Free Electricity: ఉచిత విద్యుత్ పథకంలో అర్హులు ఎవరు? మార్గదర్శకాలు ఇవీ

హైదరాబాద్‌ వంటి నగరాల్లో అద్దె చెల్లించి నివసించే వారు, ప్రనస్తుతం ఉంటున్న మీటరు నంబర్‌తో, రేషనకార్డు, ఆధార్‌ కార్డు జతచేయాల్సి ఉంటుంది. ఏ ప్రాంతంలో కూడా ఇక దరఖాస్తు చేసి ఉండకూడదు.

Written By: Raj Shekar, Updated On : February 9, 2024 6:11 pm

Free Electricity

Follow us on

Free Electricity: అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో పేద, మధ్య తరగతి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ అందించేందుకు కసరత్తు చేస్తోంది. ఈనెలలోనే పథకం అమలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తర్వాత ఉచిత విద్యుత్‌ హామీ అమలు చేస్తారని తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. అయితే ఇందులో ఉచిత విద్యుత్‌ పొందేందుకు కొన్ని షరతులు పెట్టింది. తెల్ల రేషన్‌కార్డును తప్పనిసరి చేసింది. ప్రతినెలా 200 యూనిట్లకన్నా తక్కువ విద్యుత్‌ వాడే వారికి ఈ ప్రయోజనం లభిస్తుంది. ఒకటికంటే ఎక్కువ మీటర్లు ఉన్నవారికి ఇది వర్తించదు. అద్దె ఇళ్లలో ఉంటున్నవారు కూడా ఉచిత విద్యుత్‌ పథకానికి అర్హులే.

నగర వాసులకు..
హైదరాబాద్‌ వంటి నగరాల్లో అద్దె చెల్లించి నివసించే వారు, ప్రనస్తుతం ఉంటున్న మీటరు నంబర్‌తో, రేషనకార్డు, ఆధార్‌ కార్డు జతచేయాల్సి ఉంటుంది. ఏ ప్రాంతంలో కూడా ఇక దరఖాస్తు చేసి ఉండకూడదు. సొంత గ్రామంలో ఇల్లు ఉండి హైదరాబాద్‌లో అద్దెకు ఉంటున్నవారు ఏదో ఒక్కచోట మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. రెండుచోట్ల లబ్ధి పొందడం కుదరదు.
ఒక రేషన్‌ కార్డు.. ఒక మీటర్‌.. ఒక కుటుంబం..
ఒక్క రేషన్‌ కార్డుతో ఒక్క కుటుంబానికి మాత్రమే లబ్ధి చేకూరుతుంది. రేషన్‌ కార్డులో పేరు ఉండి. పెళ్లి తర్వాత వేరుపడిన వారికి గృహజ్యోతి వర్తించదు. తెల్ల రేషన్‌కార్డు ఉన్నవారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ఒక రేషన్‌ కార్డు, ఒక మీటర్, ఒక కుటుంబం మాత్రమే అనుసంధానం చేస్తారు.

లబ్ధిదారుల గుర్తింపు ఇలా..
మీటర్‌ రీడింగ్‌ తీసే సిబ్బందితోనే లబ్ధిదారులను గుర్తిస్తారు. ఇప్పటికే ఈ ప్రక్రియ చాలాచోట్ల ప్రారంభమైంది. మీటర్‌ రీడర్‌కు రేషన్‌ కార్డు, ఆధార్‌ కార్డు, మొబైల్‌ నంబర్‌ లింక్‌ చేసి రీడింగ్‌ తీస్తారు. ఎవరైతే 200 లోపు యూనిట్ల విద్యుత్‌ వాడుతున్నారో వారికి జీరో బిల్లు తీసి ఇస్తారు. ఇప్పటికే లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో మార్చి నుంచి గృహజ్యోతి పథకం అమలులోకి వచ్చే అవకాశం ఉంది. ఇది అమలులోకి వస్తే పేద, మధ్యతరగతి ప్రజలకు ఎంతో ఊరట లభిస్తుంది.