Hyderabad : దిట్టంగా మసాలాలు దట్టించి.. చేస్తున్న చికెన్ పకోడి ఇదే.. అసలు నిజం తెలిస్తే మందు బాబులకు మత్తు దిగి.. దెబ్బకు వాంతి కూడా వస్తుంది!

దిట్టంగా మసాలాలు దట్టించి.. వేడివేడి నూనెలో వేయించి.. ఉల్లిపాయలు.. నిమ్మకాయ ముక్కలతో పేపర్లో చుట్టి ఇస్తే.. మందు బాబులకు ఇక పండగే. ఓవైపు గ్లాసులో మందు.. మరోవైపు కవర్లో చికెన్ పకోడీ.. మందు తాగుతూ.. చికెన్ పకోడీ ముక్కలు నంజుకుని తింటూ మందుబాబులు స్వర్గంలో విహరిస్తుంటారు.

Written By: Anabothula Bhaskar, Updated On : October 21, 2024 12:32 pm

Hyderabad

Follow us on

Hyderabad :  ఆ చికెన్ ముక్కల్లో దట్టించిన మసాలా నిజం. నూనెలో వేయించింది కూడా నిజం. కానీ ఆ చికెన్ ముక్కలే పూర్తిగా వ్యర్థం.. ఆహార తనిఖీ శాఖ అధికారుల దాడుల్లో వెలుగు చూసింది ఈ నిజం. తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్లో ఆహారతానికి శాఖ అధికారులు దాడులు చేయగా.. కుళ్లిపోయిన 700 కిలోల చికెన్ ను స్వాధీనం చేసుకున్నారు. అందులో చికెన్ మాత్రమే కాదు, మేక కాళ్లు, తలకాయలు, చర్మం, కొవ్వు కూడా ఉన్నాయి. అయితే వీటిని ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలు చేసి.. నిలువ ఉంచి.. ఆ తర్వాత హైదరాబాద్ నగర పరిధిలోని మద్యం దుకాణాలు, హోటళ్లు, బార్లకు సరఫరా చేస్తున్నారు. అయితే ఈ వ్యవహారాన్ని రట్టు చేసింది తెలంగాణ ఆహార తనిఖీ శాఖ. ఆహార భద్రత టాస్క్ ఫోర్స్ అధికారులు కుళ్ళిన మాంసాన్ని సీజ్ చేశారు. సికింద్రాబాద్లోని బేగంపేట, ప్రకాష్ నగర్ పరిధిలోని ఓ వ్యక్తి చికెన్ ను భారీగా నిల్వచేసి.. ఫ్రిజ్ లో పెట్టి అమ్ముతున్నాడు. అలా నిల్వ ఉంచిన చికెన్ ను వైన్ షాప్, బార్లు, హోటళ్లకు సరఫరా చేస్తున్నాడు. అయితే ఈ విషయం ఆహార తనిఖీ శాఖ అధికారులకు తెలియడంతో దాడులు చేశారు. ఆ వ్యక్తి నిర్వహిస్తున్న దుకాణాన్ని సీజ్ చేశారు. కొన్ని సంవత్సరాలుగా ఓ గోదాంలో కోడి కొవ్వు, కాళ్లు, ఎముకలను నిల్వ ఉంచి.. ఆ వ్యక్తి ఇతరులకు విక్రయిస్తున్నాడని అధికారులు చెబుతున్నారు. ఇలాంటి కుళ్ళిపోయిన చికెన్ ఉపయోగించి పకోడీ చేయడం వల్ల.. అనేక రకాల రోగాలు వ్యాప్తి చెందుతాయని వైద్యులు అంటున్నారు. ఉదర క్యాన్సర్ లకు కారణమవుతాయని హెచ్చరిస్తున్నారు.

ప్రజారోగ్యం దెబ్బతింటుంది

కోడి మాంసం, ఇతర పదార్థాలను ఎక్కువ కాలం నిల్వ ఉంచి విక్రయించడం వల్ల ప్రజల ఆరోగ్య దెబ్బతింటుందని అధికారులు చెబుతున్నారు.. ఆ వ్యక్తి చాలాకాలంగా ఈ వ్యవహారం కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. అధికారుల తనిఖీల సమయంలో ఫ్రిజ్ నుంచి దుర్వాసన వచ్చింది. ఆ వ్యర్ధాలు కుళ్లు కంపుకొట్టడంతో అధికారులు ముక్కు మూసుకుని తనిఖీలు చేయాల్సి వచ్చింది. ఆ వ్యర్ధాల నమూనాలను సేకరించిన అధికారులు.. తదుపరి పరిశీలన నిమిత్తం ప్రయోగశాలకు పంపించారు. అయితే హైదరాబాద్ నగరం మాత్రమే కాకుండా, శివారు ప్రాంతాల్లోని వైన్ షాప్ నిర్వాహకులకు ఈ కుళ్ళిన చికెన్ ను విక్రయించారని.. దానిని పకోడిగా మార్చి అమ్మారని అధికారుల తనిఖీలో వెల్లడైంది. ” దట్టంగా మసాలాలు దట్టించి.. దిట్టంగా కవర్లో పెట్టిస్తుంటే.. లొట్టలు వేసుకుంటూ చికెన్ పకోడి తినకండి. ఇటువంటి కుళ్ళిన చికెన్ తో తయారుచేసిన పకోడి ఎప్పటికైనా ఆరోగ్యానికి అనర్ధదాయకమేనని” ఆహార తనిఖీ శాఖ అధికారులు చెబుతున్నారు.