HomeతెలంగాణTelangana CM  CPRO : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిపిఆర్ఓ ఎవరు? అయోధ్య రెడ్డిని...

Telangana CM  CPRO : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిపిఆర్ఓ ఎవరు? అయోధ్య రెడ్డిని మార్చేశారా?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సిపిఆర్ఓగా అయోధ్య రెడ్డి కొనసాగుతున్నారు. అయోధ్య రెడ్డి గతంలో పలు పత్రికలలో పనిచేశారు. సీనియర్ జర్నలిస్టుగా ఉన్నారు. కొంతకాలం నుంచే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ తరఫున వివిధ టీవీ చానల్స్ డిబేట్లలో ఆయన పాల్గొనేవారు.

Telangana CM  CPRO :  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత తన ముఖ్య ప్రజా సంబంధాల అధికారిగా అయోధ్య రెడ్డిని రేవంత్ రెడ్డి నియమించుకున్నారు. అయితే అయోధ్య రెడ్డికి స్థాన చలనం జరిగిందా? ఆయన స్థానంలో ఉదయ సింహకు అవకాశం కల్పించారా? అనే ప్రచారం జరుగుతోంది. భారత రాష్ట్ర సమితి నాయకుడు కొణతం దిలీప్ తన అధికారిక ట్విట్టర్ ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు.

ఇటీవల దావోస్ పెట్టుబడుల సదస్సుకు వెళ్ళినప్పుడు.. తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి తరఫున వెళ్లిన అధికారుల జాబితాను ప్రభుత్వం గోప్యంగా ఉంచిందని దిలీప్ ఆరోపించారు.. ఎటువంటి హోదా లేకపోయినప్పటికీ గత ఏడాది కర్రీ శ్రీరామ్ రేవంత్ రెడ్డి బృందంలో దావోస్ వెళ్లిపోయారు. అది ఒకసారి ఆ వివాదాస్పదం కావడంతో.. ఈసారి అయోధ్య రెడ్డిని కాదని, ఉదయసింహను రేవంత్ రెడ్డి తీసుకుపోయారని దిలీప్ ఆరోపించారు.. మహారాష్ట్ర చెందిన ఓ వ్యక్తి ఆర్టిఐ పిటిషన్ ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చిందని దిలీప్ ప్రస్తావించారు.. అయితే ఉదయ సింహ ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్నారు. ఆయనను ముఖ్యమంత్రి చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ అని తెలంగాణ ప్రభుత్వం సంబోధించిందని.. దిలీప్ పేర్కొన్నారు..

ఎలా చూపిస్తారు

ముఖ్యమంత్రి సిపిఆర్ఓ గా వ్యవహరించే వ్యక్తికి జర్నలిజం, పబ్లిక్ రిలేషన్ లో అర్హతలు ఉండాలని.. ఎటువంటి అర్హత లేని ఉదయ సింహను సిపిఆర్ఓ అని చెప్పడం ఏంటని, తనతోపాటు నేరంలో పాల్గొని జైలు పాలైనందుకే ఉదయ సింహకు ఈ నజరానా రేవంత్ రెడ్డి ఇచ్చారని దిలీప్ ఆరోపించారు.. ” సొంత కొడుకును చంపి.. యావజ్జీవ కారాగార శిక్ష పడి.. జైల్లో రేవంత్ రెడ్డి సహాగా ఖైదీగా ఉండి.. తనకు సఫర్లు చేసి, ఇప్పుడు రేవంత్ రెడ్డి క్షమాభిక్షపెట్టిన తరినాగయ్యకు కూడా సీఎం కార్యాలయంలో ఉద్యోగం ఇస్తారా” అని కొణతం దిలీప్ ఆరోపించారు. ” ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉండగా పబ్లిక్ రిలేషన్స్ లో 40 సంవత్సరాలు అనుభవం ఉన్న వనం జ్వాల నరసింహరావు సిపిఆర్ఓగా ఉండేవారు. నేడు సంచులు మోసిన వాడు సిపిఆర్ఓ అని అంతర్జాతీయ వేదికల మీద చూపెడుతున్నారు. ఎవని పాలయ్యిందిరో తెలంగాణ” అంటూ దిలీప్ ట్వీట్ చేశారు.

అయితే దీనిపై ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎటువంటి రిప్లై రాలేదు.. ఇటీవల కాలంలో భారత రాష్ట్ర సమితి సోషల్ మీడియా కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తోంది. వేలాది ఎకౌంట్ల ద్వారా ఎదురుదాడికి దిగుతోంది.. చివరికి కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ ఎక్స్ లో పెట్టిన పోల్ ను హైజాక్ చేసింది. “ఫామ్ హౌస్ పాలన మాత్రమే బాగుంది” అనే ఆప్షన్ కు వేలాది ఓట్లు పడేలా చేసింది. చివరికి కాంగ్రెస్ పార్టీని డిఫెన్స్ లో పడేసింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీయడంతో.. కాంగ్రెస్ పార్టీ ఒకసారిగా అలర్ట్ అయిపోయింది. రోజుల వ్యవధిలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎల్పీ భేటీ నిర్వహించారు. అంతేకాదు పార్టీలైన్ దాటితే తీవ్రస్థాయిలో చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం బలోపేతం అయినట్టు కనిపించడం లేదు. చివరికి నేతలు కూడా సీక్రెట్ గా ఉంచాల్సిన వ్యవహారాలను బహిర్గతం చేయడం కాంగ్రెస్ పార్టీ బేలతనానికి నిదర్శనంగా కనిపిస్తోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper