ఎప్పుడూ తెరపై నవ్వులు పండించే ‘అల్లరి నరేశ్’ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ హీరో పేరులోనే ‘అల్లరి’ ఉన్నా కూడా సినిమాల్లో మాత్రం సోలో హిట్ లేక 8 ఏళ్లుగా వెయిట్ చేస్తున్నాడు. హీరో నరేశ్ ఇటీవలే ‘నాంది’ సినిమాతో మనముందుకు వచ్చాడు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో తాజాగా నాంది టీమ్ సక్సెస్ మీట్ నిర్వహించారు.
ఈ సమావేశంలో నరేశ్ చాలా ఎమోషనల్ అయి కన్నీళ్లు పెట్టుకున్నాడు. దర్శకుడు, నటుడు దేవిప్రసాద్ని హత్తుకుని ఏడ్చేశాడు. 2012 లో సుడిగాడు విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఎనిమిదేళ్ల తర్వాత అలాంటి విజయం దక్కిందని నరేశ్ సంతోష పడుతున్నాడు. చాలా ఎగ్జయిటింగ్గా ఉందన్నారు. కామెడీ సినిమాలు చేస్తూ.. ఫ్లాపుల్లో ఉన్న నన్ను నిర్మాత సతీష్ వేగేశ్న నమ్మి ప్రోత్సహించారని అన్నారు..
‘విజయం సాధిస్తుందో లేదో అనే భయం ఉండేది. నా కామెడీ ఇమేజ్ సినిమాకు ఎక్కడ ప్రాబ్లమ్ అవుతుందో అనే టెన్షన్ ఉండేది. కానీ ప్రేక్షకులు వాటిని పట్టించుకోలేదు. సినిమా బాగుందని చాలా మంది ఫోన్ల్ చేసి మెచ్చుకుంటున్నారు’ అని హీరో నరేశ్ భావోద్వేగానికి గురయ్యాడు. డైరెక్టర్ విజయ్ తనకు సెకండ్ బ్రేక్ ఇచ్చారంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. చాలా రోజుల తర్వాత విజయం దక్కడంతో నరేశ్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది.
2012లో వచ్చిన సుడిగాడు చిత్రం తర్వాత నరేష్కు మంచి హిట్ దక్కలేదు. దీంతో ఈ సారి నాంది అనే థ్రిల్లర్ కథను ఎంచుకున్నాడు.వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న అల్లరి నరేశ్ కు శుక్రవారం రిలీజైన నాంది సినిమా కొంత ఊరటనిచ్చింది. ప్రయోగంగా చేసిన ఈ చిత్రం విడుదలైన అన్ని చోట్ల మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. నరేశ్ నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.