Revanth Reddy Metro project approval: హైదరాబాద్లో మెట్రో సెకండ్ ఫేజ్–2 సాధించేందుకు తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి పట్టు వదలని విక్రమార్కుడిలా కేంద్రంలో మంతనాలు సాగించారు. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి కిషన్రెడ్డి సహాయంతో ఎట్టకేలకు కేంద్రాన్ని ఒప్పించారు. కేంద్ర మంత్రులతో జరిపి చర్చలు ఫలప్రదం అయ్యాయి. హైదరాబాద్ మెట్రో రైలు మొదటి దశ స్వాధీనం, రెండవ దశ విస్తరణపై జరిగిన చర్చలు సానుకూల ఫలితాలను ఇచ్చాయి. కిషన్రెడ్డితో కలిసి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తోపాటు ఇతర మంత్రులతో రెండు రోజులు జరిపిన చర్చల్లో మెట్రో ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడంలో కీలకమైన అడుగుగా మారాయి.
మెట్రో ఫేజ్–1 స్వాధీనం కోసం రుణం..
మెట్రో రైలు మొదటి దశను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం కోసం అవసరమైన ఆర్థిక అంశాలపై స్పష్టత వచ్చింది. లార్సెన్ అండ్ టూబ్రో నుంచి ఆపరేషన్లను రాష్ట్రం చేపట్టేందుకు సుమారు రూ.13,600 కోట్ల రుణం రుణం విడుదలకు సంబంధించిన అడ్డంకులు తొలగించే దిశగా చర్చలు జరిగాయి. ఆస్తుల వాల్యుయేషన్ కోసం BICAP వంటి సంస్థను నియమించే అంశంపై కూడా అంగీకారం ఏర్పడింది. ఇది సుమారు రూ.18 వేల కోట్ల విలువైన ఆస్తుల అంచనాకు సహాయపడుతుంది. ఫేజ్–1లో 69 కిలోమీటర్ల నెట్వర్క్, 57 స్టేషన్లు ఉన్నాయి. రోజువారీ సగటున ఐదు లక్షల మందికి పైగా ప్రయాణికులు ఈ సేవలను వినియోగిస్తున్నారు.
ఫేజ్–2 విస్తరణలో వేగం..
మెట్రో రెండో దశ విస్తరణపై కూడా సానుకూల నిర్ణయాలు వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)ను కేంద్రానికి సమర్పించింది. ఏడు కారిడార్లతో కూడిన 122.9 కిలోమీటర్ల విస్తరణకు సుమారు రూ.38,595 కోట్ల అంచనా ఖర్చు ఉంది. కేంద్రం ఈ ప్రాజెక్టులో జాయింట్ వెంచర్గా భాగస్వామ్యం వహించాలని రాష్ట్రం కోరుతోంది. ఈ చర్చలు విస్తరణ పనులను వేగవంతం చేయడంలో సహాయపడతాయని అధికారులు భావిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం చర్యలు..
రాష్ట్ర కేబినెట్ ఫేజ్–1ను ఎల్అండ్టీ మెట్రో రైల్ (హైదరాబాద్) లిమిటెడ్ నుంచి స్వాధీనం చేసుకోవడానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఆర్థిక, సాంకేతిక అంశాలను పరిశీలించేందుకు అధికారుల కమిటీని కూడా నియమించారు. ఈ చర్యలు ట్రాఫిక్ సమస్యలను తగ్గించడం, ప్రజా రవాణాను మెరుగుపరచడం లక్ష్యంగా ఉన్నాయి. కేంద్రం సహకారంతో ఈ ప్రక్రియ మరింత సులభం అవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
చర్చల విజయం హైదరాబాద్ నగరవాసులకు మెరుగైన కనెక్టివిటీని అందించేందుకు దోహదపడుతుంది. మెట్రో నెట్వర్క్ విస్తరణతో ట్రాఫిక్ రద్దీ తగ్గి, ప్రయాణ సమయం తగ్గుతుంది. రాష్ట్రం ఫేజ్–1ను స్వంతం చేసుకోవడం వల్ల భవిష్యత్తు విస్తరణ పనులు వేగంగా జరిగే అవకాశం ఉంది. కేంద్ర–రాష్ట్ర సమన్వయం ఈ ప్రాజెక్టును జాతీయ ప్రాధాన్యతగా మార్చేందుకు సహాయపడుతుంది.
