Kaleshwaram Project: కాళేశ్వరం ఎత్తిపోతల పథకం మీద భారత రాష్ట్ర సమితి కొద్దిరోజులుగా విపరీతంగా ప్రచారం చేసుకుంటున్నది. మేడిగడ్డ పిల్లర్లు కృంగిపోయినప్పుడు ఆ కుట్ర మొత్తం కాంగ్రెస్ వాళ్ళే చేశారని అప్పట్లో గులాబీ పార్టీ నాయకులు ఆరోపించారు. ఆ తర్వాత ఆ ఆరోపణల మీద గులాబీ పార్టీ నేతలు నిలబడలేదు. పైగా మేడిగడ్డ ఎందుకు కుంగిపోయిందో.. ఇప్పటికీ చెప్పలేకపోతున్నారు. చివరికి ఆ ఎత్తిపోతల పథకం ద్వారా ఎత్తిపోస్తున్న నీళ్లను గతంలోనే సముద్రంలోకి వదిలారు గులాబీ పార్టీ నేతలు.
తెలంగాణ ఖజానాకు తెల్ల ఏనుగు లాగా మారిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం మీద.. గులాబీ పార్టీ మళ్లీ చర్చ మొదలుపెట్టింది. ఇటీవల మహారాష్ట్ర ఎగువ ప్రాంతాలలో కురిసిన వర్షాల వల్ల ప్రాణహిత నదిలో ప్రవాహం పెరిగింది. ఆ ప్రవాహం వల్ల మేడిగడ్డ ప్రాంతంలో గోదావరి నీరు ప్రవహించింది.. మేడిగడ్డ పిల్లర్లు సక్రమంగా ఉండి ఉంటే ఆ నీటిని నిల్వ చేసి ఉండేవారు. పంపింగ్ చేసి.. ప్రాజెక్టులను నింపేవారు. కానీ ఆ పరిస్థితి లేదు. కేవలం మేడిగడ్డ మాత్రమే కాదు.. ఇతర పంప్ హౌస్ లు కూడా సక్రమంగా లేవు. వాటి నిర్మాణ సమయంలో సరైన నిబంధనలు పాటించకపోవడం వల్ల ఈ సమస్య వచ్చింది.
క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇలా ఉన్నప్పటికీ గులాబీ పార్టీ నేతలు తాము అధికారులు ఉన్నప్పుడు నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం గొప్పదని ప్రచారం మొదలు పెడుతున్నారు. పైగా మోటార్లు ఆన్ చేసి నీటిని ఎత్తిపోయాలని డిమాండ్ చేస్తున్నారు. వాస్తవానికి అప్పట్లో గోదావరి కి వచ్చిన వరదల వల్ల చాలా వరకు మోటర్లు నీటిలో మునిగిపోయాయి. ఇప్పటికి రిపేర్లు చేసిన దిక్కులేదు. రిపేరు చేసినప్పటికీ అవి ఉపయోగంలోకి వస్తాయో లేదో తెలియదు. అలాంటప్పుడు గులాబీ పార్టీ నేతలు చేస్తున్న ప్రచారం మాత్రం చాలా వితండవాదం లాగా ఉంది. పైగా గులాబీ పార్టీ నేతలకు రిటైర్డ్ ఇంజనీర్ల ముసుగులో గులాబీ కార్యకర్తలు వత్తాసు పలుకుతున్నారు. నాడు కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోయినప్పుడు ఈ ఇంజనీర్లు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అలాంటప్పుడు ఇప్పుడు తమకు సూచనలు ఎలా చేస్తారంటూ కాంగ్రెస్ నేతలు అంటున్నారు.
ఇటీవల ఓ ప్రైవేట్ న్యూస్ ఛానల్ లో డిబేట్ కార్యక్రమం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నుంచి సామ రామ్మోహన్ రెడ్డి.. గులాబీ పార్టీ నుంచి వి ప్రకాష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో సామ రామ్మోహన్ రెడ్డి గణాంకాలతో సహా కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి సంబంధించి అన్ని విషయాలను చెప్పారు.. ఆయన చెప్పిన మాటలకు సరైన సమాధానం చెప్పలేక వీ ప్రకాష్ చర్చ నుంచి అర్ధంతరంగా వెళ్లిపోయారు. రామ్మోహన్ రెడ్డికి తాను సరిపోనంటూ అసలు విషయం ఒప్పుకున్నారు దీంతో ఈ వీడియోను కాంగ్రెస్ నేతలు విపరీతంగా సర్కులేట్ చేస్తున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా ఉపయోగం లేదని చివరికి గులాబీ పార్టీ నేతలకు కూడా తెలిసిందని.. అందువల్ల ఇలా చేతులెత్తేసారని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.
