RK Kotha Paluku: వర్తమాన రాజకీయాలపై విశ్లేషణ చేసే పాత్రికేయులలో ఆంధ్రజ్యోతి పత్రిక అధిపతి వేమూరి రాధాకృష్ణ ముందు వరుసలో ఉంటారు. కొన్ని సందర్భాలలో ఆయన కుండ బద్దలు కొట్టినట్టు చెబుతుంటారు. అవి కాస్త రాజకీయాలలో సంచలనం సృష్టిస్తుంటాయి…
తాజాగా వేమూరి రాధాకృష్ణ కొత్త పలుకు పేరుతో సంపాదకీయం రాశారు. ప్రతి ఆదివారం ఆయన అలాగే రాస్తూ ఉంటారు. తాజా సంపాదకీయం లో తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల చోటు చేసుకున్న మున్సిపల్ ఎన్నికలు.. వచ్చిన ఫలితాలపై కీలక రాతలు రాశారు.
కొత్త పలుకు సంపాదకీయంలో రాధాకృష్ణ కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు బాగుందని చెప్పారు. రేవంత్ రెడ్డి చాకచక్యం ప్రదర్శించారని.. 116 మున్సిపాలిటీలకు 74 గెలవడం గొప్ప విషయం అని పేర్కొన్నారు.
మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలను సార్వత్రిక ఎన్నికలు ప్రభావితం చేయలేవని.. నాడు గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 120 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయని.. అప్పుడు 81 స్థానాలను కారు పార్టీ గెలుచుకుందని.. ఇప్పుడు 116 మున్సిపాలిటీలకు 74 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పాగా వేసిందని రాధాకృష్ణ పేర్కొన్నారు.
ఇటీవల రేవంత్ రెడ్డి పై కేటీఆర్ పొట్టోడా అనే విమర్శలు చేసిన నేపథ్యంలో.. వాటిని ప్రధానంగా ప్రస్తావిస్తూ రాధాకృష్ణ తలంటే కార్యక్రమం చేపట్టారు. ఉమ్మడి మెదక్, రంగారెడ్డి జిల్లాలలో మినహా మిగతా ప్రాంతాలలో కారు పార్టీకి ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదని రాధాకృష్ణ స్పష్టం చేశారు.
ఇందులో కొంత వాస్తవం ఉంటే ఉండవచ్చు. కానీ రాధాకృష్ణ ఒక విషయంలో మాత్రం తన జర్నలిస్ట్ తెలివితేటలు చూపించారు. ఎందుకంటే నాడు మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ పార్టీ ఎక్కువ స్థానాలు సాధించింది. అయితే సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిపాలైంది. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీగానే స్థానాలను దక్కించుకుంది. అయితే ఇవే ఫలితాలు సార్వత్రిక ఎన్నికల్లో ప్రభావితం కావని స్పష్టం చేశారు రాధాకృష్ణ.
ఇటీవల కాలంలో వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని.. తను ముఖ్యమంత్రిని అవుతానని రేవంత్ రెడ్డి ప్రకటిస్తున్నారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీలో ఇటువంటి విధానం ఉండదు. కానీ ఆ స్థాయిలో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారంటే ఆయనకు పార్టీ మీద.. ప్రభుత్వం మీద విపరీతమైన పట్టు లభించిందని రాధాకృష్ణ చెబుతున్నారు. అయితే సార్వత్రిక ఎన్నికల్లో మున్సిపల్ ఫలితాలు రిపీట్ కావు అని రాధాకృష్ణ అంటున్నారు. ఆ ప్రకారం చూసుకుంటే రేవంత్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి కారా? కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాలు గెలవలేదా? ఇప్పుడు ఇదే ప్రశ్నలను రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.