HomeతెలంగాణNalgonda : రెండు కుటుంబాల మధ్య పిల్లి పెట్టిన పంచాయితీ.. పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది

Nalgonda : రెండు కుటుంబాల మధ్య పిల్లి పెట్టిన పంచాయితీ.. పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది

Nalgonda : ప్రతి ఇంటికి ఇరుగుపొరుగు వారంటారు. వారితో చిన్న చిన్న పంచాయితీలు సర్వసాధారణం. పోయే దారి విషయంలోనో, లేదా వాకిళ్ల విషయంలోనో, లేక చెత్త విషయంలోనో ఏదో ఒక సందర్భంలో గొడవలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఇటీవల కొన్ని తగాదాలు పెంపుడు జంతువులతో కూడా మొదలయ్యాయి. ఇటువంటి చిల్లర పంచాయితీలు చినికి చినికి గాలివానగా మారి పోలీస్ స్టేషన్లకు కూడా చేరుతున్న ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఓ ఇంటి పంచాయితీ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. ఆ పంచాయితీ ఎలా తీర్చాలో అర్థం కాక పోలీసులు కూడా తలలు పట్టుకుంటున్నారు. అయితే ఈ పంచాయితీ మామూలు పంచాయితీల లాంటిది కాదు.. కాబట్టే పోలీసులకు ఏం చేయాలో అర్థం కావడం లేదు.

మామూలుగా ఒక బిడ్డ ఇద్దరు తల్లుల కథలు వాస్తవ ఘటనలు చూసే ఉంటాం… ఆ బిడ్డ నా కొడుకని ఒకరు.. లేదు నా కొడుకని మరొకరు వాదులాడుకోవడం మనం వినే ఉంటాం. తాజాగా ఇద్దరు మహిళలు కూడ ఇదే రీతిలో గొడవకు దిగారు. చివరికి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కి న్యాయం చేయాలని కోరారు. ఇంతకు వీరి గొడవకు గల కారణం ఓ పిల్లి. ఆ పిల్లి నాదంటే నాదంటూ వారిద్దరూ గొడవ పడ్డారు. ఇప్పుడు పోలీసుల వద్దకు పిల్లి పంచాయితీ చేరింది. ఈ ఘటన నల్గొండ జిల్లాలో జరిగింది.

నల్గొండ పట్టణంలో పుష్పలత అనే మహిళ గత మూడు సంవత్సరాలుగా పిల్లిని పెంచుకుంటుంది. ఎంతో ప్రేమగా ఆమె పిల్లిని పెంచుకుంటుంది. అయితే ఏడాది క్రితం పిల్లి తప్పి పోయింది. ప్రేమగా పెంచుకుంటున్న పిల్లి కనిపించకపోయే సరికి పుష్పలత పిల్లి కోసం బాగా వెతికింది. ఎంత వెతికినా కనిపించక పోవడంతో ఆమె సైలెంట్ అయిపోయింది. తాజాగా తాను పెంచుకుంటున్న పిల్లి పోలికలతో ఉన్న పిల్లిని పక్కింట్లో చూసింది. దీంతో ఆ పిల్లి నాదే అంటూ పుష్పలత వారితో గొడవకు దిగింది.

తన పిల్లి తనకు ఇవ్వాల్సిందేనంటూ పట్టుబట్టింది. అయితే పక్కింటి వారు పిల్లిని ఇచ్చేదే లేదనడంతో పుష్పలత ఏకంగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎలాగైనా తన పిల్లి తనకు ఇప్పించాలని పోలీసులను వేడుకుంది. పోలీసులు కూడా ఇంతకు పిల్లి ఎవరిదనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కొందరు డీఎన్ఏ టెస్ట్ చేయాలని కూడా సూచిస్తున్నారు. మరి పిల్లి పంచాయితీకి పోలీసులు ఎలాంటి తీర్పు చెబుతారో చూడాలి.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version