CM Revanth Reddy: కాంగ్రెస్ అంటేనే కలహాలు.. వర్గాలు, గ్రూపు రాజకీయాలకు కేరాఫ్. పార్టీలో వాక్ స్వాతంత్య్రం పేరుతో ఇష్టానుసారం మాట్లాడతారు. పదేళ్లు తెలంగాణలో అధికారానికి దూరంగా ఉన్న హస్తం పార్టీ 2023 ఎన్నికల సమయంలో కలిసికట్టుగా పనిచేసింది. ఇదే సమయంలో పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై ప్రజల్లో పెరిగిన వ్యతిరేకత హస్తం పార్టీని అధికారంలోకి తెచ్చింది. ఇక రేవంత్ నాయకత్వం కూడా పార్టీకి అధికారంలోకి తీసుకురావడంలో కీలకంగా మారింది. సామాన్య రాజకీయ నాయకుడిగా మొదలై, కాంగ్రెస్ పార్టీలో అసాధారణమైన ఆధిపత్యాన్ని సాధించారు. ఎలాంటి రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేకుండా, మంత్రి పదవి అనుభవం లేనప్పటికీ, ఆయన కాంగ్రెస్ అధినాయకత్వాన్ని ఆకట్టుకుని ముఖ్యమంత్రి కుర్చీని దక్కించుకున్నారు. ఆయన జనాకర్షణ, ప్రసంగ నైపుణ్యం, మరియు వ్యూహాత్మక రాజకీయ చాతుర్యం ఆయనను ఈ స్థాయికి చేర్చాయి.
Also Read: ఫిష్ వెంకట్ మరణానికి కారణం టాలీవుడ్ ఇండస్ట్రీ యేనా..? ఎందుకు పట్టించుకోలేదు!
పదేళ్ల గ్యారెంటీ సవాల్..
రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రత్యర్థి బీఆర్ఎస్ పార్టీకి గట్టి సవాల్ విసిరారు. ఆయన బహిరంగంగా ప్రకటించిన 10 సంవత్సరాల అధికార హామీ, బీఆర్ఎస్ నాయకులకు షాక్ ఇచ్చేలా ఉంది. ‘2034 వరకు తెలంగాణ సీఎం నేనే‘ అని ఆయన ధీమాగా చెప్పడం, ఆయన రాజకీయ నమ్మకాన్ని, వ్యూహాత్మక దృష్టిని సూచిస్తుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై నేరుగా సవాల్ విసురుతూ, కృష్ణా–గోదావరి జలాలపై చర్చకు రావాలని ఆయన ఆహ్వానించారు. బీఆర్ఎస్ ఓటమికి కారణం ప్రజలను నిర్లక్ష్యం చేయడమేనని ఆయన విమర్శించారు.
ఏకపక్ష ప్రకటనకు లెక్క ఇదీ…
రేవంత్ రెడ్డి తెలంగాణ రాజకీయ చరిత్రను ఉటంకిస్తూ, 1995–2004 మధ్య టీడీపీ, 2004–2014 మధ్య కాంగ్రెస్, 2014–2023 మధ్య బీఆర్ఎస్ అధికారంలో ఉన్నాయని గుర్తు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ 2034 వరకు అధికారంలో ఉంటుందని ఆయన గట్టిగా చెప్పారు. ఈ ధీమా వెనుక ఆయన ప్రజలకు ఇచ్చిన హామీల అమలు, అభివృద్ధి కార్యక్రమాలు, జనాకర్షణ ఉన్నాయి. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో తెలంగాణకు గణనీయమైన ప్రయోజనం చేకూరలేదని ఆయన విమర్శించారు.
రేవంత్ రెడ్డి రాజకీయ చాతుర్యం
రేవంత్ రెడ్డి ప్రసంగ నైపుణ్యం, రాజకీయ వ్యూహాలు ఆయనను కాంగ్రెస్లో అగ్రస్థానానికి చేర్చాయి. ఆయన బీఆర్ఎస్ నాయకులను సెటైర్లతో ఎదిరించడం, ప్రజలను ఆకర్షించే విధంగా మాట్లాడటం, అధికారంలో స్థిరత్వాన్ని సాధించేందుకు చేస్తున్న కృషి ఆయన రాజకీయ చతురతను తెలియజేస్తున్నాయి. ‘మీరు నన్ను అడ్డుకునే ప్రతీసారి నేను బంతిలా పైకి లేస్తాను‘ అని చెప్పడం, ఆయన ఆత్మవిశ్వాసాన్ని పట్టుదలను సూచిస్తుంది.
సీనియర్లకు మింగుడుపడేనా?
రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అభివృద్ధి, హామీల అమలుపై దృష్టి సారించింది. ఆయన ప్రజలకు ఇచ్చిన హామీలను వరసగా అమలు చేస్తూ, అభివృద్ధి పనులను చేపడుతున్నారు. ఈ కారణంగా ప్రజలు మరోసారి కాంగ్రెస్ను ఆదరిస్తారని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. అయితే పదేళ్ల గ్యారంటీ హామీ ఇప్పుడు సొంత పార్టీ నేతలకే మింగుడు పడేలా లేదు. నేనే పదేళ్లు ఉంటా అనడంపై సీనియర్లు గుర్రుగా ఉన్నారు. ఇప్పటికే మంత్రి కోమటిరెడ్డి బ్లాస్ట్ అయ్యారు. పదేళ్ల గ్యారంటీ హామీ కాంగ్రెస్ సిద్ధాంతానికి విరుద్ధమని ప్రకటించారు. అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని స్పష్టం చేశారు. ఇంకా భట్టి, ఉత్తమ్కుమార్రెడ్డి, దామోదర రాజనర్సింహ తదితర సీనియర్ నేతలు కూడా గుమ్మనంగా ఉన్నారు. వీరు కూడా సమయం చూసి బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంది.