Telugu States Sudden Rains: నిన్నటిదాకా 45 డిగ్రీలకు మించిన ఉష్ణోగ్రతలు.. వడగాలులు.. బయటికి వెళ్లడం కాదు.. ఇంట్లో కూడా ఉండలేని పరిస్థితి.. ఇక వడదెబ్బ మృతులకు అయితే లెక్కేలేదు. దీంతో ఇంకా ఎన్నిరోజులు రా బాబు ఈ ఎండలు.. అని ప్రజలు ఇబ్బంది పడడం.. కరెంటు పోతే ప్రభుత్వాలను తిట్టుకోవడం.. ఏసీలు సరిగా పనిచేయకపోతే.. ఫ్యాన్లు సరిగా తిరగకపోతే.. కూలర్లు చల్లగాలిని అందించలేక పోతే తిట్టుకోవడం వంటివి చేశారు.
ఇటువంటి పరిస్థితుల్లో ఒక్కరోజు వ్యవధిలోని అంతా మారిపోయింది. వాతావరణం లో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. ఫలితంగా ముగ్గురు మృతి చెందారు. ఏపీ రాష్ట్రంలోని ఉమ్మడి విశాఖపట్నం జిల్లా అనకాపల్లి, నక్కపల్లి, పాయకరావుపేట మండలంలో విపరీతంగా వర్షం కురిసింది. గాలివాన ప్రజలకు భయభ్రాంతులకు గురిచేసింది. విపరీతమైన గాలుల వల్ల చెట్లు విరిగిపడిపోయాయి. రోడ్లమీద వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.. రమణయ్యపేట, ముకుంద రాజుపేట, దోసలపాడు, చీడిక, దొండాడ, దొడ్డిగళ్ళు వంటి ప్రాంతాలలో చెట్లు విరిగిపడిపోయాయి. విద్యుత్ స్తంభాలు నేలకు ఒరిగాయి. కొన్ని ప్రాంతాలలో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. సత్యవరం ప్రాంతంలో తమలపాకు కూలీలు చనిపోయారు. ముకుందరాజుపేటలో ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. మామిడికాయలు పూర్తిగా నేల రాలిపోయాయి. అరటి తోటలు కుప్పకూలిపోయాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడిపోయాయి. దీంతో కరెంటు సరఫరా పూర్తిగా నిలిచిపోయింది.
ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూలు జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది. ఈ జిల్లాలోని తాడూరు మండలం గోవిందా పల్లి లో పిడుగుపాటు పడింది. ఒక గొర్రెల కాపరి అక్కడికక్కడే చనిపోయాడు. అచ్చంపేట ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి ధాన్యం మొత్తం తడిచిపోయింది. బిజినేపల్లి.. తెలకపల్లి.. తాడూరు గ్రామాలలో ఈదురుగాలులు వీచాయి. వర్షం కూడా భారీగా కురిసింది. దీంతో కేంద్రాలలో ఆరబోసిన ధాన్యం తడిచింది. రైతులు ధాన్యాన్ని కాపాడుకోలేక తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు.
అందువల్లే వర్షాలు
విపరీతమైన ఎండల వల్ల నీటి ఆవిరి అధికంగా జరుగుతోంది. దీనివల్ల అకస్మాత్తుగా మేఘాలు ఏర్పడుతున్నాయి. చల్లని గాలులు వేయగానే అవి వెంటనే కరిగిపోతున్నాయి. మేఘాల మధ్య ఒత్తిడి వల్ల పిడుగుపాటు చోటుచేసుకుంటున్నది. అధిక ఉష్ణోగ్రతల వల్లే ఇటువంటి అకస్మాత్తు వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఎండాకాలం ముగిసే వరకు అప్రమత్తంగా ఉండడమే మంచిదని వారు సూచిస్తున్నారు.
