Tanikella Bharani on Modi: శీర్షిక చదివారు కదా.. ఈ మాట అంటున్నది మేం కాదు. నరేంద్ర మోడీ లో రాముడు కనిపించాడట. కృష్ణుడు దర్శనమిచ్చాడట. ఆది శంకరుడు సాష్టాంగంగా కొలువై ఉన్నాడట. వివేకానందుడు ఆయన రూపంలో సాక్షాత్కరించాడట. ఈ మాట ఆయన మనసులో అనుకున్నాడు.. ఆ తర్వాత బయట పెట్టుకున్నాడు.. చివరికి సోషల్ మీడియాలో నరేంద్ర మోడీపై తనకున్న భక్తిని చాటుకున్నాడు.
నరేంద్ర మోడీపై ఈ స్థాయిలో ప్రేమను కనబరిచిన ఆ వ్యక్తి పేరు తనికెళ్ల భరణి. తెలంగాణ పర్యటనకు ఆదివారం వచ్చిన నరేంద్ర మోడీని తనికెళ్ల భరణి హైదరాబాదులో కలిశారు. ఈ సందర్భంగా నరేంద్ర మోడీతో కొద్దిసేపు మాట్లాడారు. ఆ తర్వాత నరేంద్ర మోడీ చేతులను ముద్దాడారు. ఆ అనుభూతిని తనికెళ్ల భరణి గొప్పగా చెప్పుకున్నారు. ,”రాముడిని చూసే అవకాశం లేదు. కృష్ణుడిని చూసే అవకాశం రాలేదు. ఆది శంకరులను కూడా చూడలేదు. వివేకానందుడిని కనులారా చూసే భాగ్యం లభించలేదు. పైగా వారిని చూసే అవకాశం కూడా లేదు. కానీ వాళ్ళందరి అంశలతో ఉన్న నరేంద్ర మోడీ గారిని చూశాను. ముట్టుకున్నాను. చేతిని ముద్దు పెట్టుకున్నాను. నా జన్మ ధన్యమైపోయిందని” తనికెళ్ల భరణి రాసుకువచ్చారు. తనికెళ్ల భరణికి జాతీయవాదం అంటే చాలా ఇష్టం. అయితే ఆయన దానిని ఆయన ఎప్పుడూ బయట పెట్టుకోలేదు. పైగా ఆయన మాటలు రాసిన సినిమాలు.. కథ అందించిన సినిమాలు.. ఒక కోవలో ఉంటాయి. తనికెళ్ల భరణి వేషధారణకు.. భావధారణకు..ఆ సినిమాలకు సంబంధం ఉండదు . ఉన్నట్టుండి తనికెళ్ల భరణి ఇలా మాట్లాడటం.. ఇలా తన భావాలను వ్యక్తం చేయడం నిజంగా ఆశ్చర్యంగా ఉంది.
తనికెళ్ల భరణి మొదట్లో రాంగోపాల్ వర్మ సినిమాలలో కనిపించేవారు. ఆయన కోసమే రాంగోపాల్ వర్మ ప్రత్యేకంగా పాత్రలను సృష్టించేవారు. వాస్తవానికి రాంగోపాల్ వర్మ ది డిఫరెంట్ స్టైల్. ఆయనతో పని చేసిన వారిది అదే స్టైల్. కానీ తనికెళ్ల భరణి అలాంటి స్టైల్ కు దూరంగా ఉన్నారని.. ఆయన పూర్తి డిఫరెంట్ అని నరేంద్ర మోడీని కలిసిన తర్వాత తెలుస్తోంది. ఇదే విషయాన్ని సోషల్ మీడియా నెటిజన్లు చర్చించుకుంటున్నారు.. తనికెళ్ల భరణి ఇలా మాట్లాడతారని.. నరేంద్ర మోడీపై ఈ స్థాయిలో ప్రేమను కనబరుస్తారని తాను కలలో కూడా ఊహించలేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.