Medaram Jatara Effect: జాతర ముగిసింగి.. చెత్త మిగిలింది..!

మేడారం జాతరలో ప్లాస్టిక్‌ రహితంగా నిర్వహిస్తామని అధికారులు ప్రకటించారు. వ్యాపారులు ప్లాస్టిక్‌లో విక్రాయాలు చేయొద్దని అవగాహన కల్పించామని చెప్పారు.

Written By: Raj Shekar, Updated On : March 2, 2024 1:01 pm
Follow us on

Medaram Jatara Effect: తెలంగాణ కుంభమేళా.. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర ముగిసింది. ఫిబ్రవరి 21 నుంచి 24వ తేదీ వరకు జాతర కొనసాగింది. సుమారు 1.5 కోట్ల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారు. తిరుగువారం పూజ కూడా పూర్తి కావడంతో జాతర ముగిసినట్లు కోయ పూజారులు ప్రకటించారు. అయితే.. జాతర పరిసరాలన్నీ చెత్త చెదారంతో, భక్తులు వదిలేసిన వ్యర్థాలతో కంపు కొడుతున్నాయి. మేడారంం, కన్నెపల్లి, రెడ్డిగూడెం, చిలకలగుట్ట, కొంగల మడుగు, ఊరట్టం, నార్లాపూర్, స్తూపం, జంపన్నవాగు పరిసరాలు, బస్తాండ్‌ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వ్యర్థాలు పేరుకుపోయాయి.

పేరుకే ప్లాస్టిక్‌ రహితం..
ఈసారి మేడారం జాతరలో ప్లాస్టిక్‌ రహితంగా నిర్వహిస్తామని అధికారులు ప్రకటించారు. వ్యాపారులు ప్లాస్టిక్‌లో విక్రాయాలు చేయొద్దని అవగాహన కల్పించామని చెప్పారు. ఇక భక్తులు కూడా ప్లాస్టిక్‌ తేవొద్దని సూచించారు. కానీ జాతర ముగిసిన తర్వాత చూస్తే అంతటా ప్లాస్టిక్‌ బాటిళ్లు, పాలిథిన్‌ కవర్లు, మద్యం సీసాలు, కోళ్లు, మేకలు, ఇతర జంతువుల వ్యర్థాలే దర్శనమిస్తున్నాయి. ఈ వ్యర్థాలు దుర్వాసన వెదజల్లుతున్నాయి.

బురదతో మరింద దుర్గంధం..
ఇక చాలా చోట్ల చేతిపంపులు, నల్లాల వద్ద కూడా వృథా నీరు పేరుకుపోయింది. వాటిలో వ్యర్థాలు వేయడంతో అవి కుళ్లిపనోయి మరింత దుర్గంధం వెదజల్లుతున్నాయి. భక్తుల గుడారాల వద్ద, వర్కర్ల క్యాంపుల వద్ద కూడా వ్యర్థాలు అక్కడే వదిలేశారు. వీటిని తొలగించడంలో నిర్వాహకులు నిర్లక్ష్యం చేస్తున్నారు.

4 వేల మంది శానిటేషన్‌ సిబ్బంది..
జాతర సమయంలో వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించేందుకు ప్రభుత్వం 4 వేల మంది శానిటేషన్‌ సిబ్బందిని నియమించింది. అయినా నిర్వహణ సరిగా లేదు. ఇప్పుడు పంచాయతీ అధికారులు చేతులెత్తేశారు. సరైన ప్రణాళిక లేకపోవడంతో జాతర ముగిసి పది రోజులు దాటినా ఇంకా గుట్టలుగా వ్యర్థాలు కనిపిస్తున్నాయి. దుర్గంధం వెదజల్లుతున్నాయి. అధికారులు త్వరగా మేడారం పరిసరాలను క్లీన్‌ చేయించాలని గ్రామాల ప్రజలు, భక్తులు కోరుతున్నారు. లేదంటే అంటు వ్యాధులు ప్రబలుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.