Revanth Reddy: జగన్ బాటలోనే రేవంత్

ఏపీలో గతంలో 13 జిల్లాలు ఉండగా.. జగన్ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వాటిని దాదాపు లోక్సభ నియోజకవర్గాల వారిగా జిల్లాలుగా విభజించారు. జగన్ తీసుకుని నిర్ణయంపై అప్పట్లో ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష టీడీపీ నుంచి కానీ..ఇతర రాజకీయ పార్టీల నుంచి కానీ..పెద్దగా విమర్శలు రాలేదు.

Written By: Neelambaram, Updated On : May 19, 2024 5:03 pm

Revanth Reddy

Follow us on

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త జిల్లాల రేషనలైజేషన్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తికాగానే తాను అనుకున్న ప్రకారం కొత్త జిల్లాల సర్దుబాటు ప్రక్రియను మెదలుపెట్టనున్నట్లు సమాచారం. అయితే రాష్ట్రంలోని కొత్త జిల్లాల రేషనలైజేషన్ విధానంపై ఆయన ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చేసినట్లు సచివాలయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. ముఖ్యంగా ఆయన జిల్లాల క్రమబద్ధీకరణ ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏపీలో అనుసరించిన ఫార్ములానే తెలంగాణలోనూ ఇంప్లిమెంట్ చేయాలని భావిస్తున్నారు.

ఏపీలో గతంలో 13 జిల్లాలు ఉండగా.. జగన్ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వాటిని దాదాపు లోక్సభ నియోజకవర్గాల వారిగా జిల్లాలుగా విభజించారు. జగన్ తీసుకుని నిర్ణయంపై అప్పట్లో ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష టీడీపీ నుంచి కానీ..ఇతర రాజకీయ పార్టీల నుంచి కానీ..పెద్దగా విమర్శలు రాలేదు. ఒక్క కోనసీమ జిల్లా పేరు ప్రతిపాదన విషయంలోనే అల్లర్లు చెలరేగాయి. అంతకుమించి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందులు ఏర్పడలేదు. అంతేకాక అందరికీ అనుకూలంగా ఉండేలా కొత్త జిల్లాల ఏర్పాటు చేయడంపై జగన్ ప్రజల నుంచి ప్రశంసలను కూడా అందుకున్నారు. ఇది ఒక రకంగా ఆంధ్రప్రదేశ్లో వైసిపికి రాజకీయంగా కొంత మైలేజ్ కూడా తెచ్చి పెట్టింది.

ఇక తెలంగాణ విషయానికొస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ జగన్ ఫార్ములానే అమలు చేయాలని ఆలోచన చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 33 జిల్లాలు ఉన్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ తో పోల్చినప్పుడు తెలంగాణ విస్తీర్ణంలో చిన్న రాష్ట్రం. అయితే ఇంత చిన్న రాష్ట్రంలో 33 జిల్లాల ఏర్పాటు అనేది అంతగా శాస్త్రీయత కాదని విమర్శలు వినిపిస్తున్నాయి. కేంద్ర డిఓపిటి కూడా తెలంగాణలో 17 జిల్లాల ఏర్పాటు సరిపోతుందని గతంలోనే సూచించింది. అయితే వీటిని వేటిని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లు జిల్లాల ఏర్పాటు చేసేశారు. ఈ నేపథ్యంలోనే స్థానిక సంస్థల ఎన్నికల తంతు పూర్తి కాగానే.. వెంటనే జిల్లాల సర్దుబాటు ప్రక్రియను మొదలుపెట్టాలని రేవంత్ భావిస్తున్నారు. ఏపీలో జగన్మోహన్ రెడ్డి దాదాపు లోక్సభ సెగ్మెంట్ల వారీగా జిల్లాలను ఏర్పాటు చేసినట్లే.. తెలంగాణలోనూ ఒక్కో లోక్సభ నియోజకవర్గాన్ని ఒక్కో జిల్లాగా చేయాలనే ఆలోచనలో రేవంత్ ఉన్నారు.

ఇందుకోసం పరిపాలనపరంగా అంతగా ప్రాధాన్యతలేని జిల్లాలను వాటి పక్క జిల్లాలలో క్రమబద్ధీకరించేందుకు అవసరమైన ప్రణాళికను రూపొందించాలని అధికారులకు సూత్రప్రాయంగా ఇప్పటికే ఆయన ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. లోకల్ బాడీ ఎలక్షన్స్ కంప్లీట్ కాగానే వెంటనే వీటిపై సీరియస్గా నజర్ పెట్టి కొత్త జిల్లాల రేషనలైజేషన్ ప్రక్రియను పూర్తి చేసే విధంగా అడుగులు వేస్తున్నారు. అయితే రేవంత్ తీసుకోబోయే ఈ నిర్ణయాలపై మునుముందు ఎలాంటి అనుకూల,ప్రతికూల పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయనేది మాత్రం వేచి చూడాల్సిందే.