Farmer Love Is Infinite: పనులు ఎవరైనా చేస్తారు. కానీ వినూత్న పద్ధతుల్లో చేసే వారు కొందరుంటారు. వారే అందరిని మంత్రముగ్గుల్ని చేస్తారు. తమకొచ్చే ఆలోచనలకు కార్యరూపం ఇస్తారు. ఫలితంగా ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకుంటారు. కన్నవారిపై ఎంతమందికి ప్రేమ ఉంటుంది. చాలా మంది తల్లిదండ్రులకు కనీసం తిండి కూడా పెట్టనివారు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. తమ జన్మకు కారకులైన వారిని అపురూపంగా చూసుకునే వారు అరుదు. ఇక్కడో రైతు తన తల్లిదండ్రులపై ఉన్న ప్రేమను వినూత్నంగా వ్యక్తం చేశాడు. అందరి మన్ననలు అందుకుంటున్నాడు.
నిజామాబాద్ కు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న చింతలూరు గ్రామంలో చిన్నికృష్ణుడనే రైతు వ్యవసాయం చేస్తున్నాడు. కొత్త వంగడాలు సృష్టిస్తూ వినూత్న పద్ధతుల్లో వ్యవసాయం చేయడం అతడికి అలవాటు. ఇందులో భాగంగానే తన కన్నవారి గురించి ఓ అద్భుతమైన ఆలోచన చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. 21 ఏళ్ల కింద చనిపోయిన తల్లిదండ్రులు ముత్తెన్న, భూదేవిల చిత్రాలు పొలంలో కనిపించేలా చేయడంతో అందరు అవాక్కవుతున్నారు. చిన్నికృష్ణుడి ప్రయత్నానికి జోహార్లు చెబుతున్నారు.
మా అమ్మానాన్న-చిన్నికృష్ణుడు అనే అక్షరాల రూపంలో పొలంలో వరి పంట పెరిగేలా చేశాడు. ఎకరం వరి పొలంలో 45 రోజుల కిందట లేత ఆకుపచ్చని చింతలూరు సన్నాలు నాటించి మధ్యలో బంగారు గులాబీ ముదురు రంగు వరిని నాటి అందులో అతడి తల్లిదండ్రుల ముఖకవళికలు వచ్చేలా చేశాడు. దీంతో చుట్టూ బోర్డర్ వచ్చేలా పంచరత్న వరిని వేశాడు. చిన్నికృష్ణుడు చేసిన దానికి అందరు ఫిదా అవుతున్నారు. కొత్త ఆలోచనకు కార్యరూపం కల్పించి తన తల్లిదండ్రులకు అంతటి విలువ ఇచ్చిన అతడికి ధన్యవాదాలు చెబుతున్నారు.
చిన్ని కృష్ణుడు తన ఆలోచనకు రూపం కల్పించడానికి ముందుగా సైన్ బోర్డు పెయింటర్ ను కలిసి తల్లిదండ్రుల ఫొటోలు చూపించి కాగితంపై గీయించుకున్నాడు. అనంతరం తాళ్ల సాయంతో పొలంలో లైన్లు ఏర్పాటు చేసుకుని కూలీలతో నాలుగు రోజులు శ్రమించి లైన్ల వెంట నిర్ణీత వరి వంగడాలను నాటించాడు. డ్రోన్ సాయంతో వారి రూపాన్ని కెమెరాల్లో బంధించాడు. దీంతో చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు సందర్శించి ఔరా అంటున్నారు. చిన్నికృష్ణుడి ఆలోచనకు జేజేలు కొడుతున్నారు. కన్నవారి రుణం తీర్చుకునేందుకు అతడు చేసిన ప్రయత్నం అందరిని ఆకర్షిస్తోంది. చిన్నికృష్ణుడి కుమారుడు అమెరికాలో ఉంటుండంతో తన తాత, నానమ్మల చిత్రాలను చూసి మురిసిపోతున్నాడు.
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Read More