HomeతెలంగాణCM Revanth Reddy: రేవంత్‌గారు.. ప్రకటించినవెన్ని? నింపివెన్ని..? ఉద్యోగ ఖాళీల వెనుక మతలబేంటి?

CM Revanth Reddy: రేవంత్‌గారు.. ప్రకటించినవెన్ని? నింపివెన్ని..? ఉద్యోగ ఖాళీల వెనుక మతలబేంటి?

గురుకుల ఉపాధ్యాయ ఖాళీల భర్తీలో ప్రభుత్వం అవరోహణ విధానం అనుసరించాల్సి ఉంది. కానీ, కాంగ్రెస్‌ దానిని పట్టించుకోలేదు. ముందుగా పీజీటీ ఫలితాలు ప్రకటించింది. తర్వాత విమర్శలు రావడంతో డిగ్రీ, జూనియర్‌ లెక్చరర్‌ ఫలితాలు ప్రకటించింది.

CM Revanth Reddy: ‘తెలంగాణలో మూడు నెలల్లో 30 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం అన్న మాట నిలబెట్టుకుంటాం. కొత్తగా గ్రూప్‌–1 నోటిఫికేషన్‌ ఇచ్చాం. 11,062 పోస్టులతో మెగా డీఎస్సీ ఇచ్చాం.’ ఇదీ ఎల్బీ స్టేడియంలో ఇటీవల గురుకుల ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు నియామక పత్రాలు అందించే సభలో సీఎం రేవంత్‌రెడ్డి చెప్పిన మాటలివీ. అయితే సీఎం స్థాయిలో ఉండి 30 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం అనడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఎందుకంటే భర్తీ చేసిన 30 వేల పోస్టుల్లో ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్‌ కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చింది కాదు. పోలీస్, నర్సులు, గురుకుల ఉపాధ్యాయులు, టీఎస్‌పీఎస్సీ ద్వారా వివిధ కేటరిటీ పోస్టులు ఇవన్నీ గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రకటించినవే. పరీక్షలు నిర్వహించి ఫలితాలు ప్రకటించినవి కొన్ని.. ఫలితాలు ప్రకటించనివి కొన్ని. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ఫలితాలు ప్రకటించేసి నియామక పత్రాల కోసం హంగామా చేసింది. ఇది ఎవరూ కాదనలేని వాస్తవం.

ప్రకటించినవి ఎన్ని..
ఇక గురుకుల ఉపాధ్యాయ ఖాళీల భర్తీలో ప్రభుత్వం అవరోహణ విధానం అనుసరించాల్సి ఉంది. కానీ, కాంగ్రెస్‌ దానిని పట్టించుకోలేదు. ముందుగా పీజీటీ ఫలితాలు ప్రకటించింది. తర్వాత విమర్శలు రావడంతో డిగ్రీ, జూనియర్‌ లెక్చరర్‌ ఫలితాలు ప్రకటించింది. చివరకు టీజీటీ రిజల్ట్‌ ఇచ్చింది. అయితే చివరగా ప్రకటించిన టీజీటీలోని సబ్జెక్టుల వారీగా అన్ని పోస్టులు భర్తీ చేయలేదు. 517 పోస్టులు భర్తీ చేయకుండానే మిగిలిపోయాయి.

పోస్టులు, భర్తీ వివరాలు..
టీజీటీలో కేటగిరీల వారీగా ప్రకటించిన పోస్టులు, భర్తీ చేసిన పోస్టుల వివరాలు పరిశీలిద్దాం.

– తెలుగు సబ్జెక్టులో 488 పోస్టులకు నోటిఫికేషన్‌ ఇచ్చారు. కానీ ప్రస్తుతం 426 మాత్రమే భర్తీ చేశారు. 62 పోస్టులు భర్తీ చేయలేదు.

– హిందీ సబ్జెక్టులో 516 పోస్టుల భర్తీకి నోటిషికేషన్‌ ఇవ్వగా 422 మాత్రమే భర్తీ చేశారు. 94 పోస్టులు పెండింగ్‌లో పెట్టారు.

