో పొత్తులో భాగంగా ముందుకు వెళ్లడానికి అవసరమైన రూట్ మ్యాప్ కావాలని జనసేనాని అడిగినప్పటికీ.. ఇవ్వకపోవడం వల్లే బిజెపికి కాస్త దూరం పాటించినట్లు చెబుతున్నారు. కొద్ది నెలల కిందట పవన్ కళ్యాణ్ అడిగినట్టుగా రూట్ మ్యాప్ ఇచ్చినట్టు ఉంటే ఈ పరిస్థితి రాకపోయి ఉండేదని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఒకపక్క రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వాన్ని జనసేన గద్దె దించే ప్రయత్నం చేస్తుంటే.. బిజెపి కేంద్ర నాయకత్వం రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వానికి అండగా ఉండడాన్ని పవన్ జీర్ణించుకోలేకపోతున్నారు. వైసీపీకి అండగా ఉంటున్న బిజెపితో ముందుకు వెళ్లడం కంటే టిడిపితో కలిసి ఉండడం మంచిదన్న భావనతోనే జనసేనాని ఉన్నారు. అయితే, బిజెపికి దూరంగా ఉన్నప్పటికీ అది ఎక్కడ బయటకు రానీయడం లేదు. 2014 ఎన్నికల మాదిరిగా టిడిపి – బిజెపి – జనసేన కలిసి వెళ్లే ప్రతిపాదనను టిడిపి – జనసేన చేస్తున్నాయి. దీంతో ఈ రెండు పార్టీలు బిజెపిని పూర్తిగా పక్కన పెట్టలేని పరిస్థితి నెలకొంది. అందుకే పొత్తు ఉన్న లేనట్టుగా వ్యవహరిస్తూ జనసేన ముందుకు సాగుతోంది.

ఒంటరిగా వెళ్లేందుకే బిజెపి..
పొత్తులో భాగంగా కలిసి వస్తే జనసేనతో వచ్చే ఎన్నికలకు వెళ్లాలని బిజెపి భావిస్తోంది. ఒకవేళ జనసేన గనుక కలిసి రాకపోతే ఒంటరిగానే సార్వత్రిక ఎన్నికలకు బిజెపి సిద్దపడుతోంది. ఇప్పటికిప్పుడు రాష్ట్రాన్ని అధికారంలో దక్కించుకునే అంత శక్తి, సామర్థ్యాలు గానీ, కనీస స్థాయిలో ఓటు బ్యాంకు ను సంపాదించుకునే పరిస్థితి గానీ బీజేపీకి లేదు. కానీ, ఒంటరిగా వెళ్లడం వలన రానున్న రోజుల్లో బలమైన మూడో ప్రత్యామ్నాయంగా రాష్ట్రంలో ఎదిగేందుకు అవకాశం ఉందని బిజెపి, కేంద్ర రాష్ట్ర నాయకత్వం భావిస్తున్నాయి. పొత్తులు పెట్టుకుంటూ ఇంకా ఎన్నాళ్లు పార్టీని ఎదగనీయకుండా చేస్తామన్న భావన పార్టీ నేతల్లో ఉంది. ఎన్నికల్లో కలిసి వచ్చే పార్టీలతో ముందుకు వెళ్లడం, లేదా ఒంటరిగా పోటీ చేయడం ద్వారా కొంత బలపడేందుకు అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈ వచ్చే సార్వత్రిక ఎన్నికల తర్వాత రాష్ట్రంలోని ఏదో ఒక పార్టీ బలహీన పడుతుందని.. బలహీనపడిన పార్టీ స్థానంలో బిజెపి బలం పుంజుకునేలా ప్రణాళిక రచించాలని బిజెపి అగ్ర నేతలు భావిస్తున్నారు.
పొలిటికల్ లైన్ లోనే తేడా..
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మరోసారి రానీకుండా చూడాలన్నది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యూహం. కానీ, బిజెపి దీనికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. కేంద్ర నాయకత్వం వైసీపీకి అండదండలు అందిస్తుండడంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒకింత అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీంతో అగ్రనాయకత్వానికి తమ భావనలు తెలియజేసే ఉద్దేశంతోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి పోటీలో ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ కావాలనే తన మద్దతును తెలియజేయలేదు. ఇప్పటికైనా బీజేపీ నాయకత్వం ఆలోచన చేస్తుందని ఆయన భావించారు. అయితే, బిజెపి ఆలోచన మరో విధంగా ఉండడంతో 2014 నాటి కూటమి 2024లో సాధ్యపడకపోవచ్చు అన్న ప్రచారం రాష్ట్రంలో జోరుగా సాగుతోంది.