– సంస్కృతం సబ్జెక్టులో 25 పోస్టులకు నోటిఫికేషన్‌ ఇవ్వగా కేవలం 14 మాత్రమే భర్తీ చేసి 11 ఖాళీలు పెండింగ్‌లో పెట్టారు.

– ఇంగ్లిష్‌ సబ్జెకుట్లో 681 పోస్టులకు నోటిఫికేషన్‌ ఇచ్చారు. ఇందులో 618 మాత్రమే భర్తీ చేశారు. మిగతా 63 ఖాళీగా ఉన్నాయి.

– ఉర్దూ సబ్జెక్టులో 120 ఖాళీలు ఉన్నట్లు ప్రకటించారు. కానీ కేవలం 49 మాత్రమే భర్తీ చేశారు. 71 ఖాళీలు పెండింగ్‌లో ఉన్నాయి.

– మ్యాథ్స్‌లో 741 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇవ్వగా అందులో 675 మాత్రమే భర్తీ చేశారు. మరో 66 ఖాళీలు భర్తీ చేయాల్సి ఉంది.

– సైన్స్‌ సబ్జెక్టులో 98 పోస్టుల భర్తీకి ప్రకటన ఇవ్వగా అందులో 85 భర్తీ చేశారు. 13 పోస్టులు ఖాళీగా ఉంచారు.

– ఫిజికల్‌ సైన్స్‌.. ఇందులో 431 పోస్టులు ఖాళీగా ఉండగా, 374 మాత్రమే భర్తీ చేశారు. మరో 57 ఖాళీగా ఉంచారు.

– బయో సైన్స్‌.. ఈ సబ్జెక్టులో 327 ఖాళీలు ప్రకటించగా ప్రస్తుతం 301 పోస్టులు భర్తీ చేశారు. 26 పోస్టులు పెండింగ్‌లో ఉంచారు.

– చివరగా సోషల్‌ సబ్జెక్టులో 579 పోస్టులు ఉన్నట్లు ప్రకటన ఇచ్చారు. కానీ, ఇందులో 525 మాత్రమే భర్తీ చేశారు. మరో 54 ఖాళీగా ఉన్నాయి.

– మొత్తంగా 4006 పోస్టులు భర్తీ చేయాల్సి ఉండగా 3,489 పోస్టులు భర్తీ చేశారు. 517 పోస్టులు పెండింగ్‌లో పెట్టారు.

పెండింగ్‌ వెనుక మతలబు ఏంటి?
పారదర్శకంగా, ఎలాంటి అవకతవకలు లేకుండా ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పదే పదే ప్రకటిస్తున్నారు. కానీ గురుకుల ఉద్యోగాల్లో టీజీటీ కేటరిగీలో 517 పోస్టులు పెండింగ్‌లో పెట్టడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇవి ఎందుకు పెండింగ్‌లో ఉంచారో అటు ప్రభుత్వం, ఇటు గురుకుల సొసైటీ ప్రకటించడం లేదు. రికార్డు స్థాయిలో ఏడాదిలో 9 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని మాత్రం చంకలు గుద్దుకుంటున్నారు. మిగతా పోస్టులు అమ్ముకుంటున్నారేమో అని అభ్యర్థులు అనుమానిస్తున్నారు.

జాయినింగ్‌ సమస్య..
ఇక భర్తీ ప్రక్రియలో ఆవరోహణ క్రమం పాటించకపోవడంతో మరో 10 శాతం ఉద్యోగాలు మిగిలిపోయే అవకాశం ఉంది. ఒక్కో అభ్యర్థి రెండు నుంచి నాలుగు పోస్టులు సాధించారు. వీరు ఒక్కపోస్టులో మాత్రమే జాయిన్‌ అవుతారు. దీంతో మిగతా మూడు పోస్టులు మిగిలిపోతాయి. వాటిని పెండింగ్‌లో పెట్టడం వలన 1:2లో ఉన్న అభ్యర్థులు నష్టపోతున్నారు. మరోవైపు ఖాళీల కారణంగా విద్యార్థులూ నష్టపోయే అవకాశం ఉంది. ఇప్పటికైనా పూర్తి పోస్టుల భర్తీపై ప్రభుత్వం దృష్టిపెట్టాలని అభ్యర్థులు కోరుతున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper